మధురోహలు
ప్రముఖ
స్వాతంత్ర్యోద్యమ నాయకుడు కొండా వెంకటప్పయ్య
(జయంతి
ఫిబ్రవరి 22)
స్వాతంత్రం తరువాత కాంగ్రెస్ గురించి
ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు కొండా వెంకటప్పయ్య వ్రాసిన విషయం :
కొండా వెంకటప్పయ్య ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. స్వాతంత్ర్యం తరువాత పెచ్చుపెరిగిన అవినీతి గురించి ఆయన మహాత్మా గాంధీకి ఇలా రాసాడు. "మనం మనస్ఫూర్తిగా కోరుకొన్న స్వరాజ్యం అనే ఒకే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్ర్య యోధులలో నీతి నియమాలు అంతరించిపోయాయి. రోజురోజుకూ పరిస్థితి దిగజారి పోతున్నది. ప్రజలు కాంగ్రెస్ను దూషిస్తున్నారు. బ్రిటిష్ రాజ్యమే మేలంటున్నారు. ఇప్పుడు స్వతంత్ర దేశంలో కాంగ్రెసు అవినీతికి ఆలవాలమైపోతున్నది. వారిని అదుపు చేయాల్సిన పోలీసు వ్యవస్థ కాంగ్రెసువారి కట్టడిలో ఉండిపోయింది. పైసా ఆదాయంలేనివారు ఇప్పుడు మహారాజులలాగా పెద్దపెద్ద కార్లలో తిరుగుతున్నారు. కాంగ్రెసు ఎమ్.ఎల్.ఏలూ, ఏమ్.ఎల్.సి లు తరచు జోక్యం చేసుకోవడం వలన జిల్లా కలెక్టరులూ, రెవిన్యూ అధికారులూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. ఈ పైరవీకారుల ప్రభావం దుష్ప్రచారం భయంతో నిజాయితీగల వారు తమ పదవులలో ఉండే పరిస్థితి లేదు."
ఇది స్వాతంత్రం వచ్చిన నాలుగు నెలలలో, 1947 డిసెంబరులో కొండా వెంకటప్పయ్య మహాత్మా గాంధీకి వ్రాసిన లేఖ.
బుర్రకథ పితామహుడు - షేక్ నాజర్
(వర్థంతి
ఫిబ్రవరి 22)
వేదికపై నాజరు రాగ తాళ నృత్యాభినయ మెరుపు విన్యాసాలు చూడటం ఓ అద్భుతం. రంగస్థల మహానటుడు బళ్లారి రాఘవాచార్యులు నాజరు బుర్రకథ విని అమితానందంతో బళ్లారికి ఆహ్వానించడం, మద్రాసులో ప్రదర్శన చూచిన డా: గోవిందరాజుల సుబ్బారావు నాజరుని అభినందిస్తూ కౌగిలించుకోవడం , ప్రముఖ పాత్రికేయుడు కె.అబ్బాస్ నాజరును ' ఆంధ్ర అమరషేక్ ' అని అభివర్ణించడం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నాజరు ప్రజాభాష కు ముగ్ధుడై ' నా బిడ్డడు ఎంత ఎదిగిపోయాడో ' అని ఆలింగనం చేసుకోవడం, నాజరు సాధించిన కళాప్రతిభకు తిరుగులేని నిదర్శనాలు. మరణించేవరకు కటిక పేదరికాన్ని అనుభవించాడు.
నింగితాకే రాగతరంగం / కదనుతొక్కే కవన తురంగం /
నాజరుగళం రగడవిరుపులు / బుర్రకథా కళల వీరంగం
నాజర్
పై ప్రముఖుల అభిప్రాయాలు
- నాటకాల్లో బుర్రకథ బ్రహ్మ నాజర్ దగ్గర శిక్షణ తీసుకోవటం నా నట జీవితానికి పట్టం కట్టింది --జమున
(ఈనాడు11.11.2009)
- గుంటూరుకు ఎన్టిఆర్ వచ్చినప్పుడు నేను మీ అభిమానిని అని నాజర్ చెపితే ‘నేను మీ ఫాన్ను’ అని ఎన్టిఆర్ చెప్పి అందరినీ ఆనందపరిచారు.
- నాజర్ కథ చెప్పుతుంటే శృంగారం రసరంజకంగా గిలిగింతలు పెడుతుంది. హాస్యం నవ్వుల పువ్వులను పూయిస్తుంది. వీరం మహోద్రేకంగా పరవళ్ళు తొక్కుతుంది. కరుణం కన్నీళ్లను ధారగా కురిపిస్తుంది.హరికథకు ఆదిభట్ల ఎలాంటివాడో బుర్రకథకు నాజర్ అలాంటివాడు ---ముదిగొండ శివప్రసాద్
No comments:
Post a Comment