Friday, October 9, 2009

ప్రపంచ తపాలా దినోత్సవం - 9 అక్టోబర్

ప్రపంచ తపాలా దినోత్సవం - 9 అక్టోబర్





కాళిదాసు మేఘసందేశం మొదటి ప్రయోగం

మహాకవి తన ప్రముఖ రచన 'మేఘ సందేశం (దూతం) కావ్యంలో ప్రియా విరహంతోబాధపడుతూన్న ఒక యక్షుడు మేఘం ద్వారా ప్రియురాలికి సందేశం పంపడం ఆనాటి తపాలాశాఖవారి పని మేఘం చేత చేయించాడు. దక్షిణాన్ని ఉన్న రామగిరినుండి ఉత్తరాన్ని ఉన్న అలకా పట్టణానికి మేఘుడు ప్రయాణం చేయవలసిన మార్గం యిప్పుడు మనం ఉత్తరాలకు వ్రాసే విలాసంలో 'వయా' లాగ అనుకోవచ్చు. అలకాపురివర్ణనం, మేఘుడు యక్షుని ప్రియురాలికి అందజేయవలసిన సందేశం ఉన్నాయి. యిది ఆనాట బహుళ ప్రచారమైన ప్రయోగరచన.

మన పురాణాల్లో ఆకాశవాణి, దివ్యవాణి సందేశ సమాచారాలు

మన పురాణ ప్రబంధాల ద్వారా, ముందస్తు సమాచారాన్ని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించడం సర్వ సామాన్యంగా కనిపించే విషయాలు. కంసుడి కి అష్టమగర్భసంజాత చేతులద్వారా మరణం సంభవిస్తుందన్న వార్త కూడ ఆకాశవాణి ద్వారా చెప్పించబడింది.

అందరికీ కుశల సమాచారం

"కుశలమా ? నీకు కుశలమేనా ? ఇన్నినాళ్ళు వదలలేక, మనసు నిలుపుకోలేక, ఎదో ఎదో వ్రాశాను, ఎన్ని కబురులంపేనో, ఎన్నొ కమ్మలంపేనో, అంతే .. అంతే" అని బలిపీఠం చిత్రంలో ప్రముఖకవి దేవులపల్లి కౄష్ణశాస్త్రిగారి కలంనుంచి, విరహాన్ని ప్రేమలేఖద్వారా దంపతులకు విరహాన్ని సన్నగిల్లేలా చేశారు. ఈ విరహవేదనను తగ్గించి పుణ్యం కట్టుకున్నది మాత్రం తంతి, తపాలా శాఖవారు.

సుఖదు:ఖాల మిశ్రమం వార్తాప్రవాహం

ఉభయకుశలోపరిని అందిపుచ్చుకునే దశదిశల్లో ముఖ్య సాధనంగా తపాలాశాఖ వారి కౄషికి సమాంతరం, పర్యాయపద్ధతి యించుమించు లేనేలేదని చెప్పాలి. అభినందనలు, అభివందనాలు, విజయాలపట్ల సంతోషాన్ని ప్రకటించే సమాచారం, ప్రతినిత్యం, సత్వరంగా రాకపోకలని సాగించడం తపాలాశాఖ వారి ముఖ్య కార్యక్రమాలు అని చెప్పాలి.

ప్రపంచ వ్యాప్తంగా తపాలా కార్యకలాపాలు

రెండువేల సంవత్సరాలకు పైగా విరాజిల్లుతున్న సమాచార సేవలు, 6.6 లక్షల పోష్టాఫీసులు, 5 మిలియన్ల ఉద్యోగులద్వారా, 436 బిలియన్ల తపాలా సమాచారపు సరుకుని బట్వాడా చేస్తున్నట్లు సమాచారం. 6 మిలియన్ల పార్శిళ్ళను పంపించడం, అందుకోవడం, కావలసిన ధనం కూడ వీటితోపాటు కదలడం ప్రత్యేకతలనే చెప్పాలి. ఆధునికయుగంలో సమాచార రంగం ద్వారా అనేక వింతలూ, విడ్డూరాలూ జరగడం కూడ మనం అందరం గమనిస్తున్న విషయం. యువతకు నేటి మన్మోహనంగా భావించే 'హరీశ్ పాఠఋ పుస్తకాన్ని 2.5 మిలియన్ల కాపీలు తపాలాశాఖ ద్వారా యింటర్నెట్ సహాయం ద్వారా ఒకేరోజున జూలై 2007 నెలలో జరగడం వింతలో వింతగా భావించవచ్చు. యిది మచ్చుతునక మాత్రమే. ప్రతీ సంవత్సరం నూతనసంవత్సరం, సంక్రాంతి, దీపావళి, రంజాన్, క్రిష్టమస్ లాంటి పండుగలకు బంధుమిత్రులకు శుభాభినందనల్ని పంపడంలో తపాలాశాఖ వారి సేవలు వర్ణనాతీతాలు. ఈ సేవలకు విలువలను కట్టడం ఎవరికైనా సాధ్యమా!

ప్రపంచ తపాలా దినోత్సవం

కాళిదాసు మేఘసందేశం పద్ధతి నుంచి, ప్రస్తుతపు తపాలా వ్యవస్థ వచ్చింది. 1874 వరకూ కొనసాగిన ఈ వ్యవస్థలో సమూలమైన మార్పులకు విశ్వవ్యాప్తంగా కౄషి జరపాలని కంకణం కట్టుకున్నారు. ఈ నాటి వరకూ తపాల సేవల నిమిత్తం దేశ విదేశాల మధ్య కుదుర్చుకున్న ప్రత్యేకమైన ఒప్పందాలద్వారా తపాలాసేవలను జరుపుకునేవారు. ఈ పద్ధతిలో తలేత్తిన సమస్యలను మెరుగుపరచుకోవాలన్న తలంపుతో, అంతర్జాతీయ తపాల సంస్థను స్థాపించాలని, అమెరికా పిలుపునిచ్చింది. ఆచరణలో భాగంగా 1874 అక్టోబర్ 9 న సాధారణ పోష్టల్ యూనియన్ ను స్విట్జర్లాండ్ లోని బెర్న్ నగరంలో స్థాపించడం జరిగింది. 1878 లో ప్రపంచ తపాల కేంద్రంగా మార్చారు. జపాన్, టోక్యో లో 1969 నుంచి మాత్రం అక్టోబర్ 9 న ప్రపంచ తపాలా దినోత్సవంగా నిర్వహించాలని నిశ్చయించారు. భారతదేశంతో సహా సుమరు 200 దేశాలు సభ్యత్వంతో తపాలా కార్యక్రమాలను మరింత మెరుగ్గా నిర్వహిస్తున్న వైనం సర్వవిదితమే.

మెరుగైన సేవలు, ప్రదర్శనలు

ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా తపాలాశాఖవారు అనేక ప్రత్యేక సదుపాయాలను ప్రకటించడం, ఉన్నవాటిని మరింత మెరుగ్గా సేవలను అందించడం, పోష్టల్ స్టాంపుల ప్రదర్శనలు, సమావేశాలు, ప్రజల్లోకి వెళ్ళి కార్యక్రమాల్ని నిర్వహించడం పరిపాటిగా మారింది.

మూడు దశాబ్దాల విశ్వవ్యాప్తంగా ఉత్సవాలు

ప్రపంచ తపాలా కేంద్రం, యునెస్కో భాగస్వామ్యంతో 38 ఏళ్ళగా అంతర్జాతీయ స్థాయిలో యువతకు ఉత్తరాల్ని రాయడంలో పోటీలు నిర్వహించడం కూడ ముఖ్యాంశం అయింది.

సన్నగిల్లుతున్న పత్ర సమాచారాది తపాలా కార్యకలాపాలు

మారిపోవురా కాలం మారిపోవురా, మారుట దానికి సహజమురా అన్నట్లు మారుతున్న సమాజంపట్ల, సమాచారాన్ని వినియోగించుకునే సాధనామాధ్యమాలు కూడ మారుతున్న వైనాలు తపాలాశాఖ తన ప్రణాళికలను కొత్తపుంతలను తొక్కించడం తప్పడంలేదు. ప్రభుత్వేతర సమాచార వ్యవస్థ తీవ్రతరం దాలుస్తున్న మార్పులో, జాతీయం చేసే పరిస్థితిని దాటి బయటపడడం కష్టతరంగా భావిస్తోంది. ఈ పైనుంచి ఉమ్మడి భాగస్వామ్యం అనివార్యస్థితికి రాజీపడకతప్పక పోవచ్చు. విజాతీయకరణం, సరళీకరణం, ప్రపంచీకరణం, త్రిసూత్రపధకాలతో ప్రపంచాన్ని ఢీకొడుతున్న తరుణంలో తపాలా వ్యవస్థలో కూడ సమూలమైన మార్పులను ఆహ్వానించి, సేవలను మరింత నాణ్యతరంగా, మెరుగ్గా, నిత్య, సత్య, సత్వరంగా అందించడం తప్పితే అన్యధా శరణం నాస్తి అన్నది సత్యం, శివం, సుందరం.

కొసమెరుపు

సంప్రదాయం తాతముత్తాలనాటి మూలధనం. జాతిజీవనగతికి జీవనాళిక. ఎంత పక్షి ఆకాశం మీద ఎగిరినా, సాయంకాలానికి తన గూటికి చేరుకోక తప్పదు. అది జాతీయత, సంప్రదాయం, అన్న భావాల్ని మన కవిశ్రీనాధులు పలవరించారు. తపాలాశాఖవారు పురాణసంస్కౄతిలో మేఘసందేశం ద్వారా సమాచారాన్ని అందించి, క్రమేపీ పోష్టుకార్డులు, యిన్లాండ్ కవర్లు, కవర్లు, మనీఆర్డర్లు, టెలీగ్రాం, టెలీఫోన్లు, ఫోనోగ్రాం, పార్శిళ్ళు, శుభసందేశాలు, జనన మరణ వార్తలు, ఎన్నో, మరెన్నో జరిపారు. మార్పులో భాగంగా, పోటీరంగాన్ని తట్టుకునే దిశలో, తపాలాశాఖవారు 'మేఘదూట్ పోష్టుకార్డ్ లను 25 పైసలకు ప్రవేశాపెట్టారు తాజాగా. తపాలాశాఖవారు ఆధునికసేవల్లో భాగంగా, బ్యాంకు సేవలను కూడ అందించారు. మహిళలకు, బీదప్రజలకు, గ్రామీణులకు మరిన్ని సేవలను, మరింత ప్రతిభావంతంగా అందించేందుకు దిక్షాకంకాణాల్ని ధరించి, ముందుకు సాగుతున్నారు. వారిని మనం అందరం సాదరంగా ఆహ్వానిద్దాం. అభినందిద్దాం. సేవల్ని అందుకుందాం.
ప్రపంచ తపాలా వారోత్సవాలు, దినోత్సవం సందర్భంగా మన దేషంలోని తపాలా షాఖ, సిబ్బంది, తదితర సంబంధిత రంగం యావత్తూ, సమగ్ర సమాచార వ్యవస్థకు ప్రతీ వ్యక్తీ, సంస్థ తనవంతుగా విధుల్ని నిర్వర్తిస్తారనీ, మరింత మెరుగైన సేవలను అందిస్తారని ఆషిస్తూ అభినందనల్ని అందజేస్తూ, తెలుగురథం కూడ సమాచారాన్ని తనదైన షైలిలో అందించడానికి తన వంతు కౄషి సలుపుతుందని వాగ్దానం చేస్తూ -.
కొంపెల్ల  - అధ్యక్షులు - తెలుగురథం

1 comment:

మాలా కుమార్ said...

baagundi . mee krushi abhinandaneeyam