Friday, September 4, 2009

భావాభిరామం - ధర్మం


భావాభిరామం

ధర్మం

ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే సకలపురుషార్థాలె రాజ్యానికి ఫలం, రాజులకు, ప్రజలకూ వర్తిస్తాయి. ఐహికమైన అభ్యుదయాన్నీ, పారలౌకిక శ్రేయస్సునూ కలిగించేదే ధర్మం. దీనికి విపరీతమైన ఫలం ఇచ్చేది అధర్మం. తమకు వలెనే ఎదుటివానికి కూడా క్షేమం కలగాలని ఆలోచించడం, యథాశక్తి దానమూ చేయడము - ఇవే ధర్మప్రాప్తికి ఉపాయాలు. సకల ప్రాణులనూ సమంగా చూడడం అనేది అన్ని ఆచారాలలోకి ఉత్తమమైన ఆచారం. ప్రాణులకు ద్రోహం చేసేవాడు తలపెట్టిన ఏ పనీ కూడా శ్రేయస్సును ఇవ్వజాలదు. ఇతరులకు హింస తలపెట్టనివారి చిత్తం, వారు ఏ వ్రతాదులూ ఆచరించకపోయినా స్వర్గాన్ని ఇస్తుంది. తనకు దుస్థితిని కల్పించే త్యాగం చేస్తే చివరికి దేశాన్ని త్యజించ వలసివస్తుంది. అలాంటి త్యాగం మంచిది కాదు. ఎదుటివాడు కష్టపరిస్థితులలో ఉన్నాడని తెలిసి కూడా అతనినుంచి ఏదో పొందాలని కోరేవాడు నిజంగా శత్రువె. శరీరానికి గాని మనస్సుకు గాని ఏమి అనర్థం కలుగుతుందో అనే సంశయానికి తావులేని వ్రతమే ఆచరించాలి. 

ఇహలోకంలోను పరలోకంలోనూ లభించే ఫలం కొరకై ధనం వ్యయం చేయడం త్యాగం. అపాత్రుల/అయోగ్యుల కోసం ధనం వ్యయం చేయడం బూడిదలో హోమం చేయడం వంటిది. 

ధర్మపాత్రమూ, కార్యపాత్రమూ, కామపాత్రమూ అని పాత్రం మూడు విధాలు. ఆశ్రితుల్ని పోషించని, అధర్మాన్ని ఎదిరించని కీర్తి ఉండి ఏమీ ప్రయోజనం లేదు. గంగకు, లక్ష్మికి, పార్వతికి, శ్రీపర్వతమునకు వలె పదార్థాల ప్రసిద్ధికి కారణం వేరే ఏదో ఉంటుంది. త్యాగం మాత్రం కాదు. ఎందుచేతననగా, గ్రహించే వాళ్ళు అంతటా ఉండరు; ఎప్పుడూ ఉండరు. త్యాగం వల్ల ప్రసిద్ధి లభిస్తే, లభించవచ్చును గాని ప్రసిద్ధికి అదొక్కటే హేతువు కాదు. ఎందుచేతననగా, ఇద్దామని అనుకున్నా తీసికొనేవాళ్ళు ఉండాలి; ఎప్పుడో లభించినా, ఎల్లప్పుడూ లభించాలి అని మరొక భావం. శరణాగతులకు పంచి ఇవ్వని ధనం ఎవ్వరికీ లేకుండు గాక. యాచకులకు ఇవ్వడం, తాను అనుభవించడమూ అనేవి రెండూ ధనం ఉన్నందులకు ప్రయోజనాలు. పరమలోభికి ఔచిత్యమనేది ఉండదు. ఏదైనా ఇచ్చి, మంచి మాటలాడి ఇతరులకు సంతోషం కలిగించడమే ఔచిత్యం. తన ధనాన్ని సత్పురుషులకోసం వినియోగించి, దాన్ని జన్మంతరాలకు కూడా తనతో తీసికొనిపోయేవాడు నిజమైన లుభ్ధుడు. దానం చేయనివాడు పలికే తియ్యని మాటలు మరి ఎవరినుండైనా సంపాదించుకోవడానికి అంతరాయం. ఎల్లప్పుడూకష్టాలలో ఉండేవారిని ఎవరు ఆదుకోగలరు? ఎప్పుడూ ఏదో ఒకటి అడుగుతుండేవానిని చూసి ఎవరు విసుగుచెందరు?

ఇంద్రియాలనీ, మనస్సునీ అదుపులో ఉంచుకోవడమే తపస్సు. లేదా ఇంద్రియాలు మనస్సు నియమాన్ని అనుష్ఠించడమే తపస్సు. విధించబడిన కర్తవ్యాలు చేయడం, నిషేధించబడినవాటిని చేయకుండా ఉండడమే నియమం. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనేది సంప్రదాయసిద్ధంగా వచ్చే వినికిడిమీద ఆధారపడి ఉంటుంది.

ప్రమాణాలకి, శాస్త్రాలకి బాధ కాని, పూర్వాపరవిరోధంగాని లేని ఐతిహ్యాన్ని, వినికిడిమీద వచ్చే విషయాన్ని, మాత్రమే సత్పురుషులు విశ్వసించాలి. ఇంద్రియాల ప్రవృత్తినీ, మన:ప్రవృత్తినీ అదుపులో ఉంచుకోలేని వారు చేసే అనుష్ఠానం అంతా గజస్నానం వంటిది. ఏనుగు గంటల కొలది నీటిలో స్నానం చేసి, బైటకు వచ్చి బూడిద తొండముతొ తీసి ఒళ్ళంతా చల్లుకుంటుంది కదా! తాను ఆచరణలో పెట్టనివాని జ్ఞానం భర్తృవిహీనురాలి ఆభరణాల వలె, కెవలం శరీరానికి బరువుచేటు. పౌరాణికుల వలె, ఇతరులకు మాత్రమే ధర్మోపదేశం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతిరోజూ ఏ కొంచెమో దానం చేసేవానికీ, ఏ కొంచెమో తపస్సు చేసేవానికీ ఉత్తమలోకాలు తప్పకుండా లభిస్తాయి. పోగు చేయగా చేయగా పరమాణువులు కూడా కొంత కాలానికి మేరుపర్వతం అంత అవుతాయి కదా? ధర్మ, విద్యా ధనాలను ప్రతిరోజూ కొంచెం సంగ్రహించుకున్నా అవి సముద్రంకంటే కూడా పెద్దవి అవుతాయి.

సర్వదా ధర్మం విషయంలో జాగర్త వహించనివాళ్ళు చివరికి ఆత్మవంచన చేసుకున్న వాళ్ళవుతారు. ఒక్కమారుగా పెద్ద పుణ్యరాశిని ఎవరు సంపాదించుకొనగలరు? స్వప్రయత్నం లేనివాళ్ళ కోరికలు స్వప్నరాజ్యాల వంటివి. ఎప్పుడో చెఇన ధర్మ ఫలాన్ని ఈనాడు అనుభవిస్తున్నా తెలివి తక్కువవాడు అధర్మం అంటూ ఆచరిస్తూ ఉంటాడు. ఔషధం వలె తనకు హితకరమైన ధర్మాన్ని,  బుద్ధిమంతు డెవడైనా, ఇతరుల నిర్బంధంమీద ఆచరిస్తాడా?  ధర్మం చేస్తూన్నప్పుడు, వద్దనుకున్నా ఇతరులు ఏవో అడ్డంకులు కల్పిస్తూ ఉంటారు. అధర్మం విషయంలో ముందునడిచి దారి చూపేవాళ్ళూ, ఉపదేశాలు చేసేవాళ్ళూ కోకొల్లలు. ప్రాణాలు పోతున్నా, మంచి బుద్ధి కలవారు చెడ్డపనులు చెయ్యరు. తమ దుర్వ్యసనాలు తీర్చుకోవడం కోసం మోసగాళ్ళు ధనవంతుల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. దుష్టుల సహవాసం ఎంతటి అనర్థమైనా చేస్తుంది. అగ్నివలె దుర్జనులు తను ఆశ్రయాన్నే కాల్చివేస్తారు. అడవియేనుగ వలె తాత్కాలిక సుఖంమీద మాత్రమే దృష్టికలవాడు ఆపదలలో చిక్కుకొనకుండా ఉండడు. అడవియేనుగులను పట్టుకొనేవారు ఒక పెద్ద గొయ్యి తవ్వి, దానిని ఆకులతో కప్పి, దాని అవతల ప్రక్క ఒక ఆడ ఏనుగును నిలబెడతారు. వనగజం ఆ ఆడ ఏనుగును చూసి, తాత్కాలికసుఖం కోసం పరుగెత్తి ఆ గోతిలో పడిపోతుంది. అధర్మం వల్ల లభించిన ధనాదులను ఇతరులు, భార్యా పుత్ర మిత్రాదులు, అనుభవిస్తారు. పాపం మాత్రం తనకు చుట్టుకుంటుంది. ఏనుగును చంపిన పాపం సింహానికి; దాని మాంసం తినేవి మాత్రం ఇతర జంతువులే.

అధార్మికునికి శుభమైన భవిష్యత్తు ఉండదు. వాడు విత్తనాల ధాన్యం తినేసిన గృహస్థు వంటివాడు. కామార్థాలు విడిచిపెట్టి ధర్మాన్ని మాత్రమే సేవించేవాడు పక్వమైన క్షేత్రాన్ని విడచి చవట భూమిని దున్నుతున్నాడు. పరలోక సుఖానికి భంగం కలగకుండా బహికసుఖాలు అనుభవించేవాడే సుఖవంతుడు. చాలా ఆశ్చర్యకరమైనది ఏమంటే - అన్యాయంగా కలిగే సుఖలేశం కోసం ఆశ పడితే ఇహపరలోకాలలో నిరంతరంగా దు:ఖం అనుభవించవలసివస్తుంది. సుఖదు:ఖాదులను పట్టి ప్రాణులలొ కనబడే ఉత్కార్షావకర్షలే ధర్మాధర్మాలకు లింగం. ప్రాణులలో కొంతమంది సుఖవంతులు, కొంతమంది దు:ఖవంతులు. ఈ సుఖ-దు:ఖ-ధనదారిద్ర్యాదులను పట్టి, వారిలో గొప్పవారు తక్కువవారు అనే భేదాలు ఏర్పడుతున్నాయి. ధర్మధర్మాలనేవి ఉన్నాయి అని చెప్పడానికి ఈ భేదాలు గుర్తు.

ప్రపంచాన్నంతటినీ వశంలొ ఉంచుకొని పాలించేది అదృష్టం. దాని అధికారం చెల్లని వస్తువు ఏదీ లేదు.

బాలానందిని అను సోమదేవనీతిసూత్రాల ద్వారా ధర్మ సుముద్దేశం అందించినందుకు ఆ మహాకవిని అభినందించాల్సిందే.

కొంపెల్ల శర్మ - తెలుగురథం

 








No comments: