Thursday, September 18, 2008

తాతాజీ - ఆంధ్ర విశారద తాపీ ధర్మారావు జయంతి

'ఆంధ్ర విశారదా తాపీ ధర్మారావు కి నివాళి (19.9.1887 - 8.5.1973)
ప్రముఖుల మధ్య ప్రముఖుడు తాపీ ధర్మారావుగారు

ప్రముఖ సాహితీపరిశోధకుడు, సమగ్రాంధ్రసాహిత్యాన్ని రచించిన ఆరుద్ర, ఆంధ్రసాహితీచరిత్రను యుగాలుగా విభజిస్తూ, జమిందారీ నవ్యసాహితీయుగాన్ని విస్తారంగా వివరించడం జరిగింది. ఈ జమిందారీ వ్యవస్థలో కొంతమంది జమీందారుల వారసులు మైనర్లుగా ఉన్నప్పుడు, వారిని కళాశాలల్లో పాశ్చాత్య బోధకుల పర్యవేక్షణలో చదివించే భాగంగా, కొందరు సుప్రసిద్ధ సాహితీవేత్తలు అధ్యాపకులుగా కూడ పనిచేసేవారు. అందులో తాపీ ధర్మారావుగారు ఒకరు. ఈయన ఊర్కాడు, చుండి,దక్షిణ వల్లూరు, మందస, టెక్కలి, మరిన్ని జమీందారీ పిల్లలకు దశాబ్దకాలం బోధన చెసేవారు. సంఘసంస్కరణకాలంలో, వీరేశలింగంగారి రచనలను పుస్తకాల వ్యాపారి కేటలాగు లాగ వర్ణించారు తాపీవారు. 1905లో పర్లాకిమిడి కాలేజీలో ఎప్ఫే చదువుకొన్న తాపీ ధర్మారావుగారు గిడుగు వారి గురించి, కాలేజీ గురించి, తన ఆత్మకధ 'రాలూ-రప్పలూ' లో విపులంగా చెప్పడం పట్ల, ధర్మారావు గారికి గిడుగు పై వున్న సదభిప్రాయం చెప్పకనే చెప్పారు. కనీసపు సౌకర్యాలూ, చక్కగా పాఠాలు చెప్పే అధ్యాపకులూ ఉన్నందువల్ల పర్లాకిమిడి కాలేజీలో చాలా ప్రతిభావంతులైన విద్యార్ధులు, ధర్మారావుగారితోసహా, చేరడం, ఉత్తరోత్తరా సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు అని ఆరుద్రగారు అభిప్రాయపడ్డారు.
గిడుగువారి గురుత్వం

గిడుగువారి దగ్గర ఆధ్యయనం చేస్తున్నా కూడ, భాషాతత్వం నేర్చుకోకపోవడం వల్ల, వారి శిష్యుల్లో కొందరు గ్రాంధిక వాదులుగానే వుండిపోయారు. భాషాతత్త్వాన్ని గిడుగు వారే బాగా ఆలోచించని కాలంలో, 1905 లో ధర్మారావుగారు చదవడం, గురుశిష్యులు ఎడమొగం పెడమొగం పెట్టుకోవడం, రాజీప్రయత్నంగా గురువుకు నచ్చే దిశలో నుదుటన నిలువుబొట్టు పెట్టుకోవడం, ధర్మారావు గారి కుశాగ్రబుద్ధి గిడుగువారిని ఆనర్స్ తో మెప్పించి ప్రియశిష్యులయ్యారు. వాడుకభాషావాదాన్ని ప్రారంభించడానికి ధర్మారావుగారు 1908 లో మద్రాసు పచ్చయప్ప కాలేజీ విద్యార్ధిగా బి.ఎ. చదువుకొన్నారు. భాషాతత్త్వం గురించి అవగాహన లేక మిగతా గ్రాంధికవాదుల ధోరణి అలవర్చుకొని, 1910 లో 'గ్రాంధికభాషావాదం' పై పద్యం రచించి, గ్రామ్యమను నిక్కపు పాదరసమును గూర్చి వన్నెల కనకపు తెలుగు నీరసమౌనట్లు చేయకుండ వుండమని కోరారు. బరంపురం లో ధర్మారావుగారు స్నేహితులతో వేగుజుక్క గ్రంధమాల ద్వారా, రచనలలో గ్రాంధికమే వ్రాసేవారు.
గ్రాంధికవాదానికి కారణాలు

అందరూ ఔనన్నది కాదనాలన్న ఆశ, వాదాన్ని బలపరుస్తున్న వారందరూ బ్రాహ్మణులు కావడం, తాను తక్కువకాదన్న గూడుకట్టుకున్న అభిమానం, భాషావివాదంలో గ్రాంధికభాషనే సమర్ధిస్తూ, వారితోనే వుంటూ వారిని మించవచ్చన్న అభిప్రాయం లేకపోలేదు అని, తాపీ ధర్మారావు జీవితం-రచనలు పై పరిశోధన చేసిన ఏటుకూరి ప్రసాదు తన పరిశోధనాభిప్రాయంగా చెప్పడం జరిగింది. దాదాపు రెండున్నర దశాబ్దాల కాలంపాటు గ్రాంధికాన్ని అభిమానించి వాడుకభాషను ఎదిరించడం, భావకవిత్వాన్ని ఎద్దేవాచేయడం జరిగినా, వర్గస్వభావాలతో ప్రపంచ సాహిత్య పరిణామాల ద్వారా అవగాహన కావడం వల్ల, భాషాతత్త్వాన్ని అవగాహన చేసుకుని, వ్యావహారిక భాషావాదపు ఉప్పెనలో తడిసి 1936 లో తాపీ ధర్మారావుగారు ఎట్టకేలకు తమ కలానికున్న 'పాతపాళీ'ని మార్చి 'కొత్తపాళీ'ని వినియోగించారు, అందరికన్న మిన్నగా వాడుక భాషాప్రచారరధయాత్రలో భాగస్వామ్యం వహించారు.
పత్రికభాషగా వ్యవహారికం

1936లో జనవాణి పత్రికకు సంపాదకత్వం, వ్యవహారికాన్ని పత్రికాభాషగా ప్రవేశపెట్టడం, వీరగ్రాంధికవాదాన్నుంచి మన:ఫూర్వక వ్యవహారికోద్యమానికి సహకార, భాగస్వామ్యం వహించడమే కాక, ఉద్యమవ్యవస్థాపకులైన గిడుగువారికి లేఖలద్వారా తన మనోపరివర్తనాన్ని తెలియచేసుకున్నారని కూడ పరిశోధకులు వివరించడం, తాపీవారి ప్రతిభాపాటవాల్ని స్పష్టీకరించడం జరిగింది.
వ్యవహారిక భాషాభ్యుదయోద్యమానికి, ఆంధ్రసాహిత్యానికి విశిష్ట సేవలను ధర్మారావుగారు అందించిన తీరుతెన్నులు ఆధునికయుగానికి మరువలేని సంఘటనలుగా నేటికీ భావించబడుతున్నాయి.
బహుముఖ సాహితీవ్యాసాంగం

తాపీధర్మారావుగారు, బహుముఖసాహితీప్రక్రియలను ప్రవేశపెట్టి, పరిశోధనాత్మకాంశాలపై రచనలను చేశారు. ప్రముఖ రచనలైన, 'పెళ్ళీ - దాని పుట్టుపూర్వోత్తరాలూ, 'దేవాలయాలమీద బూతుబొమ్మలెందుకు?', 'పాతపాళీ', 'కొత్తపాళీ' లతో బాటు, ఆత్మకధనంగా 'రాలూ-రప్పలూ' ప్రత్యేకంగా ప్రస్తావించి తీరాలి. తెలుగునాట పత్రికా రచనలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టి పత్రికల రూపురేఖల్ని మార్చి, సినీమారంగంలో ప్రజల భాషను ప్రవేశపెట్టి, అనేక సాంఘిక సాంప్రదాయాలు, ఆచారాలను గురించి విశిష్టమైన పరిశోధనలు చేసి, తెలుగుజాతికి ఎంతో విజ్ౙానాన్నందించిన అమూల్యమైన జీవితానుభవాల విశిష్ట సంకలనాన్ని, తన ఆత్మ చరిత్రాత్మక స్వీయకధ ద్వారా ఆంధ్రసాహితీజగతికి అందించారు. వేగుచుక్క గ్రంధమాల స్థాపన మొదలుకొని జీవితాంతం నిర్వివామంగా సాహిత్యకౄషిని కొనసాగించిన జ్ౙానవౄద్ధులు, బహుముఖప్రజ్ౙాశాలి, కవి, పండితుడు, విమర్శకుడు, నాటకకర్త,అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, హేతువాది, చిత్రసీమలోకూడ తనదైన ప్రతిభను, కధ, మాటలు, పాటలు, దర్శకత్వ రంగాల్లో ప్రదర్శించిన ఘనుడు, ఘనాపాటి. సుపుత్రుడు చాణక్య కూడ తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నవాడు కూడ. చేమకూర వెంకటకవి రచించిన 'విజయవిలాసం' ప్రబంధకావ్యానికి, 'హౄదయోల్లాసవ్యాఖ్యానం'ను విరచించిన తాపీవారి గ్రంధం బహుళప్రాచుర్యాన్ని, ప్రాముఖ్యతను సంతరించుకోవడమే కాక, కేంద్రసాహిత్య అకాడమీ వారి పురస్కారం పొందడం ఆయన ప్రతిభాసోపానానికి సంకేతనిదర్శనం.
తాపీధర్మారావుగారు, 8 మే 1973 న సాహితీబంధువుల్ని దు:ఖసాగరంలో ముంచెత్తి, కీర్తిశేషులయ్యారు. సాహితీవ్యాసాంగం ఈ తెలుగునేలపై వున్నంతకాలం, తాపీ ధర్మారావు గారి సాహితీసుగతుని సంగతుల్ని మరచిపోవడం జరగని, జరగకూడని పనిగా భావించడం సబబు. సాహితీప్రేమికులకు తాపీవారి ఆశీస్సులు నిత్యం లభిస్తూనేవుంటాయి.
'తాతాజీ' తాపీ
తాపీ వారు 'తాతాజీ'గా సుపరిచితులు. స్వేఛ్ఛాప్రియులు, స్వతంత్ర భావాలను పుణికిపుచ్చుకున్న వ్యక్తి అవడం తన జీవితంలో ఎన్నో రకాల ఇక్కట్లకు గురైనట్లు ఆయన పేర్కొనడం గమనార్హం. 'ఆంధ్రులకొక మనవీ అన్న తొలి రచన (1911), భారత జాతీయ భావాలను వెదజల్లుతూ సమకాలీన రాజకీయాలకు అద్దంపడుతూ, కొంటెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడలాంటి పత్రికలను నిర్వహించిన నిష్ణాతుడు. విలాసార్జునం, అవన్నీ కన్నీళ్ళేనా! లాంటి నాటకాలను కూడ రచించారు. శౄంగెరీ పీఠాథిపతి చేతులమీదుగా, 'ఆంధ్ర విశారదా సత్కారాన్ని, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యత్వం, తాపీ వారి ప్రతిభాసిగలో మరుసౌరభాలే.
తాతాజీ, ఆంధ్ర విశారద, శ్రీ తాపీ ధర్మారావు గారి జయంతి సందర్భంగా తెలుగురథం - శతసహస్ర నివాళులను వినమ్రంగా సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

1 comment:

gaddeswarup said...

Thanks for the posts and a couple of requests.
If possible, please give some references and links. For some of us living abroad, Telugu books are not immediately available. If there are references, we can arrange to get them when we visit India.
Can you also please write about P.V. Parabrahma Sastry at some stage.
Thanks and regards,
Swarup