Wednesday, September 10, 2008

విశ్వనాథ విశ్వవ్యాప్తి ప్రతిభాసర్వస్వం

విశ్వనాథ విశ్వవ్యాప్తి ప్రతిభాసర్వస్వం

నిత్య సాహిత్యమహర్షికి వినమ్రనీరాజనాలు ఆయన కవిసామ్రాట్టు. కవితాశిల్పమంతా ఆయన క్రీగంట కదులుతుంది. ఆయన ఊహింపని భావం లేదు. కల్పింపని శిల్పచిత్రం లేదు. రసోచితంగా వాడని పదం లేదు. పుష్కళ భావకవి. రాశిపోసిన ఆంధ్రాభిమానం. తెలుగింట దొరసానిని సృష్టించిన అపరబ్రహ్మ. ఈయన రూపుదిద్దిన సాహితీకన్యకు జాతీయతాదృష్టి, ధర్మదృష్టి అన్న రెండు కళ్ళను అతికాడు. మానవత, భారతీయ దర్శనం, గాంధీయవాదం, భావకవి, వాక్యలయ, సామాజిక దృక్పధం, కధకుడు, పరరాష్ట్రంలో సాటి తెనుగువానికి, తెనుగువాణికి జరిగిన మహాగౌరవం నభూతో నభవిష్యత్. ఆబాలవృద్ధం ఎరుగును. వారిని ఫలానా అని చెప్పడం సూర్యుణ్ణి దివిటీతో చూపడమే. వారు పాటించిన నిదానం, స్వయంకృషి, పట్టుదల మూలహేతువులు. నా మార్గం నాదే,నేను ఎందుకు ఒకరి వెంట పరుగు పెట్టాలి ? అన్న ధృఢమనస్కుడు.

ఆయన దేశపు అత్యున్నత సాహితీపురస్కారాన్ని మన మాతృభాషలో మొట్టమొదట అందుకున్న ఘనాపాటి. విశ్వవ్యాప్తమైన "నోబెల్" సాహిత్యపురస్కారానికి ఎప్పుడో అర్హుడు. ఆయన సాహిత్యాన్ని అర్ధం చేసుకుని, జీర్ణించుకుని, వంటబట్టించుకుని, పదిమందికి సాహితీరసగుళికలను, సుమధుర, మధురస కవనఖండికలను సాదరంగా అందించడానికి అర్హత, అధికారం వున్న కవనమూర్తులు కరువవుతున్న కాలంలో ఆయన సాహితీవైభవానికి సరిసమన్యాయం జరగడం కూడ కనుమరుగవుతోందేమో అన్న భయభ్రాంతులు ఆవహిస్తున్నకాలం.

తెలుగుసాహితీమాగాణీసుక్షేత్రాల్ని దున్నిన మహాకవి. ఆయన ఎవరోకాదు. వేయిపడగలను పురివిప్పిన సత్యమూర్తి. రామాయణ కల్పవృక్షాన్ని సృష్టించిన నారాయణుడు. విశ్వానికి నిత్య సత్య పరిచితుడు - వెరసి, విశ్వనాధ సత్యనారాయణ గారు. మహాకవి.

మహాకవి శ్రీశ్రీ మాటల్లో -

"మటలాడే వెన్నెముక, పాటపాడే సుషమ్న, నిన్నటి నన్నయభట్టు, ఈనాటి కవిసామ్రాట్టు, గోదావరి పులకరింత, కృష్ణానది పులకరింత, కొండవీటి పొగమబ్బు, తెలుగువాళ్ళ గోల్డునిబ్బు, ఆకారాది క్షకారాంతం, ఆసేతు మహితావంతం, అతగాడు తెలుగువాడి ఆస్తి, అవనరతం తెలుగువాడి ప్రశాస్తి, ఛందస్సులేని ఈ ద్వివద, సత్యానికి నా ఉపద" అని వర్ణించిన తీరు వర్ణనాతీతం. నడిచేది చుక్కెదురైన మార్గాలైనా, యుభయతారకమైన ప్రతిభాన్యోన్యతను ప్రకటించుకున్న మన మహాకవిద్వయం మనకు రెండు కళ్ళు.

విశ్వనాధ జీవన సరస్తీరం

సుసంపన్న ఆంధ్ర వైదిక కుటుంబంలో శోభనాద్రి, పార్వతమ్మ పుణ్యదంపతులకు 1895 సెప్టెంబర్ 10 న పున్నామనరకం నుంచి ప్రాప్తి కలిగించిన బాలుడు. సార్ధకనామధేయం - సత్యనారాయణ. యింటి పేరు విశ్వనాధ. పేరుని నిలబెట్టిన సాహితీలోకానికి కూడ సాహితీవిశ్వనాధుడే. ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లాలోని నందమూరు గ్రామంలో జన్మించిన వీరు నందమూరు, యిందుపల్లి, పెదపాడు, బందరులో చదువులు సాగాయి. బందరులో చెళ్ళపెళ్ళ వెంకటశాస్త్రిగారి సుశిష్యరికంలో వర్ధిల్లన విద్యార్ధి. బి.ఎ. తో బందరు హైస్కూలులో ఉపాధ్యాయునిగా చేరడం, మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎ. పట్టాని ఒకేసారి సాధించారు. అనుకోని మలుపుతో, మహాత్మాగాంధి నాయకత్వంలో సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొనడం, ఉద్యోగానికి తిలోదకాలు కూడ ఒకేసారి జరిగాయి.

విద్యార్ధిగా "శృంగారవీధి"

చదువుతోపాటు, గానుగచెట్టెక్కి కూర్చుని ముచ్చటగా ముడి సర్దుకుంటూ "శృంగారవీధి" లో రసభరితంగా రచనలను అందించారు. ఆనాటి సహాధ్యాయి పింగళి లక్ష్మీకాంతంగారితో కలిసి పద్యాలను చెప్పాలన్న ఉబలాటాన్ని, నీతో కలసి పద్యాలను చెప్పాలని ఉందోయ్? అన్న ప్రశ్నకు, ఛస్! నీకేమి వచ్చు, సంస్కృతమా, తెలుగా, యింగ్లీషా! అన్న ధోరణిలో రెచ్చగొట్టబడిన పౌరుషం, ఆభిజాత్యం, విశ్వరూపం దాల్చాయి. పొంగే రక్తం పట్టుదలను పెంచింది. సంస్కృతాన్ని సాధించాలన్న సంకల్పం అధికమయింది. "సత్కవి చెళ్ళపిళ్ళ వేంకన గురువంచు చెప్పికొనగా అది గొప్ప" అన్నా, నిజగురువు శ్రీ విమలానందభారతి తో కలసి సంస్కృత రామాయణ భారతాలను పిండికొట్టారు. ఈ నిరంతర పరిశ్రమలో తమ బి.ఎ. ను కూడ తప్పారు. ఈ ఆవేదనలో, "డిగ్రీలు లేని పాండిత్యం, ఈ పాడుకాలాన పుట్టి" అని తన "ఆంధ్రప్రశస్తి" ని మల్లంపల్లి సోమశేఖరశర్మగారికి అంకితం యిస్తూ మనసులోన మాటను చెప్పారు. బందరు కవులు ముందు మెచ్చుకుంటూ వెనుక వెక్కిరించే విమర్శలకు మనసు కొంత కలత చెందిందిట.

విశ్వనాధ విశిష్టత - వింత వ్యక్తిత్వం

విశ్వనాధవారి అలవాట్లు మరీ వింతలు. మంచి వక్త. మరింత మంచి భోక్త. ఆవకాయలో పచ్చిమిరపకాయ కొరుక్కుని తిన్న తిండిని జీర్ణించుకున్న జిహ్వపై అర్ధవంతమైనవైనా, అందరూ అర్ధం చేసుకోలేకపోయారు. అసలు ఆయన పద్యాల్ని అర్ధం చేసుకునెందుకు ప్రయత్నించిన వారు అరుదు అనే చెప్పాలి. హాస్యప్రియులు. జిలేబీజాతి అని పేరు. స్టంటు సినీమాలన్నా, యింగ్లీషుచిత్రాలన్నా ఎక్కువ ప్రీతి. విరబూసిన మానవతను ప్రదర్శించిన విరాణ్మూర్తి.

"ప్రతిభ" అంచులను తాకిన విరాణ్మూర్తి, యుగకర్త

విశ్వనాధవారి తర్వాత, భారతీయ సాహితీపీఠంవారు, తెలుగులో అందించిన పురస్కారాన్ని దక్కించుకున్న ఏకైక సాహితీప్రతిభాప్రభ నారాయణరెడ్డిగారు అన్నది అందరికీ తెలిసున్న విషయమే. ఆయన మాటల్లో విశ్వనాధవారిని విశ్లేషించాలంటే -

"విశ్వనాధవారి ప్రతిభావైవిధ్యం అనన్యసాధ్యం. ఆంధ్ర సాహిత్య రంగంలో ఎన్నెన్నో ప్రక్రియలను చేపట్టి అత్యంత సమర్ధంగా అంచులు ముట్టిన విరాణ్మూర్తి. ప్రపంచ ప్రఖ్యాత నాటకకర్త షేక్స్పియర్ గొప్ప నాటకాలూ, మంచి కవితలూ రాశాడు. మహాకావ్య రచన చేయలేదు. ప్రముఖాంగ్ల మహాకవి మిల్టన్ మహాకావ్యం రచించినా, నవలా రచన చేయలేదు. నోబుల్ బహుమతి గ్రహీత, భారతీయ మహారచయిత రవీంద్రనాధ్ ఠాగూర్ అనేక సాహిత్య ప్రక్రియల్లో రసవద్రచనలు చేశాడు, ఒక మహాకావ్యం తప్ప. ఈ దృష్టిలో పరిశీలిస్తే, విశ్వనాధవారి సాహితీవ్యక్తిత్వం సర్వంకషం. నవల, కధ, నాటకం, మహాకావ్యం, విమర్శలాంటి వివిధ ప్రక్రియల్లో ఆయన అగ్రస్థాయి కృతులు రచించాడు".

పై విశ్లేషణను బట్టి, ఆంధ్రసాహిత్యరంగంలో ప్రముఖులు అన్న గణనం, గుణికం వస్తే, సంస్కృతంలో మహాకవి కాళిదాసు తర్వాత అనామిక లాగ, విశ్వనాధ తర్వాత ఎవరు అన్న ప్రశ్న వస్తే, క్షణికంపాటు ఊపిరితీసుకుని, జవాబు దొరకని ప్రశ్నలాగ గోచరించక మానదు.

సాహితీయుగకర్తకు నివాళి

"శతజయంతి" కి సార్ధకతను చేకూర్చే విధానంగా, ప్రతి నూరేళ్ళకు నవనవంగా తమ సాహిత్యాన్ని ప్రజల ఆలోచనల్లో, అనుభూతుల్లో, ఆవిష్కరిస్తూ అనంతంగా సాగేవారు అన్న భావనకు సరిసములు కేవలం విశ్వనాధ సత్యనారాయణగారు. విశ్వనాధవారు ఈ సంవత్సరం శతవర్షాధిక పుష్కర జయంతిని జరుపుకున్నారు. పదకొండవ వర్ధంతి సందర్భంగా నీరాజనాల్ని అందించే కృతజ్ణతాపూర్వక తరుణం.

విశ్వనాధ సాహితీప్రక్రియలు, తరంగాలు

అధ్యాపక పదవులు, ప్రిన్సిపాలు ఉద్యోగం తర్వాత, పూర్తిస్థాయిగా తన సమాయాన్ని సాహితీవ్యాసాంగంలో నిమగ్నమయ్యారు. 1916లో విశ్వేశ్వర శతకంతో రచనాప్రస్థానాన్ని మొదలిడారని చెప్పబడుతున్న ధారకు మరి యోగం, వేగం తగ్గలేదు. వాడి, వేడితనాలు అవేశైలిలో నడిచాయి. జాతీయోద్యమ ప్రభావంలో "ఆంధ్రపౌరుషం" మొదలుకొని, రచనాపరంపరావాహిని పుంఖానుపుంఖాలుగా విస్తరించబడ్డాయి.

విశ్వనాధసాహితీపీఠం సమాచారం మేరకు, పద్యకృతులు(31), నాటకాలు(18), నవలలు(57), కధలు/కధానికలు(30), విమర్శలు(9), సంస్కృత రచనలు(32), అనువాదాలు(3), సంపాదకీయాలు(3), పద్యాఖండికలు(186), వ్యాసాలు(60), అంగ్లవ్యాసాలు(7), ఉపన్యాసాలు(6), ముఖాముఖీలు(12), ఆకాశవాణి - ప్రసంగాలు(16),నాటకరూపకాలు(56), ప్రసంగాలు(37), గ్రంధాలకు ఆముఖాలు/పరిచయాలు(102) వెరసి, విశ్వనాధను తలమానికమైన సాహితీమూర్తిగా పరిగణించారు. వివిధభాషల్లో, 34 మంది రచయితలు విశ్వనాధవారి సాహిత్యాన్ని కొనియాడారంటేనే వారి ప్రతిభకు ప్రత్యక్షతార్కాణమని చెప్పాలి. విశ్వనాధ సాహితీపీఠం వారు చేపట్టిన సాహిత్యసంకలనంతోపాటు, ముద్దువడ్డనలు, అసంకలిత సాహిత్యం, మురిపాల ముచ్చట్లు, విశ్వనాధ సాహిత్యాన్ని, ప్రతిభావ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా వెలుగులోకి తెచ్చేప్రయత్నం అభినందనీయం. పీఠంవారు "జయంతి" సాహిత్య ప్రచురణ కూడ ప్రశంసనీయమైన ప్రస్తావన చేయదగ్గది.

రచనాపరంపరలు

విశ్వనాధవారు అంటే మనకు గుర్తుకు వచ్చేవి - కిన్నెరసాని, ఏకవీర, వేయిపడగలు, రామాయణకల్పవృక్షం పండితునికి, పామరునికి సరిసమదృష్టి కలుగుతాయి. అదే గొప్పదనం. వీటితోపాటు, ఆంధ్రప్రశస్తి, పురాణవైర గ్రంధమాల, విశ్వనాధ మధ్యాక్కరలు, రురుచరిత్రం, చెలియలికట్ట, తెరచిరాజు,స్వర్గానికి నిచ్చెనలు, ఆరునదులు, పునర్జన్మ, దమయంతీస్వయంవరం, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, ఒకడు నాచనసోమన్న, శాకుంతలం యొక్క అభిజ్ణానత, ఝాన్సీరాణి, కుమారాభ్యుదయం, విశ్వనాధపంచశతి, మృతశర్మిష్ఠమ్, దేవీత్రిశతి, గోపికాగీతాలు, భ్రమరగీతాలు, శ్రీకృష్ణసంగీతం, గుప్తపాశుపతం, ప్రద్యుమ్నోదయం, నేపాలరాజచరిత్రనవలలు, కాశ్మీరరాజచరిత్రనవలలు, సాహితీమీమాంస సంకలనాలు, ఎన్నో, మరెన్నో. వేయిపడగలు, భారతీయ ధర్మదృష్టికి నిదర్శనంగా విరాజిల్లిన ఈ రచన, అన్ని భారతీయ భాషల్లోకి అనువదింపబడడమే కాక, ప్రముఖులు పి.వి.నరసింహారావుగారి ప్రతిభాకలంతో "సహస్రఫణ్" అని హిందీలోకి అనువదింపబడింది. యిక "రామాయణకల్పవృక్షం" రచన మూడు దశాబ్దాలు పట్టిన ఉద్గ్రంధం, భారతీయ సంప్రదాయసంస్కృతీవైభవాలకు ప్రతీక. ప్రత్యేకంగా ఆంధ్రసంస్కృతీపరంపరను రామాయణకధనానికి అన్వయించిన శైలి, వైనం అనుభవించి, పలవరించగలంగాని, మాటలతో చెప్పలేని అవాక్కయిన పరిస్థితులు ఎన్నో, మరెన్నో.

విశ్వనాధ సాహిత్యపరిమళాలు

గోదావరీ పావనోదార వా:పూర మఖిల భారతము మాదన్ననాడు - అన్న మేఖ గంభీర నిర్ఘోషం వినబడగానే కలకలం చప్పున చల్లారేది. అందరూ చెవులు దోరపెట్టుకుని వినసాగేవారు. తెలుగు తెలియని యితరులు కూడ వారిని ఏదో రసధుని ముంచెత్తేది. ఈ గమకం, ఈ శయ్య, దేశంలోనే అపూర్వమని, సంస్కృతాంధ్రాలు యింతగా సహజీవనం చేస్తాయని విశ్వనాధ గళం వివరించేవరకూ తెలియని పండితగణమది. ఇలాంటి కవి దేశంలో ఉన్నారనే సంగతి కూడ తెలియకపోవటం గురించి, వారి ప్రతిభకు సిగ్గుచేటు అని పలువురు తమ శాలువాలతో సైతం ధరణికి తలదించుకున్న వైనం. హిందీలో "రీతి" సంప్రదాయానికి ప్రవర్తకులు మన తెలుగువారు. ఈ కవి రచనారీతి భారతదేశంలోనే విశిష్ఠమయింది. దీనిని, ఆంధ్రరీతి, కాదు, "విశ్వనాధరీతి" అని ముక్తఖంఠంతో ప్రస్తావించారు. మన రాష్ట్రంలో సాటి తెనువువానికి, తెనుగువాణికి జరిగిన ఆ మహాగౌరవం తలంచుకుంటే ఒళ్ళు కడిమిచెట్టవుతుంది అన్న తిరుమల రామచంద్రగారి మాటల్లో వాస్తవికత తప్ప మరేమీ గోచరించదు. విశ్వనాధవారిని ఫలానా అని చెప్పడం సూర్యుణ్ణి దివిటీతో చూపడమే.

లక్షన్నర పుటల సాహిత్యసృష్టికర్త

సాహిత్యంద్వారా తనదైన లక్షణాల్ని, లక్ష్యాల్ని సాధించిన మహామంకుపట్టుకవి. మహాకవి మధ్యలో దూరిన ఆ "మంకుపట్టు" లక్షణం వెనుక సమర్ధత, ప్రతిభ, అధికారం, కొందమందికే గోచరనీయమవుతాయి. అందుకే, నా మార్గం నాదే. నేను ఎందుకు ఒకరివెంట పరుగు పెట్టాలి? అన్న ఆవేదనాత్మక నిశ్చయంతో ముందుకు ఉరికినవారు. కొన్ని ఆవేదనలను కలిగించిన సన్నివేశాలూ ఉన్నాయి. "తన కావ్యం ప్రతివాడూ గొప్పదంటాడు. ప్రతివాడూ తన అభిప్రాయమే గొప్పదంటాడు. ఎవరో నా ఏకవీర ఉత్తమమన్నారు. నేను ఉత్తమమని ఎందుకనాలి? ఒక తరం పోయి మరొకతరం వచ్చినట్లు చెప్పిన వేయిపడగలు గొప్పదికాదా? దాని గుణగణాలు ఎవరైనా పరిశీలించారా? ఎంతో "సైకాలజీ" గుప్పించిన చెలియలికట్ట ఏమైనట్లు? పురాణవైరగ్రంధమాలలో ఒక్కొక్క నవనలో ఒక్కొక్క శ్సిల్పం చూపానే? ఎవరైనా చూచారా? మన ప్రమాణాలు నిలుస్తాయా? ఎంతో పోయె! దేవాలయాలే కూలిపోయె! అని ఆవేదన చెందిన తీరుతెన్నులు, దిగజారుతున్న సంస్కృతిని వివరించిన విధానంలో కూడ తనప్రతిభను ప్రదర్శించారు. రామాయణ కల్పవృక్షాన్ని మించిన కవిత్వం ఉండదు. సర్వశక్తులూ పెట్టి వ్రాశాను. పరమేశ్వరుడు అనుగ్రహించాడు. నారాయణుడే పరమేశ్వరుడు" అన్నారు. "రామాయణ కల్పవృక్షం" కు జ్ణానపీఠపురస్కారం సందర్భంలో, ఆనాడు, లక్షరూపాయలను స్వీకరిస్తూ, "నా జీవితంలో ముఖ్యభాగం రామాయణ రచనకు వినియోగించినట్లు, ఆ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కిందని చెబుతూ, ఆయణ్ణి నమ్ముకుని, ఆయణ్ణి స్తుతించినందుకు, నా రాముడు నాకు జీతం యిచ్చాడు. ఆ ధనాన్ని, ఆయన తండ్రి నిర్మించి, శిధిలావస్థలోనున్న శివాలయం పునరుద్ధరణకు వినియోగిస్తానని చెబుతూ, మిగతాధనం నా జేబులో వేసుకుంటానని, కానీ, నా జేబుకు చాలా చిల్లులు ఉన్నాయనే భయంవేస్తోందని చెప్పారు.

పత్రికలతో ఉగ్రవాదం

పత్రికలంటే వారు ఉగ్రులైపొయేవారు. పత్రికా సంపదకులకు శిక్షణ అవసరమని వారు నిత్యం సూచనలు చేసేవారు. ప్రతీ అడ్డమైనవాడూ వ్రాసినది ప్రచురించి సాహిత్య ప్రమాణాలు పాడుచేస్తున్నారు. పత్రికలవారు, తమ బాధ్యత గుర్తెరుగడం లేదని వారి విమర్శ తరచు జరిగేది. వారి సాహిత్యానికి విశ్లేషణ, పరిచయం, విమర్శ చేసేవాడికి కనీసం తనసాటి పరిజ్ణానం ఉండితీరాలి అని వాదించేవారు.

ప్రపంచశాంతికి వేదమే శరణ్యం

సనాతనధర్మాన్ని కాపాడుకోవాలని, వేదమతానుసరణ తప్పదు, అదివినా, ప్రపంచశాంతి ఉండదు. ఈ ఇజమూ గట్టెంకించదు. "వేదిజం" ఒక్కటే శరణ్యం అన్న భావనను విశ్వసించి, మనసావాచాకర్మణా ఆచరించిన ఆ సిద్ధాంతీకరుణ్ణి వర్ణించడం ఎవరితరమూ కాదు. మీరు సాధించింనది ఏమీలేదు అన్న సాహితీసమితి వారి ఆక్షేపణను సవాలుగా తీసుకుని, క్రోధావశులై, పాశ్చాత్య సాహిత్యాన్నే మధిచివేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, "ఇంగ్లీషులో ఏ రవీంద్రుడిలాగో, ఇలియట్స్ లాగో కవితాభాష వ్రాసే అలవాటు పోయింది; సంస్కృతంలో ఇప్పుడు వ్రాస్తే ప్రాచీన కవుల పరంపరలో ఏ వెయ్యిన్నొక్కటో వాణ్ణో అవుతాను. తెలుగులోనంటారా, పన్నెండుగురు ప్రాచీన మహాకవుల తర్వాత పదమూడవ వాణ్ణి నేను" అన్నారు. భారతదేశంలో మరేకవి రచనలకు లేని ప్రాభవం, ప్రాశస్త్యం అందుకున్నాయి. వారితో పోల్చదగినవారు - అలనాటి క్షేమేంద్రుడు, పడమటి సీమ బాల్జాక్, నేటి రాహుల్ సాంకృత్యాయనులూను" అని తిరుమల రామచంద్రగారు, మరపురాని మనీషి అని మనీషివతంసుల లీఖినీచిత్రాలను చిత్రిస్తూ, విశ్వనాధవారి వ్యాసంలో వివరించారు. రచనలను స్వంత దస్తూరీతో వ్రాయటం కన్నా, ఆయనకు భావావేశం వచ్చినప్పుడు, భాషించేవారుట. వారి ప్రశిష్యులు ఆయన చెబుతుంటే, వారు వ్రాసుకునేవారుట. ఈ పరంపరలో ఎంతమందో.

అనేకం లో మమైకమైన ఏకం - విశ్వనాధ

బహుముఖ సాహితీప్రక్రియలతో, మానవత, భారతీయదర్శనం, జాతీయతాదృష్టి, గాంధీయవాదం, ప్రభావితమైన యింగ్లీషురచనలు, భావకవి, "నేను" అన్న ధ్యాసధోరణి, ఆంధ్రాభిమానం, సృష్టించిన తెలుగు ఋతువులు, తెలుగింటి దొరసాని, వాక్యలయ, సామాజిక దృక్పధం, ధర్మదృష్టి, కధకుడు, జీవుని వేదనాప్రకటన, భావుకత, అలంకార ప్రయోగం, సమకాలీనత, భాష, సంగీతపరిజ్ణానం, హాస్యం, జానపదధోరణి, అక్షరప్రణామాలు, అక్షరప్రమాణాలు, అన్నీ కలసి, వెరసి, మన సాహితీతరంగం, కొన్ని శతాబ్దాలకి నిరాఘాటంగా, తెలుగు జీనియస్, తెలుగు గోల్డ్ నిబ్బు అని చెప్పక తప్పదు. ఎందరో మహానుభావులు, సాహితీప్రభావ, ప్రేరణలతో, ఈ సాహితీవిశ్వనాధుడికి నిత్యం కైమోడ్పులు, దోయిలిలు, కవితానీరాజనాలు, అక్షరప్రణామాలు, నవకాలు, నీరాజనాలు, సుమాంజలులు, కుసుమాంజలులు, ప్రకటిస్తూ, విశ్వనాధుని సాహితీ సమాలోచనాలు ప్రతినిత్యం, సాయంసంధ్యల్లో నిర్వహించే, సాహిత్యసభల్లో, ప్రత్యక్షపరోక్షాలుగా, విశ్వనాధుని సత్యంగా నారాయణీయంలా స్మరించాల్సిందే. నుతించాల్సిందే.

సత్కవిత్వ త్రివిక్రమా, సత్కవీంద్ర నమోస్తుతే, అని నుతించక తప్పదు.

ఏ ప్రక్రియ చేపట్టిన, ఆ ప్రక్రియలోన సిద్ధహస్తుడు; ప్రాభవం, ప్రభావం ప్రజ్ణోపజ్ణ తెలుగు తేజం. (డా. జె.బాపురెడ్డి.)

తెలుగు పలుకులమ్మ కలికి కంఠమునందు వెలయు కబ్బములను విరులదండనోలి మైరపింప గీలించినాడవు విశ్వనాధ వంశ విబుధవరుడ. (జ్ణానానందకవి).

బాణుని కలసినట్లు, హర్షునికనినట్లు,మురారిని కొల్చినట్లుగన్. (ఉత్పల సత్యనారాయణాచార్యులు).

తెలుగు సాహిత్యమును, తొట్టతొలుత, మేటి "జ్ణానపీఠ" మెక్కించిన ఘనుడతండు, ఆంధ్రులకు చిరస్మరణీయులైనయట్టి పూర్వకవులకు చెందు అపూర్వుడతడు. (డా. ఉండేల మాలకొండారెడ్డి.)

భువిని రామాయణ మహద్విభూతి యెంత వెలుగు వెలుగు నంత వెలుగు విశ్వనాధ సత్యనారాయణ వెలుగు - శారదా కటాక్ష వీక్షణ చాంధ్రీ మయాగ్ని సాక్షి. (ఆచార్య తిరుమల).

ఒక్క వైఖరి యననేల? ఒరవులన్ని పిండుగట్టి నీ కైతలో నిండెనయ్య, జ్ణానపీఠమ్ము నెక్కిన సత్కవీంద్ర సత్కవిత్వ త్రివిక్రమ స్వామి నీవు. (డా. కనుమలూరి వెంకట శివయ్య).

కల్పవృక్షపు కలికి వెన్నెల కలుపు జగతిని నాటినావు, వేయి పడగల వేదసంస్కృతి విశ్వమెల్లెడ చాటినావు, కోటి భాషా హృదయ తంత్రుల గోటి కొనలను మీటినావు, మాటలకు, మనసులకు, ఆత్మకు, ఆవలితీరం దాటినావు, విశ్వనాధ రసాకృతీ, విశ్వమే నీ ఆకృతీ! (శతావధాని. మాడగుల నాగఫణి శర్మ).

భాష నీకు గోవు భావమ్ము దుగ్ధమ్ము, గీత సంతతి నవనీత మగును, కావ్య నవ్య సృష్టి కమనీయ ఘృతమాయె, తెలుగు నీ కతమున వెలిగెనయ్య!. (ఊట్ల కొండయ్య).

తెలుగు సాహితీవేత్తల పలుకు విలువ గలుగు, పలుకు పూబోటి రాచిలుక ఇతడు, డంబుమీర, ఘనాఘనడంబరంబు బలుచ చేయు వాగ్ధాటి సంభ్రముడితండు. (ఆయాచితుల హనుమఛ్ఛాస్త్రి).

ప్రతిభయె రూపం ధరించివస్తే - విశ్వనాధుడే
హిమగిరిశిఖరం చలించి వస్తే - విశ్వనాధుడే
వర్షామేఘం కవనం వ్రాస్తే - విశ్వనాధుడే
వాణి ఆంధ్రుడై వసుధ జనిస్తే - విశ్వనాధుడే. (డా. తిరుమలశ్రీనివాసాచార్య).

మంగళమయ్య నీ విభుధమానిత దివ్యకవిత్వ శక్తికిన్
మంగళమయ్య నీవిమలమండిత భవ్య సుదీర్ఘ కీర్తికిన్
మంగళమయ్య నీదుమహిమాన్విత పాండితివిశ్వమైత్రికిన్
మంజుల కల్పవృక్ష కుసుమాంజలి పర్వుసుగంధ శ్రీలకున్. (మహాకాళి వెంకటరావు).

ప్రముఖ కవి దివాకర్ల వెంకటావాధాని గారి మాటల్లో చెప్పాలంటే, విశ్వనాధవారు - విశ్వనాధోదరాశి, పూర్ణిమాహిమభానుడు, పురుషమూర్తి, అవతరించిన వాగ్దేవి - వెరసి, విశ్వనాధ సత్యనారాయణ గారు అన్న సత్యభావనతో ఈ సాహితీధృవతార పై నీరాజనాభరిత వ్యాసానికి భరతవాక్యం పలకడం ఉచితం, సముచితం.

7 comments:

మాగంటి వంశీ మోహన్ said...

bAvuMdi SarmagArU. wonderful

కొత్త పాళీ said...

చాలా సంతోషం.
విశ్వనాథని గుడ్డిగా అభిమానించిన వారు, లేక అంతే గుడ్డిగా ద్వేషించిన వారు తప్ప, నిజంగా ఆయన బహుముఖ ప్రజ్ఞనీ, ఆయన ఆలోచనల లోతునూ అందుకుని అర్ధం చేసుకున్న వారు లేరనిపిస్తుంది నాకు.
నోబెలు బహుమతి పొందిన అనేక ప్రపంచ రచయితల అనేక రచనలు చదివాను. వారిలో చాలా మందికంటే సృజనలో గానీ, భావగాంభీర్యతలో గాని విశ్వనాథ చాలా ఎత్తున ఉన్నారు.

kiran said...

I wish font were larger enough to be able to read

Unknown said...

Thanks for the above comments which encouraged me in my approach. Regarding font, I am facing problem and I concur with readers. I will soon solve the problem. HOwever, various telugu fonds are unable to get them synchronised with each of them. Let us all try to solve it.

kbssarma

Unknown said...

విశ్వనాథవారి గురించి చాలా విషయాలు చెప్పారు.చాలా సంతోషం కలిగింది

గిరి Giri said...

అత్యద్భుతంగా వ్రాసారండీ శర్మగారు.

అక్షరాలు పెద్దగా కనబడాలంటే బ్రౌజరులో లార్జ్ ఖతిని (font) ఎంచుకుంటే ఇప్పటికి సరిపోతోంది.

మీరు ప్రచురించేటప్పుడు పెద్ద ఖతికి మార్చారంటే సరిపోతుందేమో.

గిరి

Unknown said...

గిరి గారికి, ధన్యవాదాలు. చిన్నపాటి అక్షరాలను రానీయకుండా ప్రయత్నిస్తాను. శర్మ.