Tuesday, September 16, 2008

విశ్వజనీన సంగీత సర్వస్వ కళానిధి - సుబ్బులక్ష్మి

విశ్వజనీన సంగీత సర్వస్వ కళానిధి - సుబ్బులక్ష్మి
సంగీత కళానిధి, తపస్విని, సుస్వరలక్ష్మి
నేనెవర్ని? కేవలం ఓ ప్రధానమంత్రిని, ఈ సంగీత కళానిధి ముందు నేనెంత? అని భారతదేశపు తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వినమ్రుడై, యం.యస్.సుబ్బలక్ష్మి పై అభిమానాన్ని ప్రకటించాడు.సుబ్బలక్ష్మి మీరాకు ప్రతిబింబంకాదు; మీరాయే వచ్చి సుబ్బలక్ష్మిగా నటించి వెళ్ళింది - అని మీరా చలనచిత్రానికి దర్శకుడు డంకన్ పలవరించాడు.ఆమె ఒక తపస్విని అని ప్రముఖ గానకోకిల లతామంగేష్కర్ అన్నారు.ఉస్తాద్ బడే గులాం ఆలీఖాన్, సుబ్బులక్ష్మిని సుస్వరలక్ష్మి అని అన్నారు.
సంగీతం అంటే ప్రాణమే అన్న యం.యస్. పుణికి పుచ్చుకున్న విదుషీమణి, నిగర్వీ, క్షీరాబ్ధికన్యక. నాకు భక్తి సర్వస్వం అని సవినయంగా ప్రకటించుకున్నారు.
శక్తి + రక్తి + భక్తి + ముక్తి = సంగీతం = మధురై షణ్ముఖవడిపు సుబ్బులక్ష్మిసంగీతంలో శక్తి కావలసిన వాళ్ళకి శక్తీ, రక్తి కోసం పాకులాడేవాళ్ళకి రక్తీ, భక్తి పారవశ్యంలో ఉన్నవాళ్ళకు భక్తీ, ముక్తికై తపించే వాళ్ళకు ముక్తీ దొరుతుతాయి. వీటన్నింటినీ కలబోసి బ్రహ్మ సౄష్టించాడు మన మధురై షణ్ముఖవడిపు సుబ్బులక్ష్మిగా. సంగీతజగతి ప్రేమగా పిలుచుకునే యం.యస్. అన్నదే సంగీత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైంది.
సంగీత ప్రచారంతో ధన్యజీవనంభరణీ నక్షత్రంలో, తులాలగ్న, మేషరాశిలో, సుబ్రహ్మణ్యయ్యర్, వీణైషణ్ముఖవడివు దంపతులకు తమిళనాడు, మదురైలో 16 సెప్టెంబర్ 1916 న జన్మించిన 'సుబ్బూ తన బాల్యాన్ని సంప్రదాయ సంగీత వాతావరణంలో గడపడం శుభారంభ సుకౄతం. తల్లితండ్రులు ఈఅమెను రాజతిప్ప (తండ్రి)గాను, కుంజమ్మ (తల్లి) గాను ముద్దుగా పిలుచుకునేవారు. కుటుంబ వాతావరణం సంగీతమయమే. అమ్మమ్మ అక్కమాల్ వైలన్ వాద్యంలోను, తల్లి వీణాకళాకారిణి అవడం మరింతగా వన్నెలబ్బాయి. మధురై, పశ్చిమ హనుమంతరాయన్ వీధిలో జన్మించిన ఈ కళామతల్లి, కేవలం పదేళ్ళవయసులోనే 78 ఆర్పీయం తో తన కోకిలగానాన్ని - మరకత వడివు అన్న గీతం - ముద్రించుకోగలిగిన ఈ విద్వన్మణి ప్రముఖులైన శ్రీ సెమ్మనగుడి శ్రీనివాస అయ్యర్, పండిట్ నారాయణరావ్ వ్యాస్ ల వద్ద సంగీతశిక్షణను పొందారు. 1932 లో మద్రాసు మ్యూజిక్ అకాడమీలో కచేరీని ప్రతిభావంతంగా నిర్వహించిన, ఈ కళాకారిణికి, మహమకం లో(కావేరీ తీరాన), మహారాజపురం విశ్వనాధ అయ్యర్ నుంచి బంగారుపతకాన్ని స్వీకరించారు. 1940 లో సదాశివం తో వివాహమైన సుబ్బు, గాంధీ దర్శనం కలగడం, 'హరితుమా గానం చేయడం ఆమె జీవితానికి ఒక మరపురాని సంఘటన అంటారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, మొదటిసారిగా మహిళకు లభించిన సంగీతకళానిధితోపాటు, అత్యంతోన్నత సత్కారమైన భరతరత్న పురస్కారాన్ని 1998 లో సుబ్బులక్ష్మి స్వీకరించారు.
చిత్రాతిచిత్రంగా చిత్రరంగప్రవేశం1937 లో చిత్రరంగంలో కూడ కాలుమోపిన ఈ చిన్ననాటి కుంజమ్మకు, ప్రముఖ సంగీతకారుడు పాపనాశం శివన్ సంగీత దర్శకత్వంలో, నటేశ అయ్యర్ నాయకునిగా, సేవాసదన్ (1932లో) చిత్రంతో చిత్రాతివిచిత్రంగా చిత్రరంగ ప్రవేశం జరిగింది. వెనుతిరగని ఈ సంగీతలక్ష్మి, నారదపాత్రలో సావిత్రి (1942), ప్రముఖ సంగీతకారుడైన జి.యన్.బాలసుబ్రహ్మణ్యన్ తోపాటు శకుంతల (1943) విజయవంతమైనాయి. అయితే, ప్రత్యేకంగా చెప్పుకోతగ్గది మీరా చిత్రం. ప్రముఖులు చిత్తూర్ వి. నాగయ్యతోపాటు యం.జి.ఆర్. కూడ చిన్న పాత్రలో నటించిన మీరా (తమిళం) చిత్రానికి, ప్రముఖ రచయిత కల్కి సంభాషణలతో, తలమానికంగా విరాజిల్లనిది మాత్రం సుబ్బు నటనాకౌశల్యాన్ని, ఈనాటికీ చెప్పుకోవడమే ఆనాటి గొప్పదనం నేటికీ చిరస్మరణీయం. అందుకే మీరా చిత్రాన్ని అదే పట్టుదలతో హిందీలో నిర్మించి అక్కడకూడ అధ్బుతవిజయాన్ని సాధించారు.
సంగీతలహరిగురువులు కూడ గుర్తించలేని లక్షణశైలి, రసధ్వని ప్రధానమైన భావాలోచనాలు నిత్యం ప్రవహించేవి. మానవునిలో భక్తికూడ పెరుగుతూంటుంది అని, ఆ భక్తుని హౄదయంలో, నివాసంలో, దర్శనీయమయ్యే భగవంతుడు, ఆ దైవంపై ప్రకటించవలసిన భక్తిధ్యానాదులపై దౄష్టిలోనుంచుకుని, భక్తుల మేధస్సును పదునుపెట్టేలా, స్వరరాగభావప్రవాహాన్ని తమదైన శైలిలో అనేకవేలకువేలు కీర్తనలను, రచనలను స్వరపరచి, తనగానంద్వారా సంగీతప్రచారాన్ని ప్రతిభావంతంగా అర్ధశతాబ్దకాలంపాటు నిరంతరంగా సమాజసేవలను అందించిన ఘనత కేవలం యం.యస్. కే చెల్లుతుంది.
సంగీతం ద్వారా సమాజసేవలుమానవసేవయే మాధవసేవ అన్న సూత్రాన్ని మనసావాచాకర్మణా విశ్వసించి, సంగీతం ద్వారా, సమాజానికి వివిధ ప్రక్రియల్లో సేవను అందించారు. 200 పైకి సహాయ కార్యక్రమాల్ని అందించిన అమూల్యాన్ని, ద్రవ్యంతో విలువకట్టాలంటే, ఆ విలువ 30 మిలియన్ల రూపాయలను సౄష్టించింది. ఆర్ధికపరమైన సమాజసేవలను గుర్తించి ఆమెకు మెగస్స్యే పురస్కాన్ని అందజేశారు. ఆమె సంగీతం ద్వారా లబ్ధి పొందిన సంస్థల్లో, ఉదాహరణకు వీటిని చెప్పవచ్చు.
కస్తూర్బా స్మారకనిధి, గాంధీస్మారకనిధి, త్యాగరాయ శతవర్ష నివాళిసంఘం, సేవూర్ క్షయ వైద్యశాల, శంకర నేత్రాలయ, ఇంద్రప్రస్థ మహిళా కళాశాల, సుబ్రహ్మణ్యభారతి స్మారక సంస్థానం, నానక్ సంస్థానం, వాలంటీర్ ఆరోగ్య సేవాసంస్థ, రామకౄష్ణ మిషన్, న్యూయార్క్ హిందూ దేవాలయం, కంచి మహాస్వామి మణిపంటపం, సముద్రి, కమలానెహ్రూ వైద్యశాల,దక్షిణ భారత విద్యాసంస్థ, తిరుమల తిరుపతి దేవస్థానం, కాన్సర్ సంస్థ,మ్యూజిక్ అకాడమీ, సంస్థలు కేవలం సూచిక క్రిందకే వస్తాయి. ఈ సేవల జాబితాలు అంతులేని కధనాలుగా చెప్పాలి.
స్వంత సేవాసంస్థలు
సముద్రి, సుబ్బులక్ష్మి-సదాశివం సంగీత నృౠత్య పరిశోధనాసంస్థ (శౄతి నిర్వహణ), సంప్రదాయ సంగీత పరిరక్షణం, భారతీయ సంస్కౄతిని విశ్వవిఖ్యాతం చేయడానికి ప్రముఖంగా చెప్పుకోవాలి. మణిమంటపం - కంచి మహాస్వామికి ఈ దంపతులిద్దరూ అపార భక్తాగ్రేసరులు.
అనుభవ ప్రవచనాలుయం.యస్. తన సంగీత కచేరీ చేస్తున్నప్పుడు తీసుకునే జాగ్రత్తల విషయానికొస్తే, రాగస్వరూపాన్ని, ప్రారంభంలోనే రసికునికి త్వరితరీతిని అవగాహనకు రావాలని, అనవసరపు ఉత్కంఠను రేపకూడదని, ప్రస్తుతించే రాగం - పూర్వికళ్యాణియా లేక పంతువరాళియా అన్న రెండు రాగాల్లోని అంతరం, ముందుగానే తెలపాలి అన్న భావాన్ని ప్రతీ కచేరీలోను ప్రకటించారు అని ఆమె రసికులు, సంగీతప్రేమికులు, నిత్యం పలవరించే మాటలే. రాగాలాపనలో మూడు స్థాయిల్లోను సక్రమంగా పాటించడం విధిగా ఆచరించాలంటారు. అసమంజస, అసంభవ ధోరణులకు కడుదూరంగా వుండాలని, వీణలాంటి సంగీత సాధనాల ద్వారా గురుత్వాన్ని స్వీకరించాలి అని చెబుతారు. సంప్రదాయాన్ని గౌరవిస్తూ, ఆచరిస్తూ, సంగీతాలాపనతోపాటు, సాహిత్యోచ్ఛారణంలో సమప్రాధాన్యం యిచ్చి తీరాలన్న భావన ముఖ్యమనేవారు. సంగీతశిక్షణలో అనుభవం వున్న గురువు దగ్గర కనీసకాలంపాటు సుశిక్షణాభ్యాసాలు పూర్తిచేయాలని, నిరంతర అభ్యాససాధనలే ప్రతిభాపధంవైపు పయనింపజేస్తాయని తరచుగా వివరించేవారు. స్వరరాగాలాపనతోపాటు, సాహిత్యాంశం పై అవగాహన, భావసౌందర్యం, తాత్పర్యం, అలవరచుకోవాలంటారు.
సుబ్బులక్ష్మి వ్యక్తిత్వంలో ప్రధానాంశాలు
సంగీతకళానిధి యం.యస్. కేవలం సంగీతలక్ష్మి, నటి, సేవాపరురాలు కాదు. మనందరికీ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అవి యివి :
శిక్షణ పొందిన భరతనాట్య కళాకారిణి.వైణికురాలు, తల్లినుంచి శిక్షణ, సెమ్మనగుడి శ్రీనివాస అయ్యర్ కచేరీకి వీణావాదనం.సోదరుని నుంచి మౄదంగం అభ్యాసం పొందడం, ప్రతిభావంతమైన మౄదంగవాదనంలో ప్రవీణురాలు.ప్రముఖ సంగీతకళాకారుడు చెంబై వైద్యనాధన్ ఈమె కచేరీకి వైలన్ స్వరాన్నందించారు.కీర్తనల పాఠాల్ని ఎన్నడూ కచేరీ చేస్తున్నప్పుడు దగ్గరగా వుంచుకోవడం అలవాటేలేదు.శివం - శుభం అన్న యింటిపేరులోనే భక్తిపారవశ్యపుభావం.శంకరాభరణరాగం - అత్యభిమానపాత్రమైనది.మనసుమెచ్చే రంగు - నీలవర్ణం.ఐస్ క్రీం అన్నది జీవితాంతం రుచి చూడనేలేదట.శీతలపానీయాలన్నవి కూడ దరికి రానిచ్చేవారు కాదట. గొంతుని ప్రాణప్రదంగా చూసుకోవడంలో రాజీలేని మార్గాన్ని అవలంబించారు.
శస్త్రచికిత్సను నిరాకరించిన వైద్యుడుమధురగానకోకిల గాత్రం కదా. ఆ గాత్రానికి ఎందరు మహానుభావులు, భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డలు ఈమె స్వరప్రస్థానానికి చెవులు కోసుకునేవారో. 1930 ప్రాంతంలో యం.యస్. గొంతుకు గద్గదం ప్రవేశించడం మూలాన, వైద్యుని సంప్రదించారు. అందులో, ప్రముఖులు, విశ్వవిఖ్యాత శస్త్రనిపుణులు - డా. పి.వి.చెరియన్, ఆమె గొంతుకకు శస్త్రచికిత్స చేసేందుకు భక్తితో నిరాకరించారట. అది వాస్తవానికి, వౄత్తికీ, ప్రవౄత్తికీ, వర్ణనాతీతమైన సంఘర్షణ, అనుభవించిన వారికే అవగతం.
1997 లో భర్త సదాశివం మరణం తర్వాత యం.యస్. సంగీతానికి స్వస్తి, భరతవాక్యాన్ని స్వరపరిచారు.
చరమపర్వంసంగీతలక్ష్మీసరస్వతీసంగమమైన యం.యస్.సుబ్బులక్ష్మి మానవజన్మకు సార్ధకతను తెచ్చిపెట్టినవి - ఆమె గానంచేసినవి - శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, శ్రీ విష్ణుసహస్రనామావళి, అర్ధశతాబ్దపుకాలంపాటు ఈ విశ్వంభర ప్రతీ గౄహాన్నీ పావనం చేశాయి. ఆశ్చర్యం ఏమిటంటే, హిందువులే కాక, యితర మతస్థులు కూడ భక్తిభావనతో వీటిని విని యిప్పటికీ పరవశం పొందుతారట. తమిళులకు పుణ్యతిధిగా భావించే అమావాస్య నాడు, సుబ్బులక్ష్మి 11 డిసంబర్ 2004 న తమ అంతిమశ్వాసను విడిచి, ఈ భౌతికలోకంనుంచి మాత్రమే తప్పుకున్నారు. ఈ సంగీత కళామతల్లిని స్మరించని, శ్రవణం చేయని గౄహం లేదు; మనస్సు లేదు; స్పందించని హౄదయం లేదు.
శ్రేయోభూయాత్ సకల జననం
బిలియన్ (100 కోట్లు) జనాభాకు ప్రతినిత్యం మేలుకొలుపుల ద్వారా విశ్వసౌభ్రాత్రత్వం, ప్రపంచశాంతిని అందిస్తున్న ఈ నైటింగేల్ - సంప్రదాయ భక్తి సంగీతజగతికి స్వరసర్వస్వం. ఆమె ఒక సంగీతవిశ్వవిద్యాలయం.
సుబ్బులక్ష్మి సంగీతానికి సమాంతరాలు, రూపాంతరాలు
సర్వకళలకూ గానమే మకుటాయమానమైతే, గాత్ర సంగీత విద్యా రహస్యాల్ని వన్నెచిన్నెలతో కూర్చి, పేర్చిపెట్టిన సంగీతకళానిధి, భక్తి సంగీత సర్వస్వం, యం.యస్.సుబ్బులక్ష్మి అనీంటారు, ప్రముఖ పాత్రికేయుడు, అధికారభాషాసంఘం అధ్యక్షులు, ఎ.బి.కె.ప్రసాద్ గారు. యం.యస్. సుబ్బులక్ష్మి సంగీతం అనగానే, ప్రతీ మనస్సుకీ, హౄదయానికి హత్తుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఉదాహరణలు :
కొలువుదా భక్తి కొండల (కేదారగౌళ), పరమ పురుష (షణ్ముఖ), దీనుడ నేను దేవుడనీవు (సావేరీ), మరలి మరలి జయమంగళం (రాగమాలిక), ఇదియే సాధన (రీతి గౌళ), స్వరరాగసుధ, నీనామమె (మధ్యమావతి) కీర్తనలను చెప్పుకోకుండ వుండలేరు.
ఎ.బి.కె. ప్రసాద్ గారు తన నిబద్ధాక్షరి - సాహిత్యకీయాలు అన్న సంపాదకీయాల సంకలనంలో, 'భక్తి సంగీత సర్వస్వం 'సుబ్బూ అన్న అనుభూత్యాత్మక,ఆలోచనాత్మక వ్యాసంలో ఉదాహరించిన భరతుని సూక్తిని పున:ల్లేఖితమైతే :
"అలంకారం లేని సంగీతం, చంద్రుడు లేని రాత్రి, నీరులేని నది, పుష్పాలు లేని లత, ఆభరణాలు లేని వనితా లతోపాటు, సుబ్బులక్ష్మి గాత్రంలేని మేలుకొలుపు, ఆమె సంగీతస్వరరాగప్రాభవాన్ని స్మరించని సంగీతకార్యక్రమం, ఆలోచనకు రాలేని భావం, భావన.
యం.యస్. సుబ్బులక్ష్మి సంగీతరాగస్వరాలాపనలు, ప్రతి జీవరాశి మనసుకి, హౄదయానికి ఆనందం, ఉల్లాసం, సర్వాలంకారశోభాయమానంగా అలరిస్తాయన్న మాటలు సత్యశివసుందరభరితాలు.
ప్రశంసల ప్రవాహం
సుబ్బులక్ష్మీ! రామధున్ నువ్వే గానం చేయాలి. - మాహాత్మాగాంధి.
నాదేముంది? నేను ఒక దేశానికి ప్రధానమంత్రిని మాత్రమే! ఆమె సంగీత సామ్రాజ్యానికి మహారాజ్ౙి. - జవహర్ లాల్ నెహ్రూ.
తన 'భారతకోకిలా బిరుదును సుబ్బులక్ష్మికిచ్చేస్తున్నాను. - 'భారతకోకిలా సరోజినీనాయుడు.
సుబ్బులక్ష్మి సంగీత విద్వాంసులకే విద్వాంసురాలు - కామ్రేడ్ జ్యోతి బాసు.
సరస్వతి వీణాపాణి - అయితే, సుబ్బులక్ష్మి వీణా కంఠి. - కరైకుడి సాంబశివ అయ్యర్.
ఆహా! ఏమి స్వరం! ఆ స్వరంలో ఎంత వశీకరణ శక్తి వుంది! - చెంబై వైద్యనాథ్ అయ్యర్.
కళారంగంలోని వారిని నడిపించేవారు ఒకరు వుండాలి. ఈ విషయంలో సుబ్బులక్ష్మి అదౄష్టవంతురాలు. ఆవిడకు సదాశివం (భర్త) ఉన్నారు. - డా. మంగళంపల్లి బాలమురళీకౄష్ణ.
ప్రశంసలైనా, పురస్కారాలైనా, సుబ్బులక్ష్మి సంగీతసామ్రాజ్యానికి చేసిన సేవలకు, సంఘసేవకు లభించిన వరాలే! కళాసేవ ద్వారా మన దేశానికి, విశ్వానికి విఖ్యాత వైభవాల్ని తెచ్చిపెట్టిన మహిమాన్విత మనీషి, మహిళామణి, కళాకారిణి, సంగీతకళామహారాజ్ౙి - యం. యస్. సుబ్బులక్ష్మి.
డిసెంబర్ 11, 2004 ఒక దుర్దినం. సంగీతకళారంగానికి పగలే నిశీధి ఆవహించిన రోజు. సుబ్బులక్ష్మి మననుంచి భౌతికయానం గావించినా, మనందరి మనోవాక్కాయకర్మల్లో, అనునిత్యం, నిరంతరం, ఈ పట్టమహిషి ప్రతిభ ప్రతినిత్యం - సుప్రభాతం నుంచి పవళింపు సమయం వరకూ, ఆ పైన స్వప్నాకౄతిలో మనకు దర్శనీయయోగాన్ని, యోగ్యతను అందిస్తూనే ఉంటారు.
నేడు, మధురై షణ్ముఖ వడివు సుబ్బులక్ష్మి, సంగీత సరస్వతి జయంతి సందర్భంగా, ఆ మహనీయురాలికి శతసహస్ర సరాగభరిత నివాళిని, నీరాజనాల్ని, సమర్పిస్తూ, తెలుగురథం ఆ సంగీత కళానిథి కి పాదాభివందనాల్ని సమర్పించుకుంటోంది.
తెలుగురథం - కొంపెల్ల శర్మ.

No comments: