Monday, July 21, 2008

నటనారంగ వైభవమూర్తి
మానవుని సౄజనాత్మక ప్రతిభ సుందరరూపంలో వ్యక్తమయ్యేది కళల్లోనే అంటారు సంజీవదేవ్. అయితే కళను కళగా అర్ధం చేసుకున్న కళకారుడికి ఎప్పుడూ సంతోషం లేదు. కళాప్రతిభను ప్రదర్శించే కొద్దీ, యింకా సాధించవలసినది కనపడుతూనే వుంటుంది. ఆ తపనతోనే విషాదమునూ, ఆనందమునూ, అని అంటారు, ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్, తన ప్రముఖ నవల వెన్నెల్లో ఆడపిల్ల లో.
విద్యతోపాటు కళారాధన
మొదటి ప్రపంచయుద్ధం ముగుస్తున్న రోజులవి. అది ఆంధ్రప్రదేశ్, కౄష్ణాజిల్లా లోని నూజివీడు గ్రామం. ఆ రోజు జూలై 3, 1918. సామర్లకోట కోటేశ్వరరావు, లక్ష్మీ నరసాయమ్మ దంపతులకు పుత్రుడు కలిగిన ఆనందలహరిలో తేలియాడుతున్న రోజు. ఏడుకొండలవాని యిలవేల్పువల్ల, ఆ బాలునికి వెంకట రంగారావు అని పేరుపెట్టారు. అతని పేరు యస్.వి.రంగారావు. ఎవరీ రంగారావు అని వేరే ప్రశ్న అడగడం, సమాధానపరచుకోవడం అనవసరం అని నిర్ధారణతో యిక్కడ వివరణ యివ్వడంలేదు. అయితే కోటేశ్వరరావు ఎక్సైజ్ యినస్పెక్టర్ ఉద్యోగి. రంగారావు, పుష్కరప్రాయం కాకుండానే నాటకాలు, రంగస్థలంపై శ్రద్ధను చూపాడు. మద్రాసు పై చదువుకి పంపడం జరిగింది. డిగ్రీ చదువుతున్నా, మనసుమాత్రం నాటకాలు, నటన, సినీమాలతోనే ఆవౄత్తాలు కొట్టేది. చదువయ్యాక, అగ్నిమాపకశాఖలో అధికారహోదాలో ఉద్యోగం దొరికింది. అయితే ఆలోచనమాత్రం - పై చదువా లేక కళారంగంలోకి దూకడమా అన్నదే మీమాంస.
తొలిగా వరించి, వదలిన వరూధిని
బంధువు రామానంనందం పిలుపు మేరకు, ఉద్యోగం కూడ వదలి, తొలిచిత్రం వరూధుని (1946) ని అందుకునేందుకు చేరడం, నటనకు నాందీగా ప్రవరాఖ్యునిగా మారడం, పరాజయంతో నిరాశతో వెనుతిరగడం జరిగింది. అటువంటి చిత్రం వచ్చింది అన్న సంగతే, వెంటనే మర్చిపోవడంతో, ఏ నిర్మాత ముందుకు రాలేదు. జెంషెడ్పూర్ లో టాటా కంపెనీలో ఉద్యోగం చేరినా నాటకాలను మాత్రం మర్చిపోలేదు. 1947లో లీలావతితో వివాహం జరిగింది. తర్వాత, బి.ఎ.సుబ్బారావు నిర్మిస్తున్న పల్లెటూరుపిల్ల చిత్రంలో ఆహ్వానం వచ్చి ప్రయాణం అయితే, తండ్రి మరణించడం వల్ల అంత్యక్రియలు జరిపి, మద్రాసుకి పయనమయ్యాడు. ప్రతినాయక పాత్ర అయినా, ఆయన చేరుకునేసరికి దక్కకుండా పోయింది. జరిగినవన్నీ మంచికని అనుకోవడమే మనిషిపని అన్న ఆత్రేయగారి వాక్యాలు, రంగారావుకు పనికివచ్చాయి. ఫలితంగా, విజయాసంస్థ వారి పాతాళభైరవి లో అధ్బుతమైన నేపాళీమాంత్రికుని పాత్ర వెతుక్కుంటూ వరూధుని కన్న సుందరంగా వరించింది. ఈ పాత్రను రసభరితంగా పోషించడానికి, షేక్స్పియర్ - మర్చంట్ ఆఫ్ వెనిస్ నాటకం లోని షైలాక్ దుష్టపాత్ర శైలి బాగా ఉపయోగించింది అని ఆయనే స్వయంగా చెప్పారట.ఫలితంగా, ఒక ప్రతినాయక పాత్ర చేయి దాటిపోయినా, మరొక మహత్తర దుర్భిణీధారణపాత్రతో పాటు ఢింబకుడు కూడ లభ్యమయ్యాడు. ఆనాటి నుంచే, 'సాహసము సేయరా ఢింభకా' అన్న నానుడి తెలుగుప్రజల నోళ్ళ నిత్యనాట్యం చేసింది. ముందుగా షావుకారు, పల్లెటూరిపిల్ల, నవ్వితే నవరత్నాలు చిత్రాల్లో పాత్రలు విశిష్టమైనవైనా, అసలు మంత్రదండం మాత్రం పాతాళభైరవి తోనే లభించింది.
నిగ్రహం, ఆగ్రహం - వెరసి రంగరంగ వైభవ విగ్రహం
పోషించిన ప్రతీ పాత్రలో సజీవ వైవిధ్యం, వర్ణించనలవికాని నిగ్రహం, విన్నూత్నమైన అహంకారపూరిత సాధికారిత, ఆయన ప్రతిభావంత విగ్రహపాత్ర చుట్టూనే రప్పించుకుని, తిప్పించుకునే ప్రేక్షకుల నయనాలు, ఆచి తూచి కదలాడే కదలీకదలని కదలికలు, హావభావ గంభీర మేని మెలికలు, వాగర్ధావివసంపౄక్తౌ అన్నట్లు ఆయన చెప్పే మాట-అర్ధంల అవిభాజ్య సమ్మేళణం, క్రమశైలిలో, క్రమశిక్షణతో వదిలే సంభాషణాచతురవచోవిలాసశోభాకౄతులు, రంగారావులో మాత్రమే ప్రతీపాత్రలో కనిపించే కనువిందులు. సంతౄప్తి లేని సమరం, కళావేశం, నవరసాలసారాన్ని నాలుగు నిమిషాల్లో ప్రదర్శించగల ప్రతిభానటచక్రవర్తి, సవ్యసాచి, సామర్లకోట రంగారావు. ఆయన పాత్రకిచ్చిన సుదీర్షసమాసాల్ని, సంభాషల్ని, ఎన్నడూ చిన్నచూపు చూడలేదు. రంగారావుగారి నోటనాని, అవి మరింత పునీతమయ్యాయి - రాముడు తాకిన రాయి అహల్యగా రూపాంతరం చెంది ముక్తి,విముక్తి ని పొందడం జరిగాయి.
చిత్రాల వరస .. కొల్లేటి చాంతాడే కదా!
విద్యాధికుడు, కరుణార్ద్రపూరితుడు, మానవతాప్రేమికుడు, కళారాధకుడు అయిన సామర్లకోట వెంకటరంగడు, మరపురాని, మరువలేని, మరువకూడని, నటుడు, దర్శకుడు, నిర్మాత, ఏకంలో అనేకం.
అసాధారణాలు - సాంఘికచిత్రాలు
షావుకారు (సున్నపు రంగడు), పల్లెటూరి పిల్ల (తాత), పెళ్ళిచేసిచూడు (జమిందార్ వియ్యన్న), దేవదాసు (జమిందార్ నారాయణరావు), బంగారుపాప (కోటయ్య), మిస్సమ్మ (గోపాలం), సంతానం (రంగయ్య), తోడికోడళ్ళు (కుటుంబరావు), అప్పుచేసిపప్పుకూడు (దివాన్ బహదూర్ ముకుందరావు), పెళ్ళినాటిప్రమాణాలు (భీమసేనరావు), గుండమ్మకధ (రామభద్రయ్య), వెలుగునీడలు (రావుబహద్దూర్ వెంకట్రామయ్య), మురళీకౄష్ణ (మురళి తండ్రి పాత్ర), ప్రేమనగర్ (జమీందార్ పాత్ర), యిద్దరు అమ్మాయిలు (నారాయణరావు) - రంగారావుగారి నటనాజీవనపుస్తకంలో ప్రముఖ పుటలు.
సాంఘికేతరాలు - పరిపుష్టిత పౌరాణికాలు
పాతాళభైరవి (నేపాళమాంత్రికుడు), చంద్రహారం (ధూమకేతు), అనార్కలి (అక్బర్), వినాయకచవితి (నరకాసురుడు), సారంగధర (రాజరాజనరేంద్రుడు), మాయాబజార్ (ఘటోద్గజుడు), చెంచులక్ష్మి (రెండు భాగాల్లోను - హిరణ్యకశిపుడు), భూకైలాస్ (మాయాసుర), జయభేరి (విజయానంద రామగజపతి), మహాకవి కాళిదాసు (భోజరాజు), హరిశ్చంద్ర (హరిశ్చంద్ర మహారాజు), దీపావళి (నరకాసురుడు), పాండవవనవాసం (దుర్Yఓధన), శ్రీకాకుళాంధ్రమహావిష్ణువుకధ (సుచంద్రసేన మహారాజు), దక్షయజ్ణం (దక్షుడు), నర్తనశాల (కీచకుడు), బొబ్బిలియుద్ధం (తాండ్రపాపారాయుడు), భక్తప్రహ్లాద (హిరణ్యకశిపుడు), సంపూర్ణరామాయణం (రావణ), బాలభారతం (భీష్మ) లాంటి చిరస్మరణీయ పాత్రల్లో నటించిన, కాదుకాదు, జీవించిన, రంగారావుగారు తన నటనాపర్వాన్ని యశోదాకౄష్ణ (కంస) తో భరతవాక్యాన్ని పలికారు.
అల్లు లో మల్లు లాంటి పాత్రలు
ఒకసారి రైల్వే ఫ్లాట్క్ ఫార్మ్ పై ముక్కుపుటాలను తరచు ఎగరేసే విచిత్రవ్యక్తి కదలికలను గమనించి, తనదైన హాస్యాన్ని జోడించిన పెళ్ళిచేసిచూడు చిత్రంలోని దూపాటి వియ్యన్న, మార్క్ ట్వైన్ రచన ఆధారంగా, రాజు-పేద చిత్రంలో దుష్టులపన్నాగాన్ని కనిపెట్టడం, యువరాజు భవితపై కలతచెందడంలో భాషకు అందని భావవీచికల్ని అందించారు. సిలాస్ మేరినర్ రచన ఆధారంగా, బి.యన్.రెడ్డిగారు తీసిన బంగారుపాప లో త్రివేణీసంగమానుభూతుల్తో - అమాయకత్వం, ఆవేశం, శాంతం, మూర్తీభవించిన కోటయ్యగాను, శరత్ చంద్ర నవల నిషృకౄతి నవలాధారంగా తీసిన తోడికోడళ్ళు లో మతిమరుపు లాయర్ కుటుంబరావు పాత్రలో, నమ్మినబంటు చిత్రంలో సాత్వికభూమిక, లాంటి పాత్రలను ప్రపంచంలో సరితూగగల మహానటులను వేళ్ళమీద కూడ లెక్కించలేమేమో!
విశేషాలు, విశిష్టతలు
మొరటుతనం లేని గొప్పదనం వున్న రంగారావు క్రైం, యాక్షన్ చిత్రాలు - దెబ్బకు ఠా దొంగలముఠా, జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు, కత్తులరత్తయ్యలు వైవిధ్యభరితాలైతే, స్వీయ దర్శకత్వంలో చదరంగం, బాంధవ్యాలు - నంది పురస్కారం పొందగలిగిన చిత్రాలను నిర్మించడం సరదా అని చెప్పుకున్నారు. పంజరంలో పక్షులు నాటకంలో నటించడం కూడ విశేషమే అని చెప్పాలి. నాటి, నేటి మేటి కృరీడ - క్రికెట్ అంటే అమితాభిమానం, రవీంద్రుని కాబూలీవాలా పాత్ర వస్తే ఉచితంగా నటిస్తాననడం, పౄధ్వీరాజ్ కపూర్, సి.హెచ్.నారాయణరావు లంటే వల్లమాలిన అభిమానగౌరవాలు, మచ్చుకు చెప్పుకోతగ్గ ఆణిముత్యాలు.
సత్కారాలు, సన్మానాలు
జకార్తా ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో నర్తనశాల లో కీచక పాత్రకు ఉత్తమ నట పురస్కారం, శాన్ సెబాష్టియన్ చిత్రోత్సవంలో నమ్మినబంటు లోని సాత్వికభూమికకు మరువలేని పురస్కారాలు, అందుకున్న రంగారావుగారు, మననటులు మహామహానటులు అనిపించక తప్పదు.
మార్గదర్శి, నటనాలయం, శబ్దకోశం
ఆయన నటన ఒక విశ్వవిద్యాలయం; పాత్రద్వారా చెప్పిన ప్రతీమాట సాధికారికమైన శిక్షణాభాగం; మార్గదర్శి; జ్ణానపధం; వాచికాభినయనం ఒక శబ్దకోశం; పాత్రలకు న్యాయం చేయడం, పాత్రలో జీవించడం, సర్వసాధారణాలు. యింక ప్రత్యేకతలను ఎలా వివరించాలో తెలియని తికమక, అయోమయ పరిస్థితి అని చెప్పాలి.
ఏదైనా, ఏమైనా, ఎనలేని నటనం
సాంఘికం, జానపదం, చారిత్రాత్మకం, పౌరాణికం, ఏదైనా, సరిసములు లేని ప్రతిభానటనాతరంగాలు, కరుణాంతరంగాలు, హౄదయవేదనలు, మనస్సుతో వాదనలు, ఆత్మాభిమానం, అహంకారం, అధికారం, సంపన్నత్వం, నిరుపేదతనం, ఏదైనా సరే, సర్వం ప్రతిభామయం, నటనామయం. దక్షిణభారత చలనచిత్ర పధంలో నవనవోన్మేషనటుడు, అధికుడు, అగ్రజుడు, అధిష్టాత, బలాఢ్యుడు, సామర్లకోట వెంకట రంగడు - అదే మన యశస్వి, యస్వీ. మనందరి యస్.వి.రంగారావు.

అసమాన నటశేముషితో సకలాంధ్రప్రజానీకాన్ని అలరించి, మురిపించిన, రంగారావుగారు, పుట్టిన నెల, జూలై, 18 న తనువు చాలించడం కూడ జరిగింది. ఆయన వ్యక్తిలోని కళకు, కళాభివ్యక్తీకరణానికి, జోహార్లు, నివాళీసహస్రాలు, సుస్మరణాక్షరలక్షలు సమర్పణ చేద్దాం.

నవరస నటనాసార్వభౌముడు యస్.వి.రంగారావు గారి జయంతి సందర్భంగా ఆ మహాఅనటసేఖరుని ప్రతిభాపాటవాలకు జోహార్లని అర్పిస్తూ, శతసహస్ర ప్రణామాల్ని తెలుగురధం సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

No comments: