Tuesday, January 29, 2008

కవితా సుమాలతో మహాత్మునికి స్మౄతినివాళి (1869 - 1948 )

కవితా సుమాలతో మహాత్మునికి స్మౄతినివాళి (1869 - 1948 )
- కొంపెల్ల శర్మ

గాంధీ వర్ధంతి - జనవరి 30 - 'హే రాం!' కు షష్టిపూర్తి

ఆరు దశాబ్దాల ఆరని భావాగ్ని యింకా రగులుతూనేవుంది।

పుట్టినరోజు భారతీయులకు పుణ్యతిధి

గుజరాత్, పోరుబందర్ లో 2 అక్టోబర్ 1869 జన్మించిన కరంచంద్ గాంధీ, తన చదువును స్వదేశంలో పూర్తిచేసుకుని, న్యాయవాదం లో చదువుకోసం యింగ్లండు ప్రయాణమయ్యాడు। చదువు పూర్తిచేసుకుని, బారిష్టర్ హోదాలో 1891 లో తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. గాంధీ తన 'ఆత్మకధాను 'మై ఎక్స్పెరిమింట్స్ విత్ ట్రూఠ్ అన్న రచన నిత్య సత్య స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. సమాజోద్ధరణ కోసం పాటుపటిన నిష్కళ్మష కరుణామూర్తి. సమాజంలో మతసామరస్యతను, ప్రశాంతతను కోరిన ఈ మహాత్ముడు, తానే ఒక మతదురహంకారి, నాధూరాం గాడ్సే ఘాతుకానిని గురయి, తుపాకీ గుండి తన గుండెలో దూసుకుపోగా, హేరాం' అని నేలకొరిగిపోయాడు, మన జాతిపిత, మహాత్ముడు. మోహనదాసు కరంచంద్ గాంధీ.

ఆయన మహానుభావుకతకు, త్యాగనిరతకు నివాళులను సమర్పించాల్సిన ఘనతరుణం నేడు। మహాత్మునికి మహనీయమైన నివాళి.

ఆ రోజు 1948, జనవరి 30. భారతదేశ ప్రజావాహిని స్వాతంత్ర్య సంబరాలు ఏడాది పూర్తి కాకుండానే, బానిస పరిపాలన నుంచి విముక్తి పొందడానికి తనదైన కౄషిని నభూతో నభవిష్యత్ అన్నట్లు సేవలను అందించిన తీరుతెన్నులు కొంతమంది మతోన్మాద వ్యక్తులకు కన్నుకుట్టినట్లు అయింది. ఫలితంగా జాతిపిత, మహాత్మాగాంధి, మోహన్ దార్ కరంచంద్ గాంధీ, వినాయక్ రాం గాడ్సే తుపాకీ గుళ్ళకు బలి అవడం, తుపాకీ గురిపెట్టే ముందు గాంధీకి ప్రణమిల్లడం, వెనువెంటనే మహాత్ముని పేల్చడం, ఒకే ఒక తుపాకీ గుండు దూసుకుపోతకు, జాతిపిత, 'హేరాం' అని నేలకి వొరిగిపోయాడు. విశ్వవ్యాప్తంగా, జనవరి 30 న ప్రతీ సంవత్సరం ఉదయం 11 గంటలకు జాతిపిత నివాళి నిమిత్తం రెండు నిమిషాలు మౌనం పాటించడం, భారతదేశం ప్రజలు యావత్తూ, జాతిపితకు ప్రకటించుకునే కనీస ౠణం. యిలా, కొన్ని వేల ఏండ్లు చేసినా, గాంధీజీ మనకు అందించిన అప్పు తీరనే తీరదు. నిత్యం ౠణగ్రస్తులమే అన్నదాంట్లో విడ్డూరం లేదు. ఏది ఏమైనా, గాంధీజీ మరణం సమయంలో, వెలువడిన ఆఖరి పదం - 'హే రాం!' అన్నపదం నేటితో ఆరుపదుల వసంతాలను పూర్తిచేసుకొంటున్నది. హే రాం కు షష్టిపూర్తి అన్న భావం మాత్రం సత్యం.
మహాత్ముని జీవనసారాంశం

దక్షిణాఫ్రికాలో ప్రారంభమైన గాంధీ రాజకీయ జీవితం, గత శతాబ్దపు ప్రారంభంలో, నిరాకరణోద్యమంతో శ్రీకారం చుట్టబడింది. 1916 లో భారతదేశం తిరిగి వచ్చి, జాతీయ స్వతంత్రోద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. గాంధీ నాయకత్వంలో, నేతౄత్వంలో అనేక ఉద్యమాలు నిర్వహించబడ్డాయి. ముఖ్యమైనవి - నిరాకరణోద్యమం (1920), పౌరహక్కుల ఉల్లంఘనోద్యమం (1930), క్విట్ యిండియా ఉద్యమం (1942) గాంధీ జీవితాన్ని, నడతను వెన్నంటుతూ వున్నాయి అని చెప్పాలి. 1930 లో గాంధీజి, ఉప్పు సత్యాగ్రహం (దండి ప్రస్థానం). హరిజనులోద్ధరణ కోసం పాటుపడ్దాడు. అప్పటివరకూ అంటరానివారు గా పరిగణింపబడుతున్న వారికి 'హరిజనా నామధేయం కొత్త తరహా అనుభూతిని చెందుతారు. 'అంటరానితనం' భగవంతునిపై, సమాజంలో సాటి మనుషులపై ప్రకటించే పాపం అనే చెప్పాలి అని భావించాడు. 'భారతదేశ జాతిపితా అన్నది ఒకే ఒక మనిషికి దొరకిన వరప్రసాదం. అహింసా ధోరణిని అవలంబిస్తూ, సత్యవ్రతానికి జీవితాంతం ధారపోసి, ఆచరించిన సత్యవ్రతామూర్తి, మోహన్ దాస్. హిందు-ముస్లిముల సమైక్యత, సహకారం కోసం అహర్నిశలు శ్రమించిన శక్తిమానుడు.
మనవాడే కాని అందరివాడు

భారతీయుడైనా, ఆయనను మనవాడని చెప్పుకోవడం సంకుచితసమానం. ప్రపంచం తనవాడిగా ఏనాడో చేసుకుంది. ఆయన కరుణకు పర్యాయపదం. సత్యం, అహింసలతో ముక్తి సాధించిన మహాతపస్వి. మానవజాతి చరిత్రలో అత్యున్నత స్థానమలంకరించిన మహనీయుడు. నిరుపేద, బలహీన ప్రజలకు కొండంత ధైర్యమిచ్చిన దీనజనబాంధవుడు. తనకోసం కాక మనకోసం బ్రతికిన మహామనీషి. ఆయన గురించి ఎవరు, ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ ప్రజల హౄదయాల్లో ఆయన ప్రసాదించిన ఆశాజ్యోతి. మానవజాతి వున్నంతవరకూ వెలుగుతూనే వుంటుంది. ఆయన అసలు మానవ మాత్రుడేనా అని గొప్ప అనుమానం రాకమానదు. ఆ మహానుభావుడి గురించి కవిత రాయని కవులు భారతదేశంలో వుండరు. ఆయన జయంతి దినోత్సవం సందర్భంగా, కొందరు ప్రముఖుల కవితాసుమాల ద్వారా ప్రకటించిన స్మౄతి నివాళి సారాంశాన్ని చెప్పే చిరు ప్రయత్నం.
ఆయన, ఆ మహామనీషి ఎవరో కాదు। ఆయనను - జాతిపిత, మహాత్ముడు, బాపూజీ, గాంధి అని పిలుస్తుంటారు. అసలు పేరు - 'మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.

ఒక జయంతిని చేయుటకంటే ఒక్క మాట నిజం పలుకుట మేలు। గుండె పవిత్రమగును. గాంధి, బుద్ధుడు, హరిజనులు సంతోషిస్తారు(1).

అతడు సామాన్య వ్యక్తి। అతడసామాన్య వ్యక్తి. తౄణంకన్నా తేలిక. మేరువుకంటే ధీరుడు. ఆగర్భ శ్రీమంతుడు. నిత్యదరిద్రనారాయణుడు. వయస్సు మీరిన బడుగు. వయస్సులేని విసువు. అన్యాయం సమక్షంలో అగ్రమహోదగ్రమూర్తి. చరాచర ప్రపంచానికి క్షమా మార్గదర్శి. అతడిప్పుడు లేడు. అతడెప్పుడూ వున్నాడు. అమరత్వం అందుకున్న అతనికి మా నుతులు(2).

ఇతడు బాపూజీ। బోసినవ్వుల తపస్వి. భారత మహా స్వతంత్ర రణాంగణ్మున సర్వ సేనాని. సత్యాగ్రహ ప్రణేత. సర్వ సర్వంసహా పరిత్రాణ కీర్తి(3).

మన గాంధీ గుణకంధి। మరికానబడడా! తానిచ్చినది భారత స్వరాజ్యము కాని, పుచ్చుకొన్నది మొక్కవోని స్వారాజ్యము!(4)

కట్టుకున్నాడు మోకాలు తాకెడి రీతి అంగవస్త్రము। నేసినట్టిదానిని నాడు సన్యాసిపోల్కి తత్సమయంబునం దోచె. భరతఖండమునకు భయము లేదనిపించె. పరిశుద్ధమనిపించె బాపూజీ గాత్రంబు (5).

ఆయన పేరు సత్యం। భారతీయ సముద్రగర్భంలో దొరకిన మానవముత్యం. ఆయన వూరు పోరుబందరు. ఊరిలోనే పోరున్నదని ఉలిక్కిపడ్డారు కొందరు. దారితప్పి చెట్టుకింద చేరిన బాటసారులకు ఎటు గమ్యమో అప్పుడు తెలిసింది. దాహంతో నాలుక పీక్కుపోతున్న పాంధులకు ఏ దిక్కు సరోవరమో అప్పుడు తెలిసింది(6).

సత్యాహింసలు రాజకీయ రధానికి పూంచిన తొలిసారధి। ఊతకర్రతో ఊర్వారనే ఉర్రూతలూపిన సేవాచార్యుడు. చిరునవ్వుతో శాత్రవ హౄదయ మాలిన్యాన్ని ప్రక్షాలించిన ఘనుడు. ప్రేమతో ప్రపంచాన్ని గెలిచిన ఘనుడు. విశ్వమానవ మహితాత్ముడు. గాంధీమహాత్ముడు(7).

సేదగొన్న శ్రమజీవికి శరణం। పల్లెవాకిటికి పచ్చతోరణం. అంధ జగతికాశారుణ కిరణం. మరివేరెవ్వరు! మా బాపూజీ(8)

కొల్లాయి గట్టితేనేమీ, మా గాంధీ కోమటై పుట్టితేనేమీ? వెన్నపూసా మనసు, కన్నతల్లీ ప్రేమ, పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు, బోసి నోర్విప్పితే ముత్యాల తొలకలే, చిరునవ్వునవ్వితే వరహాలు వర్షమే, చకచక నడిస్తేనూ జగతి కంపించేనూ,పలుకు పలికితేనూ బ్రహ్మ వాక్కేనూ(9)

అదెగో రాట్నము చేత దేశజులకు ఆహారంబు కల్పించి అభ్యుదయాపాదక సామరస్యమునకు ఆయుర్దాయమున్ పోసి, గాంధితాత ౠణమున్ విశ్వంబెటుల్ తీర్చునో(10)!

రామమంత్రమ్ములో ఐక్యమై, మహర్షి యతడు, వాల్మీకి రామైక్యమందినాడు, తాత మంత్రంబులో ఐక్యమై తపంబు పండి, తేజస్సు నేనుగా పరిణమింతు(11)

కత్తి కదల్చలేదు! విశిఖాలు విదల్చనులేదు గాండీవంబెత్తనులేదు! ఏ క్రియ జయించితివో నరమాంస పారణోన్మత్తుల? నీ ప్రభావములమానుషముల్ భవదీయ శంతిసంపత్తికి దోసిలొగ్గెను ప్రపంచము భారత భాగ్య దేవతా!(12)

శిలువమీది ఏసు వీవె చిరంజీవి బాపూ! వషకషకపు సోక్రటీసు వీవు కావా బాపూ! కాళరాత్ర గర్భ దీప్తి కలి కౄతముగ సంధీకరున కంధి శాంతిపంధి కర్మవీర గాంధీ! జాతిపితా! కైమోడ్పులు చేతుమోయి నేడు, శ్రద్ధాంజలి ఘటించి నీ జయంతినాడు ప్రజా హృదయ ఫలకమ్మున ప్రత్యక్షమ్ముకమ్ముజ్, సత్య మార్గమనుసరించు శక్తిని మాకిమ్ము।(13)

అల్ల ధర్మరాజును ఎరింగినట్టివాడు, తిక్కనార్యుని పుణ్యాన తెలుగువాడు, నీ అహింసను నీ నీతి నియమములను బట్టి అతడు నిను గుర్తుపట్టగలడు(14)।

సరసచేరిన సిద్దార్ధ శాక్యయోగి, తాను చెప్పని భక్తి తత్వమ్ము చెప్పి జాతి నడిపించి వావని సంతసించు, స్వర్గరాజ్యం నీ వేగు సమయమందు(15)

భయంకర స్వార్ధాస్ఫాలితమై, సర్వదేశప్రజ సంక్షోభిస్తే, సత్యహింసల బోధన చేసీ, నిరంతరం మా హౄదంతరంలో ... (16)

పాలసముద్రంలో నడచివచ్చిన రీతి, హిమాచలాగ్ర శౄంగాలు కరాలుసాచి మనకై అరుదెంచిన భాతి, శాంతి సత్యాలు మనుష్యరూపమును దాలిచి నేలకుడిగినట్లు గాంధీ లలితాత్ముడుజ్జ్వలమతిన్ భరతావనిపైన కాలిడెన్(17)

అడవి స్మౄతి తప్పిపోయినట్టి బుద్ధదేవునకు పాలుపోసెనే దివ్యమాత, ఆ సుజాత నీ గొంతులో అమౄతరసము పోయెదేల నేడు అదౄష్టముగ మహాత్మా(18)

మా భావములన్ సువాసనలు పైకొన విచ్చిన యీ కౄతజ్ణతా ప్రావౄత పుష్పముల్ నీకిడుచుంటిమో అహింసావశ కర్మయోగి! మము పాకతమొప్ప నను గ్రహింపవే(19)

దెక్కెరుంగక లేబవల్ దేవురించు, ప్రజకునేర్పితివి ఆత్మగౌరవ సమీక్ష, బాపూజీ స్రష్టనీవు నీ చూపుసోకి, ద్రష్టలైనారు కొందరీతరమువారు(20)

హరి సౄజించె నరుని అచ్చమ్ము తనపోల్కి, నరుడు తన్నుబోలి హరి సౄజించె, ఇనుమి పైడిజేయు నీశ్వరుండే నేర్చు, కడలివోలె నెల్ల కడల నీశ్వరుండుండ, బిందువై వసించునందు నరుడు, కడలి బాసి బిందువడగారు నిక్కము, గాంధి పలుకు ధర్మగంధమొలుకు(21)

శిల్పసూత్రార్ధాలు తెల్పు సౌందర్యాలు, స్వల్పమై మూర్తిలో దేశదేశాల ఆశాంతాల వెలిగిస్తూ, నీ బోసినవ్వులో నీ సౄష్టివాక్కులో నీ కన్నుజంటలో రేకలు తిరుగుతూ మహాత్మా!లోకమోహనమయ్యె హిమాలయోత్తుంగశౄంగం నీ బ్రతుక్(22)

పాడితప్పి జనము పాడగుచున్నారు। నడపుదారి విడిచినారు. రకరకాల హింస రగులుచున్నది నేల, ఎవరితోడ విన్నవింపవలయు? నీవు లేవు సరియె నీ నీడయునులేదు, నీదు బోధలెల్ల నేల గలిసె, నిన్ను బొమ్మజేసి నిలుచుండబెట్టిరి, ఒక్క దిక్కు లేదు, మొక్కు లేదు, నీకివె జోతలు గాంధీ! నీకిదె కైమోడ్పు నిఖిల హౄత్ సంవర్తా, నీకు నమస్కారమిదె చేకొనుటకు నీవులేక చేవ్డ్వడితినయా(23)

ఏడులు గడిచెను అయినా ఈ నాటికీ నీ పేరు తలచుకుంటే చాలు, మాభయాల చిమ్మచీకట్లలో నీ అభయహస్తపు మెరుపులు తళుక్కుమంటాయి, బాపు! తళుక్కుమంటాయి(24)

జగతి మౌనమె సర్వార్ధ సాధకమగు నిడివి నీ మౌనమదినీకె యిడె ఫలంబు, కాని పరమౌషధంబు లంఘన మనుట వ్త్వదుపవాసాల నొరులకు కుదులు రుజలు(25)

నీవుదయించినట్టిమహనీయ ముహూర్తము భారతీయ సుశ్రీవియదధ్వమందు బొలిచెన్నవ భాను మహోదయాభమై పావన తద్రుచివిశ్ఫురణ బ్రాకిన దాస్య తమస్సు విచ్చి మోదావహరాగరేఖలు దిగంతములన్ విలసిల్లె బెల్గుగా(26)

కమ్మగా బతికితే గాంధియుగంమనిషి కడుపునిండా తింటే గాంధీజగంపరమార్ధమొక్కటే గాంధీమతంమనిషి భయము వదిలేయుటే గాంధీహితంభోగలోలత విడుటే గాంధీవిధంత్యాగరధమెక్కితే గాంధీపధంమనిషి మర్యాదయే గాంధీధనంమనిషి మారితే కోవెలగ గాంధీతనంతన కంఠమున దాచి హాలాహలంతలనుండి కురిపించి గంగాజలంమనిషి శివుడవుటయే గాంధీవరంబాపుననుసరిస్తే చాలుమనమందరం(27)

నీవు పుట్టిన గిట్టిన తావులెపుడు, ధరణి శాశ్వత పుణ్యతీర్థంపులగు(28)

ఓ మహాత్మా! ఓ! మహర్షీ! అని కవులచేత అనేకవిధాల కొనియాడబడిన మన జాతిపితని, బాపూని, జ్ణానపీఠపురస్కార గ్రహీత, ప్రముఖ కవిశేఖరుడు డా. సి.నారాయణరెడ్డిగారి భావనతో భరతవాక్యం పలకడం కడు సమంజసం.
హిమాద్రి ఎంత ఎత్తు? హేమాద్రి ఎవరి సొత్తు?మహాత్మా నీ స్వరూపం తుహినాద్రికి సంక్షిప్తరూపంబాపూ నీ చిత్తం ప్రపంచానికి దొరికిన విత్తంబాపూ నీ పుట్టిన రోజు భగవానుడు పుట్టినరోజుఒక రాముడు పుట్టినరోజు, ఒక రహీము పుట్టినరోజుచావులేని పుట్టకలేని సత్యమూర్తి పుట్టినరోజుదాస్యంలో విలవిలలాడే ధర్మం తొడగొట్టినరోజు.
జాతిపిత మహాత్మాగాంధి, మోహన్ దాస్ కరంచంద్ పై కవితాసుమాలను పలవరించిన మహాకవుల వివరాలు :
1। విశ్వనాధ సత్యనారాయణ 2. శ్రీశ్రీ3. పురిపండా అప్పలస్వామి4. మధునాపంతుల5. శివశంకరస్వామి6. కుందుర్తి ఆంజనేయులు7. బోయి బీమన్న8. వేదుల సత్యనారాయణ శాస్త్రి9. బసవరాజు అప్పారావు10.గుర్రం ఝాషువా 11.పుట్టపర్తి నారాయణచార్యులు12.జంధ్యాల పాపయ్యశాస్త్రి13.మల్లవరపు విశ్వేశ్వరరావు14.ఉత్పల సత్యనారాయణచార్యులు15.పైడిపాటి సుబ్బరామశాస్త్రి16.ఆరుద్ర17.దాశరధి18.రాయప్రోలు సుబ్బారావు19.నాయని సుబ్బారావు20.తుమ్మల21.కాటూరి వెంకటేశ్వరరావు 22.అడవి బాపిరాజు23.విద్వాన్ విశ్వం24.కాళోజి25.వానమామలై వరదాచార్యులు26.దివాకర్ల వెంకటావధాని27.దేవులపల్లి కౄష్ణశాస్త్రి28.వెంకటపార్వతీశకవులు.

No comments: