Tuesday, March 25, 2014

మన ప్రతిభావంతులు రాయప్రోలు


మన ప్రతిభావంతులు
నిత్య నవ్యాంధ్ర భావసాహితీమూర్తి  'రాయప్రోలు’ - 13 మార్చి 1892 జయంతి.
నవ్యాంధ్ర భావసాహితీమూర్తి జననం
తెలుగుసేమలోని విద్యావంతులు బెంగాలులో వన్నెలుపోతున్న భావచైతన్యం వల్ల ప్రభావితమవుతున్న కాలంలో, తమ మాతృభాషలో తోటివారికోసం సంకల్పించిన పధం నిర్మిస్తున్న కాలమది. సాహితీభాషామూర్తులు అనుకున్నది సాథించడానికి దారులు తమరే పరచుకుంటున్న పవిత్ర సాహితీపథాలవి. యిరవయ్యవ శతాబ్దపు చివరి దశకకాలం. 1891-92 సంవత్సరం. భావిభారత నవ్యాంధ్ర సాహితీముర్తిత్వానికి సంకేతంగా గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో ఒక మాతృమూర్తి పురుడుపోసుకుని పుత్రున్ని కన్నది. అది రాయప్రోలు వారి వంశం. పసివాడి పేరు వేంకటసుబ్బారావు. వారి కవిత్వాన్ని, ప్రక్రియని ఒక రకమైన 'సాహితీయుగం - యుగకర్తగా చెలామణి కావడాన్ని బట్టి రాయప్రోలు వారికి సరిసములను కష్టపడి పట్టుకోవాలి.
 అది 1916 సంక్రాంతిపండుగ. బెజవాడ రామమోహనగ్రంధాలయపు ఆవరణలో జరుగుతున్న మహోత్సవ సభ. నిండుసభలో ఆంధ్రాభిమానపూరితమైన పద్యలహరిని శ్రావ్యభరితంగా గానంచేసిన వ్యక్తి రాయప్రోలు సుబ్బారావు అని, 'నా జీవితకధ’లో అయ్యదేవర కాళేశ్వరరావు గారు అన్నారు. పద్యాల్లో, తెనుగువాణి వర్ధిల్లింది. తెనుగుకత్తి మెరసింది. తెనుగురేఖ అలరింది. తెనుగుభూమి యావత్తు వసుంధరనే సస్యశ్యామలభరితంకావించింది. 'చావలేదు, చావలేదు, ఆంధ్రుల మహోజ్జ్వల చరిత్ర" హృదయములు చీల్చి చదువుడో సదయులారా అని సాహితీసందేశాన్నిచ్చాడు.
 సాహితీయుగానికే అధినేత
రాయప్రోలు సుబ్బారావు గారు 1892 మార్చి 13న గుంటూరు జిల్లా, బాపట్ల తాలూకా, గార్లపాడు గ్రామంలో వెంకటప్పావధాని-ఆదెమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనంలో ఆటపాటలతో తిరిగి, పెరిగిన చీరాల-బాపట్ల మధ్యనున్న వెదుళ్ళపల్లి మనసుపై చెరగని ముద్రవేసింది. సుబ్బారావుగారు మెట్రిక్ దాకా చదివి, ముందుకు కొనసాగించలేని పరిస్థితుల్లో రాజమండ్రి చిలుకూరు వీరభద్రరావు సంపాదకత్వంలోని 'ఆంధ్రకేసరి పత్రికలో రచనలుచేయడం, అజ్ఞాతసంపాదకుడి విధులు, మేనమామతో ఆశుకవితాజంటవిన్యాసాలు స్వత:రసదృష్టి పెరిగినా, ఆశుకవితలమీద వెగటుతనం ఆవహించి, వాటిపై సన్యాసందాకా పోయింది. న్యాయవాది గంటిలక్ష్మన్నపంతులు ప్రోద్బలంతో ఆంగ్లకవి 'గోల్డ్ స్మిత్ - హెర్మిట్' కృతిని 'లలిత’(1909) గా, టెన్నిసన్ రచన - 'డోరా'ను 'అనుమతి’(1910) లఘుకావ్యంగాను, 'తృణకంకణం' (1912) నూతన రచనలను సృష్టించాలన్న సంకల్పంతోనే ఆశుకవిత్వానికి వీడుకోలు పలకవలసి వచ్చింది. మదరాసు చేరుకుని, కొమర్రాజు వారి దగ్గర 'విజ్ణానచంద్రికాగ్రంధమండలి’, 'ఆంధ్రవిజ్ణానసర్వస్వం' లో లేఖకునిగా ఉద్యోగం చేశారు. విశిష్టకవిత్వానికి అనాదరణ ఆనాటి నుంచే మొదలైంది. ఆధునిక కవిత్వరచనలు చేస్తున్నా కూడ, రాయప్రోలు వారి 'కొత్తపోకడలు" లోకం గుర్తింపుకు నోచుకోలేదు. వీరి కావ్యాలు మొదటిదశలో ఎవరి దృష్టిని ఆకర్షించలేదు. కవితలు, కావ్యాలు వ్రాస్తున్నా, ఆనాడు అధికంగా వ్యాప్తి వున్న వరకట్నం దురాచారాన్ని భరించలేకపోయారు. ప్రత్యక్ష ఘటన, బ్రాహ్మణయువతి 'స్నేహలత" స్వయంకృతంగా అగ్నిజ్వాలకు ఆహుతికావడం అనేక కవులకు ప్రేరణ కలిగించింది. యితివృత్తంతో నవీనశైలితో పద్యకావ్యం రాయప్రోలుకు కలిగిన నూతనదృష్టితో వంగదేశం వలసపోయారు. విశ్వకవి రవీంద్రుని అంతేవాసితనం, సాహిత్యసౌందర్యాలను స్వంతంచేసుకుని, స్వదేశం వచ్చారు. కాల్పనికకవిత్వం, జాతీయోద్యమం, ఆంధ్రోద్యమంతో ప్రభావంచెంది, 'ఆంధ్రావళి’ అవతరణకు దారితీసింది. ప్రభావం, రామమోహన గ్రంధాలయంలో (1916) 'హృదయములను చీల్చి చదవమని సదయులందరికి సందేశాన్నిచ్చారు.
దేశభక్త్యాభిమానాలు పుష్కలం
భారతదేశాభిమానం, ఆంధ్రాభిమానం, రాయప్రోలువారి రచనల్లో ప్రస్తావించిన తీరు విశ్లేసిస్తే, ఆంగ్రకవులైన "వాల్టర్ స్కాట్, టెన్నిసన్, వర్డ్సవర్త్, రచనల్లోని భావలహరికి సహేతుకంగా సోదాహరణంగా ప్రస్తుతీకరించారు. ఆంధ్రాభిమానాన్ని రసవన్మార్గంలో ప్రవేశపెట్టారు రాయప్రోలువారు. ఆంధ్రరాష్ట్రోద్యమంలో ఒక్కుమ్మడిగా చెలరేగిన రాష్ట్రాభిమానం కవిత్వములో కూడ అనేక సందర్భములలో, అభిమానం, దురభిమానంగా పరిణమించింది. దురభిమానాన్ని, సి.నారాయణరెడ్డిగారు 'అబిమానాతిరేకం' అన్నారు. యీ పరిస్థితి రాయప్రోలువారిని కూడ కొంతమేరకు ఆవరించిందని పలువురి భావనగా ప్రకటించారు.
నవ్యాంధ్ర సాహిత్యంలో అమలిన శృంగార భావనను వ్రవేశపెట్టి భావకవిత్వానికి నాంది పలికినవారు సుబ్బారావుగారు. ఉస్మానియా, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో 1921 నుంచి తెలుగుశాఖలో లెక్చరర్, రీడర్, ప్రొఫెసర్ గా వృత్తి నిర్వహించి, కొంతకాలం వరంగల్ కాలేజి, ప్రిన్సిపాల్ గా కొనసాగారు. "లలిత, తృణకంకణం, కష్టకమల, తెనుగుతోట, మధుకలశం, రమ్యాలోకం, స్వప్నకుమారం, జడకుచ్చులు, రూపనవనీతనాటకం" మొదలైన రచనలు , కాళిదాసు మేఘదూతాన్ని, రవీంద్రుని కవితలను, భవభూతి ఉత్తరరామచరితాన్ని, ఉమర్ ఖయ్యాం రుబాయీలను, రసస్ఫోరకంగా అనుసృజనం గావించారు. కామగంధం లేని శృంగారాన్ని ప్రతిపాదించారు.
సమగ్ర కవితాదార్శకుడు
ఆధునిక కవిత్వానికి ముఖ్యంగా భావకవిత్వానికి ఆంగ్లసాహిత్య పరిచయం వల్లనే ప్రోద్బలం వచ్చిందని నిస్సందేహంగా ఆనాటి కవులు భావించారని, భావకవిత్వం రావడానికి కారకుల్లో రాయప్రోలువారు, వారి 'తృణకంకణం' అని, భావకవుల్లో ప్రముఖులైన వారంతా 1891-1900 మధ్య జన్మించిన వారు, 1919 నాటికి భావకవిత్వం అందరి నోళ్ళలో పడిందని, బృందంలోని ప్రధమశ్రేణి కవుల్లో రాయప్రోలు వారు ప్రధముల్లో ప్రధములు” అనికూడ ఆరుద్ర అభిప్రాయపడ్డారు. బ్రందం మీదనే, సనాతనుల తిట్లూ, సమకాలిక సహృదయుల దీవెనలూ వర్షించబడ్డాయి. వీరందరి సమగ్రకవితాదర్శనం వల్లనే భావకవిత స్వరూప ప్రభావాలు అంచనా వేయబడడం సాధ్యమైనాయి అని పలువురి భావన. అష్టాదశకవి బృందానికి భావకవిత్వానికి ప్రాతినిథ్యం వహించి ముద్దుకృష్ణవైతాళికులు’ ఖంఢకావ్యసంపుటం ప్రచురించాడు. యిందులో గురజాడ (1865) ప్రాచీన సరణికి భరతవాక్యం పాడితే, శ్రీశ్రీ (1910) నవీన సరణికి నాందిగీతం పాడి, అభ్యుదయ, విప్లవ మార్గాలకు వరుసగా ప్రాతినిథ్యం వహించారు.
అమలిన ప్రేమ కు నిర్వచనకారుడు
  'తృణకంకణం' అమలినప్రేమాంశం ప్రముఖం. రాయప్రోలు వారి ప్రయోగాలు అనుభవభరితాలు. మచ్చుకు కొన్ని :
'గుణలతలు పూచిన శోభలూ, 'చిరునవ్వులు వెన్నెలచెండ్ల విసరా, 'చూపులు వలపుటుచ్చులూ, 'ప్రేమ భావనల్ నూత్న కళలూ, 'నదలు ప్రాయంపు మన్ననలూ, 'కనుల నరవాల్చి పాతితాక్షములతోడ గాంచియును కాంచలేని క్రీగంటకొసలూ, 'చెలిమినాటిన చిత్తమె యార్ద్రమూ.'పడుచుదనముతో చిగురించు వలపులూ. అన్ని అనుభైకవేద్యంబులే. కావ్యంనిండా దాంపత్యభక్తి, వాత్సల్యరక్తి, సఖ్యసక్తి, ముక్తి సోదాహరణంగా రసానుభూతిని కలిగిస్తూ, అందించారు. ‘నా ప్రియసఖి, అనురూపగుణ ప్రచురణ! ప్రసన్నశీల! నవనీత శిరీష ప్రణయ మృదుల హృదయ!” వంటి రమణీయ వర్ణనలతో ఆధునికకవిత్వంలో చైతన్యస్ఫూర్తి కలిగించిన కావ్యం ‘తృణకంకణం’. “సరస సాంగత్య సుఖవికాసములకన్న, దుస్సహ వియోగభరమె మధురము సకియ” అన్నమాటలు అమలిన శృంగార ప్రతిపాదనకు పునాదులని విశ్లేషకులు భావించారు.
కాపుకన్నె సొగసుల నిర్మాత
 రాయప్రోలు శృంగారభరిత రసనను వర్ణించిన తీరు ప్రభంధకవిపరమేశ్వరుడిని తీసిపోరని నిక్కచ్చిగా చెప్పవచ్చు.
కాపుకన్నె 'శరదుదయ ప్రసారముల చక్కలిగింతలూ, 'నడకల కుల్కు కల్కి చరణంబుల కింపులూ, 'చేకొడవలి త్రిప్పికొంచు తళుకుల్ వెదజల్లెడు కన్నులూ, 'కాపులేబడకుత యొంటిగా వయసు వాలకముల్ మురిపింప పండులన్, 'కన్నె చెక్కిళ్ళ జిగీ, 'పైట మడతల నందములాటలూ, 'పెదవి పగడాల చిరునవ్వు పాలు తడపా, 'తానెరుంగని సొగసామెపైని విరియూలాంటి పదప్రయోగ భావసౌరభాలు కోకొల్లలుగా కానవస్తాయి.
 ఆంధ్రభూమి - జన్మభూమి - రాయప్రోలు రాజసభూమి
అమలిన శృంగార భరిత భావకవితాధార నుంచి దేశభక్తిభావరత్నవేచికాలహరివరకు రాయప్రోలు కవితాయానం విరాజిల్లందన్నది నిర్వివాదం, నిస్సందేహం. తల్లిభూమిభారతికి నిల్పిన జాతినిండుగౌరవం, పూర్వపుణ్యం, యోగబలం కలిగించిన స్వర్గఖంఢజన్మ, అనంతభూతలి మనభూమి, చల్లనితల్లి. తమతపస్సులు ఋషులు, సౌర్యహారము రాజచంద్రులు, భావసూత్రములల్లు కవిపుంగవులు, రాగదుగ్ధములుపిదికే భక్తరత్నములు, దిక్కులకెగతన్నే తేజములు, రాళ్ళతేనియలూరేట్లుసాగేరాగాలు, జగములనూగించే మగతనం, సౌందర్యమెగబోయు సాహిత్యాదులతో వెలుగుతున్న దివ్యవిశ్వం, దేపించే పుణ్యదేశపు పొలాల్లొ మొలిచే రత్నాలు, వార్ధిలో పండే ముత్యాలు, ప్రిధివిలో పిదికే దివ్యౌషధాలు, కానల కాచే కస్తూరి, అవమాన, అనుమానాలు లేని భారతీయులు.
దేశభక్తి
 ' దేశమేగినా, ఎందు కాలిడిన, ఏపీఠమెక్కినా, ఎవ్వ రేమనిన
పొగడరా! నీతల్లిభూమి భారతిని, నిలుపరా! నీజాతి నిండుగౌరవము
ఏపూర్వపుణ్యమో, ఏయోగబలమొ, జనియించినాడ నీస్వర్గఖంఢమున
ఎమంచిపూవులన్ బ్రేమించినావో, నిను మోచె నీతల్లి కనకగర్భమున."
లేదురా ఇటువంటి భూదేవి యెందు, లేరురా మనవంటిపౌరు లిం కెందు
సూర్యుని వెలుగురుక్ష సోకునందాక, ఓడలజెండాలు ఆడునందాక."
 రాయప్రోలు అంటే వెంటనే స్ఫురణకు వచ్చేది ‘దేశభక్తిగేయం ‘జన్మభూమి’. అవమానమేలరా! అనుమానమేల, భారతీయతనందు భక్తితో పాడ” అని గళమెత్తిన జాతీయకవి రాయప్రోలు. “ఏ ప్రఫుల్ల పుష్పంబుల నీశ్వరునకు / పూజ సల్పితివో యిందు పుట్టినాడ / కలదయేని పునర్జన్మ కలుగుగాక / మధుర మధురంబైన తెన్గు మాతృభాష” అన్న పద్యం కూడ చాలా ప్రాచుర్యం పొంది భాషాభిమానాన్ని చాటిచెప్పింది.
'యధాస్మై రోచతే విశ్వం తధేదం పరివర్తతే' అన్నట్లు, కవికి విశ్వమెట్లా ఇష్టమైతే అట్లా పరివర్తన పొందుతుందని సూక్తి.
“భావం లేనిదే కవిత్వమే లేదు. కవిత్వమెక్కడుంటుందో భావమక్కడే వుంటుంది. ఆక్షేపకులు రెండు కళ్ళు మూసుకుని, భావకవిత్వంలోని భావాన్ని ఒకకంటితోనూ, కవిత్వాన్ని రెండో కంటితోనూ, చూడడం పరిపాటే. పూర్వసాహిత్యంలో రసధ్వని, భావధ్వని వుండడం సహజసత్యం. నిజానికి భావకవిత్వంలో అభినయార్ధతత్వం అంతర్లీనంగా వుంటుంది. హస్తం, దృష్టి, మనస్సు, భావం, రసం కళకు సల్లక్షణాలు.
భాషలోనైనా కవిత చెప్పదలచుకొన్నారంటే మాటలతోనే చెప్పాలి. భావం కొత్తదైనప్పుడు భాషలోనున్నపదాలు భావం చెప్పడానికి చాలనప్పుడు ఉన్న మాటలతోనే కొత్త పదచిత్రాలు కట్టుకోవాలి. అయినా చెప్పలేకపోతున్నామనే బాధ కవికి కలుగుతుంది” అని వివరిస్తూ, విశ్వనాధ - 'అస్మదీయ కంఠము నందాడు చుండెనొక ఎదోగీతి బయటకు నుబికి రాదు, చొచ్చుకొని లోనికిని పోదు ద్రచ్చిపోయె, నాహృదయమమీ మహా ప్రయత్నమందు" అంటారు. వివిధ విఫలయత్నాలలోనే హృదంతరంలో నవజపాశోణ సంధ్య తోచిందని, వాంచాసిద్ధి క్రమంగా సిద్ధిస్తుందని చెప్పాడు.
 ఆద్యుడైన భావకవి, భావకవిత్వపు వ్యాసానికి ముగింపు, సహజభావకవి, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారిని స్మరించకుండ నిజమైన భరతవాక్యం పలుకలేము. యిటువంటి భావకవితాభరిత పద్యాలని ఆధ్యయనం చేసేటప్పుడు, ఆయన మాటలు - "ఎదియొ అపూర్వ మధుర రక్తి స్ఫురియించుగాని అర్ధమ్ముగాని భావగీతమ్ములవి" అని సరిపెట్టుకోవాలి. భావానికి తగిన భాష ఒక్కరివల్ల తయారయ్యేది కాదు. పదిమంది పదేపదే వాడిన కొత్తమాటలమూటలవల్ల భావ వ్యక్తీకరణ సాధ్యమవుతుంది. భావకవి, కవిత్వం 'మీరు మనసారగా ఏడ్వనీరు నన్ను" అంటే, భావకవిత్వ ప్రభావంలోంచి వచ్చినా, దానికి ప్రతిగా సాగిన అభ్యుదయకవిత్వం సామూహికంగా 'ఏడవ కండేడవకండీ' అని చెప్పడం జరిగింది.
ఆద్యులైన భావకవి - రాయప్రోలు
భావకవుల్లో కూడా కొందరు ఆద్యులు, కొందరు ఆఢ్యులు. రాయప్రోలు సుబ్బారావు గారు నిస్సందేహంగా ఆద్యులే. భావకవిత్వం ప్రాచుర్యం పొందడానికి వ్యాసముద్రణలు కాదు. శ్రోతలముందు భావకవితాపఠనం ముఖ్యంగా జరిగినప్పుడే భావకవిత్వపు సొగసులు, సొబగులు మరింతగా రాణించగలవు.
"కవేర్భావ: కవిత్వం" - భావప్రధానం కవిత్వం భావ కవిత్వం. "కవిర్భా: కవిత్వం" - కవిత్వానికే కావ్యం. "నానృషి: కురుతే కావ్యం" - ౠషి కానివాడు కావ్యం చేయడు". "కవయ: క్రాంత దర్శన:" అని లోకోక్తి. ఋషి ద్రష్ట. దర్శనశక్తి కలవాడు. ఏమిటి దర్శించగలడు? దేన్ని దర్శించిన తర్వాత ఏం చేస్తాడు" తనకు కావలసిన రీతిలో విశ్వాన్ని చూస్తాడు. భావిస్తాడు. భావనం చేస్తాడు కవి కనుక కవనం చేస్తాడు. విశ్వాన్ని పరివర్తన చెందేటట్లు మాంత్రికశక్తిని వినియోగిస్తాడు. కవి కూడ మాంత్రికుడే. భావకవి భావాన్ని మంత్రీకరిస్తాడు. భావేంద్రజాలాన్ని, కవితేంద్రజాలాన్ని జోడిస్తాడు.
శబ్దమాధుర్యం, అర్ధ ప్రసన్నత, సంప్రదాయ పక్షపాతం, దేశభక్తి, ఆత్మసౌందర్యం, ఆధ్యాత్మిక ప్రేమ - సాహితీ షడ్రుచుల్ని సమన్వయం చేసుకుంటూ, రంగరించి, కలబోసి, అచ్చుబోసిన సాహితీమూర్తిత్వం ను వర్ణించాలంటే - ఎన్నో భావనలు, మాటలు అనవసరం - ముక్తాయింపుగా, రాయప్రోలు సుబ్బారావు - అంటే సరిపోతుంది.
రాయప్రోలు వారి స్మరణ, స్ఫురణ ఉన్నన్నాళ్ళూ, ‘చావలేదు, చావలేదు అంధ్రుల మహోజ్జ్వల చరిత్ర’, సదయులారా, హృదయములు చీల్చి చదువుకోండి బాబూ! అని నిర్ద్వందంగా చెప్పవచ్చు. రాయప్రోలు వారి ఒక విశిష్టమైన, తెనుగువాణి, తెనుగు కత్తి, తెనుగు రేఖ. రాయప్రోలు సుబ్బారావుగారు తనకు ఇష్టమైన ‘కాళిదాసు’ గురించి పదేపదే చెప్పే ‘ఆషాఢస్య ప్రథమ దివసే’ (ఆషాఢ శుక్ల పాడ్యమి) రోజున, 30 జూన్ 1984 న పరమపదించడంలో కూడ ప్రత్యేకతే.
అభిన ఆంధ్రకవితా శాఖలపై నవ్య స్వరకల్పన చేసిన రాయప్రోలు వారిని ‘కోకిలస్వామి’గా, డా. జి వి సుబ్రహ్మణ్యం – ‘అతడు యుగకర్త, ఆచార్యుడాంధ్రవాణి / కభినవా ధర్మ మార్గ విద్యా ప్రదాత / కోకిలస్వామి అతని గుండె గొంతు / అభినవాలోక మాతని ఆత్మగీతి” అని స్మరించారు. ఆంధ్రాభిమానాన్ని సహేతుకమైన రీతిలో రసవన్మార్గంలో ప్రవేశపెట్టిన ఘనతను పొందిన నవ్యాంధ్ర సాహితీమూర్తి రాయప్రోలు సుబ్బారావు గారికి జయంతి సందర్భంగా శతసహస్ర ప్రణామాలు, సాహితీనీరజనాలు.

No comments: