Tuesday, March 16, 2010

అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి

అమరజీవి 'పొట్టి శ్రీరాములు







'పొట్టి శ్రీరాములు వంటి దీక్షాపరులు మరో పదిమంది ఉంటే, ఏడాదిలో స్వాతంత్ర్యం సాధించవచ్చూ - గాంధీజీ.



నెల్లూరు జిల్లాలోని 'పడమటపల్లే పురవాసుల పూర్వజన్మసుకౄతం కాబోలు! అమరజీవి పొట్టిశ్రీరాములు గారి పూర్వీకులు ఈ ప్రాంతానికి చెందినవారు. బంధుజనకూటమి స్థిరవాసమూలాన మద్రాసులో స్థిరనివాసకులయ్యారు. గురవయ్య - మహాలక్ష్మమ్మ దంపతులు పున్నామనరకంనుండి రక్షించబడ్డ పవిత్రక్షణం. ఆరోజు 1901 మార్చి 16. మద్రాసు జార్జిటౌన్, అణ్ణాపిళ్ళైవీధిలోని 165 భవనం మాత్రం సర్వతేజోమయంగా విరాజిల్లుతోంది. పొట్టి శ్రీరాములు జన్మించారు. రెండు దశాబ్దాల పర్యంతం జరిగిన మద్రాసు చదువు, బొంబాయిలో లోని విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లో శానిటరీ యింజనీరింగ్ పూర్తయిన వెంటనే గ్రేట్ యిండియన్ పెనిన్సులా రైల్వేలో మద్రాస్, బొంబే లో ఉద్యోగపర్వం నిర్వహించారు. కాని, పాతికేళ్ళ వయసులోనే కష్టాల కడలి ఆవహించింది. ఫలితంగా 1928లో భార్య వియోగం, పురిటిబిడ్డ కూడ దక్కకపోవడం, తర్వాత తల్లిని కోల్పోవడం కారణంగా ఐహికసుఖాలపై విరక్తి, దేశసేవపై ఆసక్తి ఒకేసారి కలిగాయి. గాంధిజీ జాతీయోద్యమపిలుపు పొట్టివారు 1927లో తమ ఉద్యోగానికి భరతవాక్యం పలికారు. వ్యక్తిగతనష్టం, ఆంధ్రావనికి మాత్రం అమూల్య వరప్రసాదంగా మారింది. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు అందజేసి, సబర్మతి ఆశ్రమం చేరుకున్నారు. గాంధిజీ అంతేవాసితనంతో నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనడం, రాజకీయ నిర్బంధితులుగా కారాగారవాసం, సత్యాగ్రహం, శాసనోల్లంఘనం, ఉద్యమాల్లో అగ్రగామిగా గాంధిజీచే గుర్తింపులు - ప్రశంసలు, గుజరాత్ లోను, కొమరవోలులోను, పలుసేవలు చేయడం, క్విట్ యిండియోద్యమంలో భాగస్వామ్య ఫలితంగా జైలు శిక్షలతో బాటు, నెల్లూరులో ఖద్దరు సంబంధిత కార్యక్రమాల్లోను తీవ్ర కౄషి, సేవల్లో పాల్గొన్నారు. ఏ దీక్ష, సత్యాగ్రహం, ఆంధ్రావతరణకు దారి తీసిందో, ఆ సత్యాగ్రహాలకు నాంది, ప్రస్తావనలు 1946 లో నెల్లూరు, మూలపేటలోని వేణుగోపాలస్వామి దేవాలయం లో హరిజనుల ప్రవేశం కోసం ప్రారంభించిన 'హిందూ సంస్కార సమితీ, కారణాలు అలా ఏవో ఆయనను వెంటాడూతూనే వచ్చాయి. ఫలితంగా ఆలయాల్లో హరిజనులకు ప్రవేశం, హరిజనోద్ధరణకు శాసనాలు, 23 రోజుల నిరసన తర్వాతే లభించాయి. వజ్రసంకల్పం ఫలించింది. 1948లో వార్ధాలో 29రోజుల నిరహార దీక్ష సాగించారు.

పొట్టి శ్రీరాములు ఎన్నడూ, పదవులు, కీర్తి, ప్రతిష్టలకోసం ఏనాడు ఆలోచించి దీక్షలను చేయలేదు. గాంధీజీ ద్వారా అందుకున్న బోధనలు - సత్యాహింసలు, హరిజనోద్ధరణ జీవితాశయాలుగా మలచుకొని, సంకల్పసిద్దులయ్యారు. మిత్రుల వత్తిడితో ఆంధ్రరాష్ట్ర గాంధీ స్మారకసంఘం కార్యదర్శి బాధ్యతలను నిర్వహించారు. నెల్లూరులో హరిజనోద్ధరణకు మద్దతుగా ప్రచారసామగ్రిని గళమూపురబంధనం గావించి, త్యాగధనులుగా ముతక ఖద్దరు బట్టలతో వీధుల సంచారం చేస్తూ, పురజనుల దయాహారంతో జీవితపు చివరి దశ గడిపారు. చెప్పులు లేని కాళ్ళు, మండుటెండలకు గురయిన తలాభారంతో జాతీయోద్యమ ప్రచారకులుగా తిరిగిన దేశభక్తుణ్ణి - "పొట్టిశ్రీరాములు - పిచ్చిశ్రీరాములూ అని పిలిచేవారట, దేశాభ్యుదయమనే మోహం ఆవరించుకున్నవారు. మహాత్మాగాంధి హత్య తర్వాత, ఆంధ్ర లోని గాంధీ స్మారక నిధి సేకరణకు, నిర్వహణకు బాధ్యతని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజల నుంచి వచ్చిన నిరాసక్తి పై అసంతౄప్తి వహించారు. భూదానోద్యమానికి, కస్తూరిబా సమితి, గాంధి సమితి పట్ల కూడ నిరాదరణను గమనించారు. ఈ నిరాదరణకి కారణాల్ని విశ్లేషించి, విచారించగా, అంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం లేని లోటు, తీర్వ అసంతౄప్తి వల్లనే అని గ్రహించారు. వెంటనే కార్యదీక్ష వహించాడు. ప్రణాళికలని స్వయనిర్మాణం చేసుకున్నాడు. సత్సంకల్పంతో, నిస్స్వార్ధపూర్తితమైన కార్యాచరణ కావించాడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్రానికి ప్రధమంగా 1910 లో ప్రత్యేకంగా తెలుగు ప్రజలు, వందేమాతరం ఉద్యమంలో భాగంగా జైలుపాలయ్యారు. అదే ఉద్యమప్రచారభాగంగా, ప్రత్యేకాంధ్ర ప్రసక్తి ముమ్మరంగా వచ్చింది. కాని ఈ భావనకు ఒక రూపు, ఊపు, 1912 లో కౄష్ణాజిల్లాలోని నిడదవోలు లో జరిగిన సమ్మేళణం ప్రముఖ పాత్ర వహించింది. యిదే మూసలో, బాపట్ల, విజయవాడ, విశాఖపట్నంలో జరిగి, తీర్మానల వెల్లువలు కురిసాయి. ప్రధమంగా, అనిబిసెంట్ నాయకత్వంలో జరిగిన కాంగ్రేసు నిర్వహణ సమితి సమావేశంలో, భాషావిధానాలపై ప్రాంతాలను ఏర్పాటు చేసే ధోరణిపై ఆలోచన, తీర్మానం జరిగాయి. బ్రిటిష్ ప్రభుత్వం ససేమిరా అన్నది. స్వాతంత్ర్యం తర్వాత, ప్రభుత్వం నియమించిన ధర్ సంఘం కూడ భాషాపరంగా విభజనకు అంగీకరించకపోయినా, ప్రజలు మాత్రం ఈ సంఘం నివేదికను తిరస్కరించారు. ప్రజల సంకల్పం, ఆందోళనలను గమనించిన ప్రభుత్వం - 1948 లో జైపూరు లో జరిగిన అఖిలభారత కాంగ్రేసు సమావేశం ఒక త్రిసభ్యసంఘాన్ని - నెహ్రూ, పటేల్, పట్టాభి సీతారామయ్య లను నియమించింది. ఆనాటి మద్రాసుని తప్పించి, మిగతా అంధ్రప్రాంతాలన్నీ కలిపి ప్రత్యేకాంధ్రరాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న తీర్మానం తెలుగు ప్రజలకు నచ్చలేదు. ఈ నిర్ణయానికే, 'మద్రాసు లేని ఆంధ్ర తలలేని మొండెం' అని శ్రీరాములుగారు వ్యాఖ్యానించడం గమనార్హం. స్వామి సీతారాం, ఆగష్టు 15, 1951 న ఆమరణ నిరహార దీక్షని, ప్రత్యేకాంధ్ర కోసం ప్రారంభించాడు. ఈ ఉద్యమాన్ని కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు. 35 రోజులుగా దీక్ష కొనసాగింది. పరిస్థితి చేయి దాటిపోతోందని భావించి, ఆచార్య వినోభాభావే, స్వయంగా నెహ్రూతో సంప్రదింపులు జరిపాడు. యిద్దరూ, సీతారాం ని కలవడం, ఆంధ్రులకు ప్రత్యేకరాష్ట్రాన్ని యిస్తామని వాగ్దానం చేయడంతో దీక్ష విరమించడం జరిగింది. అయితే, రాజకీయ చతురుడు నెహ్రూ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. ఫలితంగా, మన పొట్టి శ్రీరాములు రంగంలోకి దూకడం జరగడం, చరిత్రలో ప్రముఖఘట్టంగా మారడం, సర్వవిదితమే.

అప్పటి మద్రాసు రాష్ట్రం, 'ఆంధ్రా పట్ల ప్రదర్శించిన సవతితల్లి ప్రేమదృౠష్టి తీవ్రతను గమనించి, ఆంధ్రులహక్కుని తెలుపుతూ, ప్రత్యేకాంధ్రరాష్ట్రం మాత్రమే ఆంధ్రులకు న్యాయం యిస్తుందనే భావాన్ని ప్రకటించారు. ఈ భావప్రకటన, 1952 అక్టోబరు 19న మద్రాసు - మైలాపూర్లోని బులుసు సాంబమూర్తిగారి నివాసంలో చేపట్టిన నాల్గన నిరహారదీక్ష అవిఛ్ఛన్నంగా సాగింది. నిరహారదీక్ష శిబిరానికి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు నిత్యం సందర్శించి, శ్రీరాములుగారి ఆరోగ్యం గమనించేవారు. దిగజారుతున్న ఆరోగ్యాన్ని గమనిస్తూ, గాంధేయవాది యెర్నేని సుబ్రహ్మణ్యం చాటుగా కళ్ళని తుడుచుకుంటూ వుండేవారట. దేహం, ఆరోగ్యం, సన్నగిల్లి కుచించుకుపోతున్నా, శ్రీరాములుగారి హౄదయం, మనస్సు, మేధస్సు, ధౄఢంగానే కొనసాగాయి. నిమ్మకునీరెత్తని ప్రభుత్వపు తీరు ప్రజల్లో భయాందోళనలను రేకిత్తించింది. స్ఫృఅహతప్పినా దీక్షావ్రతానికి భంగం కలిగించరాదని తన అనుచరులకు, నాయకులకు, ఆదేశాలిచ్చారు పొట్టివారు. కేంద్రప్రభుత్వం కూడ పట్టించుకోలేదు. సరిగ్గా, 56 వ రోజు నిస్మౄహలోకి వెళ్ళడం, రెండురోజుల్లోనే శ్వాసలో యిబ్బందులు ఎదురయ్యాయి. అసామాన్య దేశభక్తి శిఖామణిరూపశరీరం చిక్కుతూ, క్షీణిస్తూ, 58 రోజుల నిరహార దీక్ష కొనసాగించారు.

డిసెంబర్ 15 శ్రీరాములుగారి ఆత్మార్పణ దినం. ఉదయం నుంచే ఆయన స్మౄహలో లేరు. కళ్ళు తెరిచారు. అంతలోనే మూతలు పడిపోయేవి. చేతులు కదిపేందుకు కూడ శక్తి లేని స్థితి. 54 పౌనులు తగ్గిన శరీరం. నాడి, శ్వాస పనితీరు క్షీణించడం, మూత్రస్థంభనం జరిగాయి. నోటిమాట కష్టతరమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్ళేవారు. సందర్శకులను ఆపివేశేవారు. ఆరోజు వచ్చిన ప్రకౄతి వైద్యులు వేగిరాజు కౄష్ణమరాజు దంపతులను, మౌనంగా, చిరునవ్వుతోనే పలకరించారు. అదే ఆఖరి సన్నివేశం. తర్వాత, క్రమంగా శరీరం చల్లబడిపోవడం ప్రారంభమైంది. రాత్రి 11.23 ని. లకు పొట్టిశ్రీరాములుగారు అంధ్రరాష్ట్రంకోసం అసువులు విదిచారు. చివరకు 1952, డిసెంబర్ 15న ప్రాణత్యాగం చేశారు. మరణవార్తని, యెర్నేని సుబ్రహ్మణ్యం గారు చెప్పగా, ప్రముఖ గాయకులు ఘంటసాల, ప్రముఖ స్వాతత్ర్యయోధులు మోపర్రు దాసులు హుటాహుటిని శిబిరానికి విచ్చేశారు. శ్రీరాములుగారి ఆత్మశాంతి కోసం ఆసువుగా ఒక గీతాన్ని రచించి, గానం చేయడం జరిగింది. భౌతికకాయాన్ని తరలించే ప్రయత్నంలో, మద్రాసు మౌంట్ రోడ్ లో వేలమంది చేరారు. శ్రీరాముల త్యాగనిరతికి నినాదాలు చేశారు. హింసలకు కూడ దారితీశాయి. దూరప్రాంతాలైన, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, ఏలూరు, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు లో నివాళి ప్రదర్శనలు చేశారు. ఆంధ్రప్రజలు తమ కోపాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించారు. ఫలితంగా, అనకాపల్లి, విజయవాడ లో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. సామాన్య ప్రజాజనజీవితం ఆంధ్ర, మద్రాసు ప్రాంతాల్లో స్థభించిపోయింది. మెరుపుతీగలా వ్యాప్తిచెందిన శ్రీరాములుగారి మరణవార్త, ఆంధ్రుల అసహనానికి దారితీయడం, హద్దులుదాటి విశృౠంఖల దౌర్జన్యానికి నిలువలేని కేంద్రప్రభుత్వం తట్టుకోలేని ప్రజాప్రభంజనశక్తి, ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర స్థాపనకు అంగీకరించవలసి వచ్చింది. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని 19 డిసంబర్ 1952 న ప్రకటన జారీ అయింది. ఎర్రగులాబి కదిలింది. నెహ్రూ దిగిరాక తప్పలేదు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోవడానికి వీల్లేదని, మరునాడే వెళ్ళిపోవాలని, అపర రాజకీయ చతురులు, చక్రవర్తి రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. అయితే, కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ సూచించడం, రాజమండ్రి కూడ బాగుంటుందని కూడ ఆలోచించడం, కమ్యూనిష్టుల కోట కారణంగా విజయవాడకు కాంగ్రేసు నిరాకరణలు, నెల్లూరు, చిత్తూరు నాయకులు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలగడం, కోస్తా కమ్మదేశాన్ని నమ్మమని, రాజధాని రాయలసీమలోనే పెట్టాలని లేకపోతే ఆంధ్రరాష్ట్రమే వలదని చెప్పిన నీలం సంజీవఋరెడ్డి, ఎవరి పాత్రలు వారు పోషించారు. చివరకు ఆంధ్రులు మద్రాసుని వదలుకోవచ్చింది. బళ్ళారి, బరంపురం, హోస్ఫేట,తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడ వదలుకోవలసివచ్చి, గత్యంతరం లేక 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. 1 నవంబర్ 1956 న అంధ్రప్రదేశం, హైదరాబాదు రాజధానిగా ఆవిర్భవించింది. ఆంధ్రుల అంతిమలక్ష్యం 1956 నవంబరు 1 న, సంపూఋర్ణ ఆంధ్రరాష్ట్రం, హైదరాబాదు రాజధానిగా లభించింది.

మద్రాసు, మైలాపూర్ - రాయపేట హైరోడ్ లోని 126 నవంబరు 1 న పొట్టిశ్రీరాములుగారు కన్నుమూసిన భవనాన్ని, 'అమరజీవి స్మారకం'గా ఆ త్యాగమూర్తి స్మౄతిమందిరాన్ని పవిత్ర సాంస్కౄతిక కేంద్రంగా పరిణమించినా, నేటివరకు ఆ భవనాన్ని, తమిళనాడు, ఆంధ్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమనే భావించాలి. శ్రీరాములుగారి ప్రధమశిష్యులు వై.యస్.శాస్త్రిగారు జీవనకాలంలోను, తర్వాత ఆయన కుమారుడు శ్రీ రామకౄష్ణ, ప్రముఖులైన యన్.ఆర్.చందూర్ - రచయిత్రి మాలతి చందూర్ దంపతులు, తదితర ఆనాటి పొట్టిశ్రీరాములుగారి సమకాలికుల సహాయ సహకారాల్తో, ఆ సుక్షేత్రంలో పలు సేవాకార్యక్రమాల్ని నిరంతరం అందిస్తూ, చెన్నైలోని ఆంధ్రులకు సద్గోష్టి సంగమాలకి నేటికీ అలరిస్తోంది.

శ్రీరాములుగారు ఆకౄతిలో పొట్టివారైనా, ఆలోచనలో, ఆచరణలో, సంకల్పసిద్ధిలో మహాగట్టివారు. ఆంధ్రులు ఎన్నటికీ మరువలేని, మరువరాని, మరువకూడని వ్యక్తి, మహామనీషి. ఆంధ్రప్రదేశ్ అవతరణకు మూలపురుషుడు. ఆంధ్రుల నిత్య స్మరణకు పాత్రుడు.



పొట్టి శ్రీరాములు గారి త్యాగం పై - సామవేదం జానకిరామ శర్మ గారి కవిత:



అది గొప్ప యౌకొకో! యిపుడు వెన్నెముకను దానమిచ్చె దధీచి మౌని యతడు

యది యేమి ఘనత! కాయము కోసి ఇచ్చెను శిబి చక్రవర్తి ప్రసిద్ధుడతను

అది యొక లెక్కయా? యడుగురు మూడుగా ధరనిచ్చె బలియు వదాన్యుడతడు!

యది లెస్సయా? మేన ననఘళించిన సొమ్ములడుగ నిచ్చెను కర్ణుడగునె దాత

యనుచు స్వర్గపురీ రధ్యలందు సురలు

పొట్టిశ్రీరాముల యుదంతమును దలంచి

యక్కజంపడి తలయూచి యాడుభాష

లందగించెను మేఘగర్జాంతముల.



పొట్టి శ్రీరాములు గారి జీవిత వ్యక్తిత్వ చిత్రణం లోని ముఖ్యాంశాలు:



1901 మార్చి 16 న - జార్జిటౌన్, 165, అణ్ణాపిళ్ళై వీధి లో జననం.

గురవయ్య - మహాలక్ష్మమ్మ, తల్లిదండ్రులు.

పటమటపల్లె, నెల్లూరు జిల్లా - పూర్వీకులది.

యిరవై ఏళ్ళ వరకూ మద్రాసులో విద్యాభ్యాసం.

బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదువు.

గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే లో నాలుగేళ్ళు ఉద్యోగ పర్వం.

25 వ ఏట భార్య మరణం.

1927 లో ఉద్యోగానికి రాజీనామా.

ఆస్తిపాస్తులను కుటుంబానికి పంచిపెట్టడం.

గాంధీజీ అనుయాయిగా సమర్మతీ ఆశ్రమం ప్రవేశం.

స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా - ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్తో సహా, పాల్గొని, మూడుసార్లు జైలుశిక్ష.

రాజ్ కోట్ (గుజరాత్), కొమరవోలు (కౄష్ణాజిల్లా) లో గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనడం.

కొమరవోలు గాంధీ ఆశ్రమంలో చేరుట.

నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికై కౄషి.

కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి యింట్లోనైనా భోజనం చేయడం.

నెల్లూరు జిల్లా లోని మూలపేట వేణుగోపాలస్వామి ఆలయంలోకి హరిజనుల ప్రవేశం కోసం నిరహార దీక్ష.

హరిజనోద్ధరణకు కౄషిలో భాగంగా - నినాదాలను అట్టాలకు రాసె, మెడకు వేలాడేసుకుని ప్రచారం.

కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేక, మండుటెండల్లో ప్రచారం తో పిచ్చివాడని పిలువబడ్డారు.

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం, 1952, అక్టోబర్ 19న, మద్రాసు బులుసు సాంబమూర్తిగారి యింట్లో నిరహార దీక్ష

1952, డిసంబర్ 15 అర్ధరాత్రి, పొట్టి శ్రీరాములు ప్రాణార్పణం.

పలు విశ్లేషణల తర్వాత, 1953 అక్టోబర్ 1 న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఆవిర్భావం.



'మద్రాసు లేని ఆంధ్ర తలలేని మొండెం' - పొట్టి శ్రీరాములు.



"ఆంధ్ర రాష్ట్రము వచ్చె - మహోంధ్ర రాష్ట్రమేరుపడు వేళ - పొలిమేర చేర పిలిచె" అన్న మహాకవి దాశరధి కవితాత్మక స్మరణంతో ఆనాటి ప్రజలను సముచితంగా ఉత్తేజపరచారు.



మద్రాసు, నేటి చెన్నై లోని బీచ్ రోడ్ లో శ్రీరాములుగారి స్మారక విగ్రహం, రాయపేట హైరోడ్, మైలాపూర్ లో స్మారకభవనం, హైదరాబాద్, సచివాలయం ఎదురుగా విగ్రహం, తెలుగు విశ్వవిద్యాలయానికి స్మారక నామం, నెల్లూరు జిల్లాను కూడ స్మారకంగా పేరు మార్చాలన్న ప్రయత్నం కొనసాగడం, అమరజీవి పొట్టిశ్రీరాములు గారి ఆత్మశాంతికి, ఘననివాళికి కొన్ని చిరు ప్రయత్నాలు మాత్రమే.



అమరజీవి పొట్టిశ్రీరాములుగారి జయంతి సందర్భంగా సమర్పిస్తున్న వ్యాసనివాళి.



తెలుగురధం సమర్పిస్తున్న చిరుభావలహరి.



తెలుగుభాష, సంస్కౄతి, తెలుగుప్రాంతాలకు సత్య శివ సుందర ప్రతిసాక్షి - అమరజీవి - అని చెప్పడం సమంజసం.



కొంపెల్ల శర్మ - తెలుగురధం.

No comments: