Monday, November 30, 2009

నార్ల వెంకటేశ్వర రావు (1908 - 1985)

నార్ల వెంకటేశ్వర రావు (1908 - 1985)


నార్ల వారి బాటమాటలు నాణ్యాల మూటలు
బాట + మాట = నాణ్యం + మూట = నార్ల


ఏదివున్నా, ఏది లేకపోయినా, ఈయన రచనల్లో వైవిధ్యం మాత్రం పుష్కలంగా వుంది. అందుకని, వీరి రచనల సంకలనాల్లో ఏదో ఒక భాగం, ఎవరికో ఒకరికి, ఎంతో కొంత నచ్చకపోవడం అంటూ వుండదు అని పలువురు నమ్ముతారు. అంతేకాక, ఏ సమయంలోనైనా ఆసక్తిగా చదువుకోగలిగే సాహిత్యం. దీనికి ప్రామిసరీనోటులా కాలదోషం అంటూ వుండదు. ఆమాటకొస్తే, ఏ ప్రతిభ, సత్త వున్న రచయిత కలంనుంచి వచ్చే రచన అయినా, నూజివీడు మామిడి రసఫలంలా రసాలూరుతూనేవుంటుంది. అదే నార్ల వారి కలం, రచనల్లో కానవస్తుంది.



నవయుగాల బాట నార్ల మాట



ఉత్తమస్థాయి పత్రికాసంపాదకుడు, సంస్కరణశీలి, హేతువాద తత్వవేత్త, భావజాలాన్ని నార్లవారి బాట అన్నమాదిరి విన్నూత్నంగా అందించిన ఆజానుభాహుడు, తెలుగు పత్రికారంగానికి అత్యాధునిక నూతనభావనారూపశిల్పి - ఎవరోకాదు, నార్ల వెంకటేశ్వరరావు గారు. అందరికీ 'నార్లా. ఆయన బాట, మాట, యుగయుగాలకూ వ్యాప్తి కాగల అర్హత, అధికారం పుష్కళంగా పుణికిపుచ్చుకున్న పుంభావ సరస్వతి. అందుకే 'నవయుగాల బాట నార్లమాటా అని ఆయనే యిచ్చుకున్న శతకరచనకు మకుటం ఆయన జీవితానికే కడు సార్ధకం అని చెప్పాలి.



నార్ల వలస జీవనబాల్యం



అది ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. అంటే, వనరులూ, ఆదాయం అంతంత మాత్రమే కదా. సమాజంలో భాగస్వామ్యం వహించేందుకు నార్ల బాల్యంలో చాలా కష్టపడ్డాడు. ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ, ఆంధ్రప్రాంతంనుంచి పూర్వీకులు మధ్యప్రదేశ్ లోని కట్ని కి వలసపోవడం, సైన్యవిభాగాల్లోకి ఆహారపదార్ధాలను సరఫరా చేసే వ్యాపారంలో మునిగిన కుటుంబాల్లో, నార్ల వరి కుటుంబాలు ప్రముఖంగా చెలామణి అయ్యాయి. లక్ష్మణరావు, మహాలక్ష్మీ దంపతులకు, మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో 1 డిసెంబర్ 1908 న నార్ల వంశీకుడు జన్మించాడు - వెంకటేశ్వరరావు. బాల్యం, చదువు తర్వాత 'నార్లా కాలేజీ చదువు నిమిత్తం ఆంధ్రప్రాంతానికి తిరిగివచ్చాడు. పట్టభద్రుడవాలన్న చదువుతోపాటు, జాతీయ స్వాతంత్ర్యోద్యమ ప్రభావప్రేరణలతో పాల్గొన్నాడు.



ఆవహించిన పత్రికారంగం



నార్ల వారి ప్రతిభాజీవితన్ని రెండు దశలుగా భావించవచ్చు.



తొలి దశ - ఆంధ్రప్రభ



తలరాత మాట ఏమో కాని, కలంవ్రాత మాత్రం మన నార్లను నరనరాల వ్యాపించింది. బాల్యంనుంచే రాయడంపై మక్కువని పెంచుకున్న పత్రికామాధ్యమరంగంలోకి చొచ్చుకుపోయాడు. అదీ తెలుగుపత్రికారంగంలో. యిండియన్ ఎక్ష్క్స్ ప్రెస్ సంస్థలోని 'ఆంధ్రప్రభా కు ఆరాధ్యదైవంగా పేరుపొందిన సంపాదక వౄత్తిలో రాణించాడు మన నార్ల. రమారమి, రెండు దశాబ్దాలకాలంపాటు - రెండవ ప్రపంచయుద్ధం నుంచి స్వాతంత్ర్యానంతరం వరకూ - నార్ల వారి సంపాదకీయాలు, వ్యక్తిగత శీర్షికలు చదవడం అయాకే, మిగతా పేజీల జోలికి పోయేవారట. ఆనాటి మద్రాసు నుంచి ప్రారంభించిన ఆంధ్రప్రభ ప్రచురణ తెలుగు జర్నలిజంలో ఒక తలమానికమని చెప్పాలి.



మలిదశ - ఆంధ్రజ్యోతి



పత్రికాసంపాదకునిగా అపారమైన అనుభవాన్ని జోడించుకుని, నార్ల వారి విదేశీపర్యటనలను కేవలం తిరగడానికే కాకుండా, ప్రతీ యాత్ర, సాహిత్యం, కళ, వర్తమాన స్థితిగతులను అవలోకనం చేసుకుంటూ, తన ప్రతిభను విశ్వవ్యాప్తం చేయగలిగాడు. ప్రముఖ వ్యక్తులతోపాటు, గ్రంధాలయాలు, స్మారకచిహ్నాలు, కళాప్రదర్శనాలయాల్లోని స్మౄతివైభవాల్ని మరింత విస్తౄతం చేశాడు. ఈ భాగంలోనే, ఆంధ్రప్రభను విడిచి, స్నేహితులతో, ఆంధ్రప్రభలో అపారమైన అనుభవంతో, దీటైన మరొక పత్రిక - ఆంధ్రజ్యోతి - ని ప్రారంభించాడు. ఈ ప్రోత్సాహకుల్లో, ప్రముఖ వ్యాపారులు, జమీందారులు, రాజకీయనాయకులు జట్టుగట్టి, ఆంధ్రజ్యోతిని విడుదల చేశారు. వెంటనే, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య ప్రచురణగా విజయవాడలోను, ఆ తర్వాత హైదరాబాదులోను (1960) ప్రారంభించారు. మద్రాసు విభాగం మూసివేశారు. అలా ప్రారంభించిన ఆంధ్రజ్యోతి చాలాకాలం ప్రముఖ పత్రికగా పేరుతెచ్చుకుని, మూసివేయడం, ఈ మధ్యనే పున:ప్రారంభం అవడం, చెన్నైలో కూడ ప్రచురణ ప్రారంభించడం కూడ జరిగింది.



ఈ రెండు పత్రికలూ, ఎన్ని యాజమాన్యాలు మారినా, మరెన్ని రూపురేఖలు మారినా, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పేర్లు స్మరిస్తే, నార్ల వెంకటేశ్వరరావు పేరు గుర్తురాక మానదు. స్మరణకు రాలేదంటే, ఆ వ్యక్తికి, సంస్థకి, పత్రికారంగంలో పరిచయం వుందంటే, అది కుహనాభావన, పరిజ్ౙానం అని చెప్పి తీరాలి.



మరొక పరిణామం - హేతువాదం



మానసిక పరిపక్వతను పరిపుష్టంగా అందుకున్న నార్ల, గుండెజబ్బు వచ్చేకే తన పొగ తాగే అలవాటును పెంచుకుంటూనే అనారోగ్యాన్ని కూడా పెంచుకున్నాడు. ఫలితంగా, పొగని వదిలాడు. వదులుకోలేని మక్కువని తన గ్రంధాలయ నిర్వహణ విషయంలో శ్రద్ధ వహించాడు. అదే గ్రంధాలయాన్ని, తర్వాత, డా.అంబేద్కర్ విశ్వవిద్యాలYఆనికి విరాళంగా యివ్వడం కూడ జరిగింది. ఆయనలో లోతుగా పాతుకుపోయిన మానవతావాది, ఆయనలో అప్పటివరకూ అదౄశ్యంగా సంచరిస్తున్న హేతువాది ఒక్కసారి బయటకు వచ్చాడు. ఉపనిషత్తులు, భగవద్గీత, ఆధ్యాత్మిక గ్రంధాలతోపాటు, ప్రముఖుని యం.యన్.రాయ్ రచనలను చదివి ప్రభావితమయ్యాడు. ఈ దశలోనే, ప్రముఖులతోపాటు పరిచయాలు, స్నేహాలు పెరిగాయి. వారిలో ప్రముఖులు - ప్రేం నాధ్ బజాజ్ (షేక్ అబ్దుల్లా కాశ్మీర్ ప్రభుత్వం కావించిన బహిష్కరణ) కూడ రాయ్ అనుచరుల్లో ఒకరు. సుశీల్ ముఖర్జీ, నిరంజన్ ధర్, న్యాయవాది వి.యం.తర్కుండే (మానవ హక్కుల పరిరక్షకుడు), ఎ.బి.షా, ఆవుల గోపాలకౄష్ణమూర్తి (మానవత ఉద్యమంలో నాయకుడు)లను స్మరించలేకుండా జరగని పని. రాయ్ రచనలని, రాయ్ భావాలతోపాటు నార్ల చదివేవాడు. గాంధీ విధానాల్ని విమర్శించిన వారిలో రాయ్ ప్రముఖులు. రాజకీయాలకు గాంధీ అవలంబిస్తున్న మతధోరణిని కూడ రాయ్ విమర్శించేవారు.



హేతువాదితోనే పట్టింపులు



రాయ్ 1938 జూలై లో మద్రాసులో పత్రికాసమావేశంలో మాట్లాడడం, ప్రముఖ పత్రికాకారుడు ఖాసా సుబ్బారావు, యిండియన్ ఎక్స్ ప్రెస్ సంపాదకునిగా, రాయ్ భార్య ఎల్లెన్ గురించి వ్యాఖ్యలను ప్రచురించడం, సుబ్బారావుని విమర్శించడం జరిగింది. ఈ సంఘటనకి, పత్రికారంగం యావత్తూ, నార్లతో సహా, పత్రికాసమావేశాన్ని బహిష్కరించడం జరగడం, ఈ ఉదంతంతో రాయ్ ప్రస్తావన, దేశవ్యాప్తంగా మరణంపై (25 జనవరి 1954) రాయ్ ప్రతిభపై స్పందించినా, ఏమాత్రం నార్ల ఆంధ్రప్రభలో చేయకపోవడం గమనార్హం. కాని, ఒక ప్రముఖుడు గుంటూరులో చేసిన విమర్శకు ప్రభావం చెంది, వెంటనే రాయ్ రచనలన్నీ తెచ్చుకుని చదవడం, ప్రతిభావంతమైన భావాలకు ప్రేరణపొంది, 1956 లో రాయ్ గురించి నార్ల సంపాదకీయం రాయడం జరిగింది. రాయ్ భావాలు మదిలోకి వెళ్ళేకొద్దీ, నార్లకు అవి బాగా నచ్చేవి. ఫలితంగా, మునుపు విమర్శలు చేసిన, ఎ.జి.కె.మూర్తితో స్నేహం పెరిగింది. 1942-48 లో హేతువాదోద్యమాన్ని నిర్వహించిన రాయ్ చివరికి నార్ల జీవితంలో భాగం అవడం ఆశ్చర్యం, విశేషం కలిగించాయి. ఈ స్థితిలో, వయసు పైకి ముంచుకొస్తున్న కొలదీ, మానవునిలో ఆధ్యాత్మికత, కర్మవాదం అలవడుతాయి అన్న భావనకు వ్యతిరేకమేకాగ, తన విషయంలో అనుకూలత, ఆశ, మానవత్వం, పెరుగుతున్నాయన్నారు. అంతేకాక, నార్ల తన నిత్య జీవితానుభాలు, ప్రముఖుల పరిచయాలు, స్వంత ఆలోచనలు, డైరీలో ముఖ్యాంశాలను వ్రాసుకోవడం ప్రారంభించి, జీవితాంతం కొనసాగించేవారట.



గ్రంధాలు, గ్రంధాలయాల్లో మధ్య నార్ల



నార్ల గ్రంధాలయాల్ని నిత్యం దర్శించడం, చదవని పుస్తకాలని ఏరడం దినచర్య అనే చెప్పాలి. ప్రముఖంగా పాత పుస్తకాలని వెదకి పట్టుకోవడం ప్రక్రియ తనదైన శైలిలో కళాత్మకంగా జరిపేవారు. ఈ కార్యక్రమంలో ఆయన ఎన్నుకున్న విషయంలో పరిపూర్ణ పరిశోధన చేయడం జరిగాకే వ్రాయడం జరిగేది. ఈ పద్ధతిని గుర్తించి, భారతప్రభుత్వం, సాహిత్య అకాడమీవారి ఆధ్వర్యంలో, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, వేమన ల పై, భారతీయ సాహితీనిర్మాతలు అన్న ధారావాహికంలో, జీవితచిత్రణలను అందరూ మెచ్చుకునేలా రాయగలిగేరు.



పుస్తకాలతో పెంచుకున్న నేస్తం గురించి మన నార్లను చెప్పాలంటే, ఆయన తరచు చెప్పే భావం ఒకటి గుర్తు రాక మానదు.



'పుస్తకాలు కొనడమంటే నాకు చెడ్డ సరదా. జేబులో డబ్బున్నా లేకపోయినా, మంచి పుస్తకాన్ని చూడగానే బేరం చేస్తాను. ఆ పుస్తకంతో నాకు అవసరం వుండవచ్చు, లేకపోవచ్చు. ఒకసారి చదివిన తర్వాత మరి దానితో పనిలేకపోవచ్చు. అయినా దాన్ని కొనేదాక మనస్సు రెపరెపలాడుతూంటుంది. అప్పుచేసి కూడ పుస్తకాన్ని కొనడం అనేకసార్లు సంభవిస్తూంటుంది. పుస్తకాన్ని ఎరువివ్వక తప్పదు. అది పోవడం తప్పదు. అలాగనీ అసలు వాటిని కొనడమే మానలేం. ఇతరుల సంగతి తెలియదు కాని, నా విషయంలో యింతే. ఇప్పటికీ, ఎప్పటికీ."



పుస్తకాలపై నార్ల మరొక అభిప్రాయం యిలా సాగింది.



"విద్యావంతునికి పుస్తకం హస్తభూషణమని పెద్దలన్నారు. అయినా, మన విద్యావంతుల్లో పెక్కుమందికి పుస్తకం కాక, స్విచ్ వాచ్, సిగరెట్ టిన్, ట్రాన్ సిస్టర్ రేడియో మొదలైనవి హస్తభూషణాలు. నాగరీకుని గౄహానికి పుస్తకాలు అలంకారాలని వాత్స్యాయనుడు వ్రాశాడు. అయినా, మన నాగరికుల్లో అత్యధిక సంఖ్యాకుల గౄహాలకు పుస్తకాలుకాక, సోఫాసెట్లు, స్టీల్ బీరువాలు, చౌకబారు క్యాలెండర్లు మొదలైనవి అలంకారాలు. మనదేశంలో చదువులు పెరుగుతున్నా, సంస్కారం పెరగడం లేదనడానికి ఇది నిదర్శనం' నగరాలు పెరుగుతున్నా నాగరికత పెరగడం లేదనడానికి ఇది తార్కాణం."





వైవిధ్యం, విద్వత్తు, వెరసి నార్ల రచనలు



చరిత్ర, వేదాంతం, తత్వం, సంస్కౄతి, ఏదైనా సరే, నార్ల రచనాధోరణి ప్రత్యేకమే. భగవద్గీతకు వ్యాఖ్యానం రచించే ప్రయత్నంలో, ఎన్నో గీతాభాష్యాలను ఆధ్యయనం చేసి, వివిధ దౄక్కోణాల్లోంచి పరిశీలించి, వివరించడం జరిగింది. అలాగే, ఉపనిషత్తులు - ముల్లర్, షెఫ్ణోర్, నీట్జే లాంటి వ్యాఖ్యానాలను చదవడం, అనుకూల ప్రతికూలతలను విశ్లేషించడం, ఫలితంగా అనేక అభిప్రాయాలను, భావాలను, ప్రచురించారు. గీతపై సత్యశోధన, ఉపనిషత్తులపై సుదీర్ఘవ్యాసం, భారతదేశంలోని తెలివైన బీదతనం, ప్రాక్పశ్చిమరాజ్య సంస్కౄతి, యిలా ఎన్నో రచనలు వెలువడ్డాయి.



నార్ల భావలహరి



మతం కేవలం వ్యక్తిగత విశ్వాసంగా భావించి, రాజ్యం, పరిపాలనలోకి రానీయకూడదనేవారు. ప్రాచీనముని యాజ్ఞవల్క్య భావాలు పురోభివౄద్ధికి, మనుగడకు అవరోధాలేకాక నిరంకుశవాది, నియంత మూలాన, భారతదేశపు బీదతనానికి బాధ్యత అన్నారు. మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం, వెదకి నిర్ధారించ్లేని మహాత్మాగాంధి అంతరాత్మ ప్రభోధం లాంటి పద్ధతులు దేశపు స్వాతంత్ర్యం తెచ్చినా, బానిసత్వం పూర్తిగా పోలేదు అన్నారు. గాంధీకి శాస్త్రీయ విధానం లేదని, నిత్యం గీతపై ఆధారపడడం, ఆయన అహింస, సత్యాగ్రహ విధానాలే హింసకు.నిరాహార ధోరణి అనారోగ్యానికి చివరకు దారితీసాయన్నారు. యువకులకు కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలకు యువకులకు అవే మార్గాలని చెప్పి, ఆత్మసమర్ధత, ఆత్మసంయమనం అలవాటు చేసుకోనివ్వలేదన్నారు. హిందూతత్వం, మానవతాతత్వం మేళవించిన, సుగమం అయ్యేది అన్నారు. మానవతావిలువలపై దౄష్టిపెట్టి అలవరించినట్లయితే, మానవులు వారిపైనే స్వయంగా ఆధారపడి, వారి సమస్యలకు పరిష్కారాలు వారే కనుగొనేందుకు దోహదం అయేది.



యిందిరాగాంధి తెచ్చిన అవాంతరం, పోగొట్టుకున్న సంపాదకత్వం



పుష్కలమైన స్మౄతి, స్ఫూర్తి కలిగిన పత్రికాకారుడిగా, 1975లో యిందిరాగాంధి సిద్దాంతాలకు నార్ల అన్యధా ఆమోదితుడయినా, నిర్ణయం, అమలుపరచటం, నిరాశనే కలిగించింది. సంపాదకీయం తెల్లకాగితంలా వుంచుదామనుకున్నా, ఆంధ్రజ్యోతి యాజమాన్యం ససేమిరా అన్న మేరకు, నార్ల కుటుంబం యావత్తూ, అమెరికా ప్రయాణం చేయడం, జీవితంలో ప్రముఖ సంఘటన. నార్ల వారి సుగుణసంతానం, ఏడుగురూ, డాక్టర్లవ్వడం, ఉద్యోగులవ్వడం మూలాన, అత్యవసర పరిస్థితి అంతం అయ్యేకే, భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆంధ్రజ్యోతి సంఫాదకునిగా రాజీనామా చేశారు. యాజమాన్యం అనివార్య జోక్యం చేసుకున్నప్పుడల్లా, నార్ల రాజీనామా చేయడం కొత్తకాదు. యిదివరకు ఆంధ్రప్రభలో కూడ జరిగింది. కాంగ్రేసు పార్టీ రాజకీయాల్లో పాల్గొని, రాజ్యసభ సభ్యునిగా ప్రత్యక్షంగా వీక్షించిన రాజకీయాలు, నాయకుల అవినీతిధోరణి, ప్రజాజీవనం నుంచి తప్పుకోవలసివచ్చింది.



ప్రతిభావంతులకూ అండదండలు



ఏ ప్రతిభావంతునికి అన్యాయం జరిగినా నార్ల సహించలేదు. కేవలం పట్టభద్రుడైనా, జి.వి.కౄష్ణారావు చేసిన, కళాపూర్ణోదయం పై ఆంగ్లంపై పరిశోధనావ్యాసం పై రేకిత్తిన వివాదం విషయంలో, నార్ల స్వయంగా చదివి, ఉపాధ్యాయుని భాష, విశ్లేషణలోనే తప్పులున్నాయని. ఘాటుపదాలతోకూడిన లేఖను విశ్వవిద్యాలయం ఉపకులపతికి వ్రాయడంలో కనపరచిన ధైర్యసాహసాలు, కులగజ్జిధోరణితో విద్యావిధానాలను నిర్ణయిస్తున్న ఉపాధ్యాయుల వక్రతను, డా. గోవిందరాజులు నాయుడు గారు గ్రహించి న్యాయం చేయకపోతే, ప్రజలముందు ప్రస్తుతిస్తానని నిర్ద్వందంగా చెప్పడం, పట్టభద్రుని ప్రతిభ పరిశోధనలో ఉత్తీర్ణతను ప్రకటించవలసివచ్చింది. దీనితర్వాత, ఆంధ్రప్రభ లో కౄష్ణారావు వ్యాసాలు ఎన్నో ప్రచురించబడ్దాయి.



ముఖ్యమంత్రులు ఎవరైనా నార్లకు ముఖ్యులు కానేకారు!



కళాజీవన స్మౄతుల్ని, కళాకారుడిగా, అభిమానులకు జీవితముఖ్యాంశాలను పత్రికలో ప్రచురించేందుకు, గుంటూరు జిల్లా, తుమ్మపూడిలోని సూర్యదేవర సంజీవ్ దేవ్ ని నార్ల పరిచయం చేశారు. సమాజం, రాజకీయం లో అన్యాయాన్ని ఎన్నడూ సహించని నార్ల, రాష్ట్రపు ముఖ్యమంత్రులను సైతం ఖాతరు చేయని సన్నివేశాలు కోకొల్లలు. ఆంధ్రదేశపు ముఖ్య ముఖ్యమంత్రులైన - టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, పి.వి.నరసింహారావులతో ఢీకొట్టాడు నార్ల. కాసు రెడ్డిగారు అయితే, ఆంధ్రజ్యోతి పనివిధానాన్ని రోజువారీగా (1969), పత్రికాస్వేఛ్ఛని అంతరించేందుకు అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెట్టగా, పత్రికారంగం యావత్తూ విరోధించి, బిల్లును వెనక్కితీసుకునేలా ముఖ్యమంత్రిని చేయగలిగిన ఖ్యాతి, నాయకత్వం మన నార్లదే. ప్రముఖ పత్రికాసంపాదకుడు, మానికొండ చలపతిరావుగారు (నేషనల్ హెరాల్డ్ దినపత్రిక, సంపాదకులు), నార్ల నివాసాన్ని తరచుగా దర్శించి, నార్లతో ఎన్నో చర్చలు, సంభాషణలు జరిపేవారు. బౌద్ధ సంస్కౄతికి ప్రతిబింబంగా నార్ల అనేక వస్తువులు, జ్ౙాపిలకు సంగ్రహం చేసుకునేవారు.



నార్ల రచనలు రసరమ్యాలు, రమణీయాలు



ప్రముఖ సంపాదకులేకాక, రచయితగా, కధలు, కవితలు, నాటికలు, దేశచరిత్రలు, వ్యాసాలు, ప్రసంగాలు, పుస్తకాలపై విశ్లేషణలు కోకొల్లలుగా వెలిసినా, నార్లను గర్వించే ఆలోచనావాది, రచయిత, తన అసమర్ధతను పదేపదే చెప్పుకున్నా, ఎదురులేని వక్తగా తన ప్రతిభను నిరూపించుకున్నారు.



సౌరభ సంకలనాలు



నార్ల వారి సాహిత్యం యావత్తునీ, వివిధ తరగతుల్లో విభజించి, ఏడు భాగాలుగా ప్రచురణకు నోచుకొని, సాహితీప్రేమికులకు కానుకగా మిగిలింది. వాటిని, దేశచరిత్రలు, సాంఘిక నాటికలు, వ్యాసాలు, పౌరాణిక నాటికలు, సాహిత్య రచనలు, సంస్కౄతి, సాహిత్యం, మతం, వర్తమాన సంఘటనలు, జీవిత చిత్రణలు అని రసరమ్యంగా, రమణీయంగా దర్శనం చేయించారు. నార్ల వారి రచనలు, వాటి పేర్లు, హేతువాదాన్ని చెప్పకనే చెప్తాయి. ఉదాహరణకు, నార్ల, సీతజోస్యం, నరకంలో సత్యహరిశ్చంద్ర, పురాణ వైరాగ్యం (అసంపూర్తి వ్యాసం),నవయుగాల బాట నార్లమాట అన్న శతకం, యిలా ఎన్నో చెప్పవచ్చు.



వలదన్న సాహిత్య అకాడమీ పురస్కారం



సంపాదకుని తర్వాత, నాటక రచయితగా అవతారం ఎత్తారు నార్ల. 1981 లో నార్ల వారి నాటకం - సీతజోస్యం - సాహిత్య, ఆధ్యాత్మిక రంగాల్లోని ప్రజల్లో మంచి ఆసక్తి రేకెత్తింది. అయితే, ఏ అకాడమీనుంచి పురస్కారం అందుకున్నారో, ఆ సంస్థనుంచి ప్రచురించే పత్రికలోనే రచనపై విమర్శనాత్మకమైన రచనను ప్రోత్సాహించడం, పద్ధతికాదని, బిరుదుని తిరస్కరించిన శైలి నార్ల వారిది. నార్ల జీవితంలోని అనుభవాలు, వాదోపవాదాలు, అభిప్రాయాలు, ప్రసంగాలు, ప్రబోధాలు, చెణుకులు, చురకలు, పరిచయాలు, పరిచయాలను అన్ని కలిపిన స్మౄతిలిఖితాలను కొన్ని ఏరికూర్చి, 'కదంబం'గా చాలా పేరుతెచ్చింది. చాలా రచనలు ఆంధ్రప్రభలో ముద్రితమయినా, పలుకుబడివర్గం నుంచి వచ్చిన యిబ్బందులవల్ల అవి మధ్యంతరంలోనే ఆగిపోయాయి.



'తెలుగువాడీ ఆత్మగౌరవ ఉద్యమానికి చేదోడు, ప్రోత్సాహం



విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శ్రీకారం చుట్టిన తెలుగువాడి ఆత్మగౌరవానికి ఎదురైన అవమానాన్ని ఎదుర్కొనడంలో ఆచరించిన ఉద్యమానికి, నార్లవారు కూడ తనదైన శైలిలో చేయూత, ప్రోత్సాహం,తెలుగుదేశం స్థాపనలో భాగస్వామ్యం వహించారు. సాంస్కౄతిక వ్యవహారాలపై, రామారావుగారి ప్రభుత్వానికి సలహాదారుగా నార్లవారు తన సలహాలను, సంప్రదింపులను అందించారు.



కుటుంబమంతా వైద్యుల మయం



ధర్మపత్ని సులోచనాదేవి సహకారం ఎప్పుడూ చెప్పుకునేవారు నార్ల. అనేక విశ్వవిద్యాలయాలు నార్లకు డాక్టర్ ప్రదానం చేసినా, ఆయన ఎప్పుడూ పేరుతో దాన్ని జోడించుకోలేదు అన్నది విశేషం. అష్టదిగ్గజాలవంటి సంతానం నార్లకు. పరిమితంపై అచంచలమైన అవిశ్వాసం. నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. అందరూ వైద్యులూ, వైద్యులనే వివాహమాడారు. శ్రీమతి నార్ల తప్పితే, అందరూ డాక్టర్లే అంటారు. రెండు సంస్కౄతులు, భాషలమధ్య వివాహాలు తనకు సంతౄప్తినిచ్చాయని చెప్పారు. సంతానం ఎంత పట్టుపట్టినా, నార్ల మాత్రం విదేశాలకు వలస మార్చలేదు. వచ్చిపోతూండడమే తప్ప.



జీవితాంతం వెంటాడిన గ్రంధాలయం, హేతువాది నిజ దేవాలయం



నార్ల వారి పుస్తకాలు, నిజనేస్తాలు. మనసుల్ని, మనుషుల్ని నిజస్వరూపులుగా తీర్చిదిద్దేవి పుస్తకాలే. మెదడుకి మేత పుస్తకాలే అంటారు. ఎవ్వరినీ, వాటిని చదవనిచ్చేవారు కాని, తీసుకోనిచ్చేవారు కారు. ఎన్నో సంగ్రహాలయాలు, విశ్వవిద్యాలయాలు, ఆయన గ్రంధాలయంపై కన్ను వేశాయి. ఆయన చివరి శ్వాస వరకూ వాటిని చెక్కుచెదరనీయలేదు. వాటి సమక్షంలోనే ఆయన ప్రాణం వదిలాదు. నార్ల వారికి నిజ నేస్తాలు - పుస్తకాలు, నేస్తాలు. నార్ల మరణం తర్వాత, భార్య సులోచన చాలాకాలం నిర్వహించి, చివరకు అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి భూరి విరాళంగా అందజేయడం తెలుగుకళ్ళు చేసుకున్న పుణ్యం. తెలుగు మేధ అందుకున్న మరింత తేజోకాంతిమయం. హైదరాబాదులో ప్రతీ ఏట, నార్ల పేరట స్మారక ఉపన్యాసాలు, సభాసమావేశాలు జరగడం పరిపాటి.



నార్ల వెంకటేశ్వరరావు గారికి నిజమైన స్మౄతినివాళి, తనకు ప్రేమాభిమానపాత్రమైన పత్రికారంగంలోని సంపాదకునిగా, రచయితగా, వెలిబుచ్చిన కొన్ని మచ్చుకైన అభిప్రాయాలను పున:శ్చరణ చేసుకోవడం కన్నా, ఆయన ఆత్మకు శాంతి లేదు, రాదు.



నార్ల వారి జయంతి సందర్భంగా తెలుగురథం షతసహస్ర ప్రణామాలని సమర్పిస్తోంది.



కొంపెల్ల శర్మ

'నార్లావారి సునాదాలు



అనంత కోటి ముక్కలుగా చీలుతున్న ఈ భూగోళం మీద మనుషులందర్నీ కలిపే మార్గం ఒకటుంది. అదే వార్తావాహిని.



ప్రజల సరసన నిలచి ప్రధనమ్ము నడుపుట పరమ ధర్మమోయి పత్రికలకు.



ప్రభుత వక్రమౌను పత్రికలేకున్న



వేగం జర్నలిష్టుల వేదం.



పత్రికయె నియంత పక్కలో బల్లెమ్ము పత్రికయె ప్రజాళి పట్టుగొమ్మ.



వేయి ప్రశ్నలుండు విజ్ౙానవేత్తకు ప్రశ్నలుండబోవు పామరునకు విజ్ౙుడౌను నరుడు జిజ్ౙాస.



వార్త పక్షాన వదంతిపై యుద్ధం, స్వాతంత్ర్యం పక్షాన నిరంకుశంపై యుద్దం. న్యాయం పక్షాన అన్యాయం పై యుద్ధం.



వార్తనేక మౌను ప్రాక్పశ్చమమ్ములు వార్తవలన స్వేఛ్ఛ పరిధి పెరుగు వార్త లేక వసుధ వర్ధిల్లనేరదు.



పదవినున్నవారు మదమ్మత్తులైనచో పట్టి పీకనట్టి పత్రికేల? తోకముడుచు పులని లోకమ్ము నమ్మదా?



పత్రికా రచయిత ప్రతిహారిగా నిల్వ అవని నిద్రపోవు నాదమరచి అతడు నిద్రపోవగతియించు భద్రత.



వర్తమాన జగతి పరివర్తనాలపై స్వేచ్ఛతోడ వ్యాఖ్య సేయనట్టి ఎడిటరెందుకోయి ఏటిలో గలుపనా.



పత్రికొక్కటున్న పదివేల సైన్యము.



పత్రికా రచనను పడుపు వౄత్తిగా మార్చు వెధవకంటే పచ్చి వేశ్య మేలు తనువు నమ్ము వేశ్య, మనసును కాదురా!



నార్లవారి శతజయంతి ఉత్సవాలు త్వరలో ... 1808 - 1908



ప్రతిభామూర్తి జయంతి, వర్ధంతి సాధారణమే. కాని, శతజయంతి నిజంగా, శతధా, సహస్రధా, జరుపుకోవడం, సర్వదా హర్షనీయం. నార్ల వారి ఆశయాలు, ఆశలు, ఈ ఏడాదిపాటు సింహావలోకనం చేసుకుని, అమలుపాటి కార్యక్రమాల్ని ప్రణాలికాబద్ధంగా విజయవంతంగా ఆచరణకు నోచుకుంటే, అంతకన్న అర్ధం, పరమార్ధం, లేవు, రావు.



'నార్లా జయంతి సందర్భంగా, తెలుగు జర్నల్ నుంచి ఘననివాళిని సమర్పించుకుంటూ ...

No comments: