Tuesday, October 28, 2008

తెలుగు సాహితీజగతికి నిరంతర కుటుంబ పెద్ద - కొడవటిగంటి

తెలుగు సాహితీజగతికి నిరంతర కుటుంబ పెద్ద - కొడవటిగంటి
'కొడవటిగంటీ జయంతి
మధురోహలు
సాహిత్యం నుంచి ప్రజలను, రాజకీయాలనుంచి సాహిత్యాన్ని, ప్రజలనుంచి రాజకీయాలను రక్షించేందుకు జరిగే ప్రయత్నాలు నాకు ఎల్లప్పుడూ ఉత్తేజం కలిగిస్తాయి.నియంతలధోరణి, నిరుద్యోగం, ఉపాధిని కోల్పోవడం, యుద్ధవాతావరణాది సమస్యలను కళాకారులు కాకుండా కేవలం రాజకీయనాయకులే చర్చించేందుకు అర్హులు అన్న వాదం మూర్ఖులదే అవుతుంది, వారి తెలివితక్కువతనం బయటపడుతుంది. సాహిత్యం ద్వారా లభించే సరియగు మార్గములో జరిగే సామాజికమార్పు అభ్యుదయసాహిత్యమనే చెప్పాలి. ముందుచూపుతోనే మార్పు జరుగుతోందని చెప్పవచ్చు. ప్రకౄతి రహస్యాలని వెల్లడించనిది శాస్త్రం కాదు; జీవితంలోని కష్టసుఖాల్ని, ఈతిబాధల్ని కనుగొనలేనిది పరిశోధన కాదు; జీవితంలో వెలుగుకాంతుల్ని ప్రసరించలేనిది సాహిత్యం కాదు. మనం సౄష్టించుకున్న సాహిత్యం సమకాలీన తరానికే పనికిరావాలి - గతతరపు ప్రతినిధులకు సాహితీవిలువలను ప్రస్తుతకాలంలో నిర్ణయించే ప్రయత్నం మనలని మనం మోసం చేసుకోవడమే.
పై అభిప్రాయాలు, ఒక సాహితీయుగానికి ఏకైక ప్రతినిధిగా భావించదగిన సాహితీకొదమసింహం - కొడవటిగంటి కుటుంబరావు గారివి. సాహితీప్రపంచం, ఈ మహానుభావుణ్ణి, ముద్దుగా 'కొకూ అని, కొడవటిగంటి అని, కుటుంబరావు అని మార్చి మార్చి సందర్భంగా స్తుతించడం జరుగుతుంది.
వైశిష్ట్యం, వైవిధ్యం - సాహితీవైతరణి
కొడవటిగంటి వారిని పరిచయం చేయడం దుస్సాహసమే అవుతుంది. అందుకనే, ఆయన స్వంతభావాలతోనే వ్యాసానికి నాందీప్రస్తావనలు చేయడం జరిగింది. దివాకరుని దివిటీతో చూపడం లాంటిది. ఆధునికతకే ఆధునికత ఆయన తెలుగు సాహితీశైలి. ఆయన ఒక పదకోశం; ఒక సాహితీపరిశోధనాలయం; బహుముఖ సాహితీప్రక్రియలను ఆపోశన చేసినవాడు. శాస్త్రం, సమాజం, పరివర్తన, కళ, ఏదైనా సరే, ఆ ప్రక్రియను క్షుణ్ణంగా ప్రదర్శించిన ప్రముఖ సాహితీమూర్తి. మహాకవి గురజాడ తో ప్రారంభమైన ఆధునికసాహిత్యం, కొడవటిగంటి వారితో ఒక మలుపు, మెరుపు ఆవహించాయి. సాహిత్యానికి శాస్త్రీయతను జోడించి, ప్రతిభావంతమైన ప్రజ్ణానాన్ని, ప్రకౄతి, సమాజం, కళలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటూ తన సాహితీపరంపరను దీర్ఘగతిని కొనసాగించాడు. సాహిత్యం, కళ, ఆర్ధికశాస్త్రం, సామాజికశాస్త్రం, భౌతిక జీవ శాస్త్రాలు, వేదాంతం, మనస్తత్వం, సమకాలీన రాజకీయాది విషయాలపై సమస్యలను అన్వయించుకొని సాహిత్యాన్ని సౄష్టించడం జరిగేది. తనకున్న అపారమైన శాస్త్రీయ పరిజ్ణానాన్ని మానవ, సామాజిక సమస్యలకు అన్వయం చేసుకుంటూ రచనలను చేసిన సాహితీప్రతిభాసంపన్నుడు, కొడవటిగంటి కుటుంబరావు గారు. మధ్యతరగతి, సగటు మానవుడే నిత్యం యితివౄత్తం. ఈ వర్గపు ప్రాతిపదిక, మధ్యతరగతి ప్రజలకు నిత్య సంఘర్షణ అనివార్యం అని నమ్మిన సాహితీకుటుంబ ప్రతినిధి. కేవలం విప్లవ భావాల్ని తన సాహిత్యంలో జొప్పించడం కాదు, తెలుగు విప్లవ సాహితీవిధానాలకి నీరుపోసి, పాదును పెంచిన ప్రతిభాకౄషీవలుడు. కొకు నవల 'తారా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందడం దీనికి సోదాహరణం.
బాల్యంనుంచే సామాజిక స్పౄహ
చిన్నతనంనుంచే అలవోకగా అలవడిన సామాజిక స్పౄహ, కొకు లోని రచయితను తయారుచేసింది. అందుకే సాహిత్యం సమాజం నుంచి వేరు చేయలేకపోయాడు. తన అభిప్రాయాలకు అక్షరరూపం యివ్వని ఒక రాత్రి-పగటి కాలం ఆయన గడపలేదంటే, ఆయన సన్నిహితులకే ఆశ్చర్యం కలిగించేది. అంతేకాక, కొకు స్పౄశించని సాహితీప్రక్రియ లేనేలేదు అని చెప్పాలి. ఈయన కల్పించిన 'గల్పికా బహుళప్రచారం చెందింది. సాహితీలోకం, కధానిక, కధ మాత్రమే పరిచయమున్న, ఒకటి-రెండు మూడు పేజీల్లో కుదించిన సంపూర్ణభావసంచిక గా అవతరింపచేశాడు. పైగా కొకు సాహితీసంకలనం ప్రచురణలో, వర్గీకరణం, సాహిత్యాంశాల రాశి, ప్రక్రియలు కూడ సమస్యలు అయి తిష్ఠవేసుకున్నాయి. ముదిమి వయసులో కూడ, కొకు సామాజికం, చరిత్ర, కళ, యిత్యాది ఆంశాలపై సుదీర్ఘ విశ్లేషణాత్మక వ్యాసాలు విరివిగా వచ్చేవి. ఈ కోవలో, 'వేదాల్లో ఆర్యుల స్థానం', 'చలనచిత్రాలూ, యిలా వుండేవి ఆయన శీర్షికలు, యితివౄత్తాలు. బహు సరళంగ్ఫా, వాడుకభాషలో, అన్ని వర్గాలనీ బహుశ్రద్ధాభక్తులతో చదివింపచేసేవి. పరమ ఛాందసుల మూస నుంచి సాహితీవ్యాసం రూపురేఖల్లో ఒక విప్లవం తెచ్చాడనే చెప్పాలి. ప్రజాసాహిత్యం, సమకాలీనపు వాడుకభాష, ప్రాచీన ప్రబంధ సాహితీ ధోరణులకు భరతవాక్యం పలికి, ప్రేరణాత్మక సామెతలు, జాతీయాలు, ప్రయోగాలను తన సాహితీప్రక్రియల్లో రంగరించిన రససాహితీమూర్తి.
అభ్యుదయం, ప్రగతి, కొకు నేస్తాలు
అభ్యుదయ సాహితీ ప్రస్థానోద్యమాల్లో, కొకు ఎప్పుడూ ముందు వరసలోనే కనిపించేవారు. వీటితోపాటు ఆయన సాహితీప్రభ కూడ వెలిగింది. ఆనాటి నవ్య సాహిత్య పరిషత్తు సభ్యుడు. మార్క్సిజ భావాల ప్రేరణతో అభ్యుదయ రచయితల సంఘం లో 40 దశకాల్లో సేవలు, విప్లవ రచయితల సంఘం స్థాపన 1970 నుంచి ఉపాద్యక్షుడిగా చరమదశ వరకూ కొనసాగిన ప్రతిభామూర్తి. సాహిత్యంలో అభ్యుదయ భావాలకు విధివిధానాల్ని రూపకల్పన చేసిన చైతన్యస్ఫూర్తివంతుడు. పురోగమనం, ముందుచూపు, ముందటి ఆలోచనే తప్ప, గతం గురించి పాకులాటకు పోని ఆలోచనాపరుడు. అభ్యుదయ భావం, సంస్కరణాలోచనం, కొకు నరనాడుల్లో పాకిపోయింది. సమగ్రత, మానవత, నవత మార్గాలను కేవలం ఆలోచనల్లోనేకాక, ఆచరణకు దారితీసిన కొకు సాహిత్యం ఒక బాధ్యతను, హక్కును కూడ సరిసమంగా ప్రదర్శించగలిగాయి. సమాజాన్ని, మానవుణ్ణి, సంథానించుకుంటూ మానవజీవితాన్ని సరళంగా, సమగ్రంగా, తన సాహిత్యం ద్వారా ప్రతిభావంతంగా, బహుప్రక్రియలతో, సుదీర్ఘకాలం సాహితీజగతికి అందించగలిగిన స్ఫూర్తి, దీక్ష, సంకల్పం, త్రివేణీసంగమమై కొకు కలంనుంచి ప్రవహించాయి. ఆలోచనాత్మకంగా, అన్యాయాన్ని పోరాడడంలో, ఛాందసభావాల్ని వదలివేయడంలో కొకు ధరించిన పాత్ర శ్లాఘనీయం. కొడవటిగంటి కుటుంబరావు గారు నిత్య, సత్య, సత్వరపు సాహితీప్రభంజనంగా, కళావాదిగా, సాంకేతికతను, శాస్త్రాల్ని జోడించి, ఆధునిక తెలుగు సాహిత్యజగతికి ఒక మూలవిరాట్టుగా సాహిత్యచరిత్రలో ఒక సుస్థిరస్థానాన్ని తనకు తాను సంపాదించుకోగలిగిన బహుళప్రతిభామూర్తి.
కుటుంబరావు జీవనప్రస్థానం
ఆంధ్ర పారిస్ గా పిలవబడే, తెనాలి లో 1908, అక్టోబరు 28న కొడవటిగంటి వారు మధ్యతరగతి కుటుంబం లో జన్మించారు. దశాబ్దకాలానికే తల్లిదండ్రుల్ని కోల్పోయిన కొకు గుంటూరు ఆంధ్ర క్రిష్టియన్ కాలేజీలో యింటర్మీడియట్, విజయనగరం మహారాజా కాలేజి లో భౌతికశాస్త్రంలో డ్రిగ్రీ చదువులోనే రచనావ్యాసాంగం అలవడింది. ఈ సమయంలోనే ఆయనలో నాస్తికభావాలు కూడ అంకురించాయి. కాశీలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో యం.యస్సి. భౌతికశాస్త్రంలో చేరినా, ఆర్ధికసంక్షోభంలో పూర్తికాలేకపోయింది. గుమాస్తా, ఉపాధ్యాయుడు, కర్మాగారంలో పర్యవేక్షకుడు, చలనచిత్రరచయిత (సంగీత దర్శకత్వం తో సహా) వౄత్తులలో రాణించినా, చివరకు పత్రికారంగంలో స్థిరపడడం జరిగింది. అనుకోకుండా, చందమామ, ప్రతిభావంతమైన పిల్లల పత్రిక కు మకుటంలేని మహారాజ సంపాదకునిగా తిరుగులేని ప్రతిభను, 1952 నుంచి 1980లో మరణం వరకు ప్రదర్శించిన వైనం అందరికీ తెలిసినదే. సహరచయితలతో సుదీర్ఘచర్చలు, లేఖలతో సత్సంబంధాలు పెంచుకునేవారు. మానవజీవితానికి పరమ యింధనమైన ధనం గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించనేలేదు. కొకు గారి భార్య వరూధిని. అమ్మాయి, యిద్దరు అబ్బాయిలు. ఆంధ్రపత్రిక దినపత్రికలో, జరుక్కుశాస్త్రితో సహోద్యోగం, జాతీయ ప్రచారక సమితిలో కాపీరైటర్ గా, ఎయిర్ యిండియలో ఎక్కౌంట్స్ విభాగంలో కూడ ఈయన ప్రతిభను అందించారు.
సమగ్ర సాహితీసంకలనాల ప్రచురణలు
ప్రముఖ సాహితీ ప్రచురణ సంస్థ, విశాలాంధ్ర, ఆచార్య కేతు విశ్వనాధరెడ్డెగారి సంపాదకత్వంలో వెలువడిన సాహిత్యసర్వస్వాన్ని చదివి, ఆనందించి, అనుభూతి చెందాలి తప్పితే, వేరే దారి లేదు. వారసత్వం, ఐశ్వర్యం, ఎండమావులు, అరుణోదయం, జీవితం, గడ్డురోజులు, అనుభవం, సవతితల్లి, పంచకళ్యాణి, అనామిక, ఆడజన్మ, నీకేంకావాలి, ప్రేమించిన మనిషి, కురూపి, బెదిరిన మనుషులు, బ్రతుకుభయం, బకసుర, గ్రహశకలం, కులంలేని మనిషి, సరితాదేవి డైరీ, సరోజ డైరీ, మారుపేర్లు, తార, తిమింగలం, మారిన జీవితం నవలతో పాటు అసంఖ్యాకమైన కధానికలు, కధలు, గల్పికలు, నాటకాలు, దిబ్బకధలు, సైన్స్ కధలు, అపరాధ పరిశోధక కధలు, ఎన్నో వ్యాఖ్యానాలు, చురకల చెణుకుల సంపుటాలు, విప్లవ రచయితల సంఘం ద్వారా శాస్త్రం, చరిత్ర, సంస్కౄతీరంగాల్లో వ్యాసాల పరంపర, కేవలం సోదాహరణలే కాని, మొత్తం రచనల పట్టికలు రాయలేని అపారరచనాసంసారం మన కొడవటిగంటి కుటుంబరావు గారిది. కొకు గారిది సాహితీబ్రహ్మాండం; ఆధునిక సాహితీసార్వభౌముడు; తలమానికమైన, అత్యధికమైన, సాహితీ పరిమాణం, ప్రమాణం, వెరసి - కొడవటిగంటి కుటుంబరావు అనే వ్యక్తి, సంస్థ, ప్రపంచం, జగతి, విశ్వభరిత విద్వత్సాగరం.
నేడు - కొడవటిగంటి కుటుంబరావు గారి జయంతి (28 అక్టోబర్ 1909). ఈ సందర్భంగా, ఆంధ్రసాహితీప్రపంచం, వినయవిధేయతలతో, ప్రణామాలు సమర్పించడం, ఆయన సందేశాలని, భావాలని, కలకాలం స్మరణలో వుండేట్లు, ఆచరణయోగ్యాలుగా కావాలని, సాహితీసరస్వతిని ప్రార్ధిస్తూ, ఆయన ఆత్మకు ఘననివాళ్ళను తెలుగురధం సమర్పించుకుంటోంది. ఓం శాంతి:
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments: