బహుముఖ పాండితీసంగమం - పాములపర్తి నరసింహుడు - జయంతి
( 1921 - 2004 )
రాజకీయపండితుడు
విలక్షణ వ్యక్తిత్వం. బహుముఖరంగాల్లో పాండితీప్రకర్షకుడు. ముక్కుకు సూటుగా పోయేవాడు. అంతేకాదు, ముక్కు కూడ బలే రాటుదేలి సూటిగా పొడుచుకు వచ్చినట్లు కోణంతేరి కనిపిస్తుంది. తెలుగువాడు చేసుకున్న బహుజన్మల పుణ్యం. తెలుగుగడ్డపై జన్మించిన ప్రతిభాశాలి. అన్నిరంగాలలో ఆరితేరినవాడు. అపర చాణక్యుడు. తెలుగు మాతౄభాష; అయితే, ఉర్దూ, మరాఠీ, కన్నడ, హిందీ, ఆంగ్లంలతో సహా 13 భాషల్లో అపరప్రావీణ్యం కలిగినవాడు. యివి సరిపోక, భారతదేశంలో అంత అధికంగా సంభాషించని అనేక యూరోపా భాషలైన, ఫ్రెంచ్, స్పానిష్ ల్లో కూడ విద్వన్మూర్తి. జగమెరిగిన తెలుగు సాహితీజగతిలో జగద్విఖ్యాత సాహితీమూర్తి. న్యాయంగా చెప్పాలంటే నిజమైన న్యాయవాది. అయినా రాజకీయరారాజు. సామాజికార్ధికరంగాల్లో విప్లవానికి పునాదిరాళ్ళను పాతినవ్యక్తి - ఎవరో కాదు, పాములపర్తి వేంకట నరసింహారావు. అందరి నోళ్ళళ్ళో 'పివీ గా బహు సుప్రసిద్ధులు. స్వంతరాష్ట్రంలోనూ, జాతీయస్థాయిలోనూ, రాజకీయాల్లో రాణించిన రాజకీయోద్దండుడు.
జీవనప్రస్థానం
పాములపర్తి వెంకట నరహరి నరసింహారావు వరంగల్లు జిల్లాలోని కోపల్లె గ్రామంలో 1921 జూన్ 28న రుక్మబాయి, సీతారామరావు దంపతులకు జన్మించిన, రావు సంపన్నకుటుంబం నుంచి వచ్చారు. కరీంనగర్ జిల్లాకు చెందిన పెద్దవంగర స్వగ్రామం. పాములపర్తి వెంకట రంగారావు, రుక్మిణి దంపతులకు దత్తపుత్రునిగా అలరించిన పిదప పాములపర్తి వారి కుటుంబానికి వారసుడయ్యాడు. పివి వరంగల్లు జిల్లాలో ప్రాధమిక విద్యనభ్యసించాడు. ఉస్మానియా, ముంబాయి విశ్వవిద్యాలయాల్లో విద్యను సాగించిన, నరసింహారావు న్యాయవిద్యలో రాణించారు.
నిజాం పై కాలుదువ్వినవారిలో - పివి
రావుగారు విద్యార్ధిదశలోనే, 1938లోనే హైదరాబాదు రాష్త్ర కాంగ్రేసు పార్టీలో చేరి, నిజాము ప్రభుత్వపు నిషేధణను ధిక్కరిస్తూ వందేమాతరం గీతాన్ని గానం చేసిన ధీశాలి. ఫలితంగా ఉస్మానియా బహిష్కరణకి గురయి, మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి, ఆయనవద్దనే వుంటూ 1940-44 లో న్యాయవిద్యను అభ్యసించాడు. స్వామి రామానందతీర్ధ, బూర్గుల రామకౄష్ణారావులతోపాటు స్వాతంత్ర్యపోరాటంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు. బూర్గులవారి శిష్యరికంలో కాంగ్రేసులో చేరి, అప్పటి యువనాయకులు మర్రిచెన్నారెడ్డి, శంకరరావు చవన్, వీరేంద్రపాటిల్ లతో కలసి యువకాంగ్రేసు కార్యకర్తలుగా పేరుపొందారు. మూడు పదుల ప్రాయానికే అఖిలభారతకాంగ్రేసులో సభ్యుడిగా స్థానం సంపాదించిన ఘనుడు నరసింహుడు. ఈకాలం - 1948-1955 మధ్య బంధువు పాములపర్తి సదాశివరావు తో కలసి కాకతీయ పత్రిక ను తెలుగు వారపత్రికగా సంపాదకత్వం వహించడం కూడ విశేషం. రావుగారి సాహితీభాషాసంస్కౄతీపటిమకు పునాది యిక్కడినుంచే అని చెప్పవచ్చు.
అసంఖ్యాక రాజకీయ సోపానాలు
భారతీయ జాతీయ కాంగ్రేసు లో వివిధస్థాయిల్లోను, 1962-1971 దశాబ్దంలో మంత్రిత్వశాఖలను నిర్వహించిన నరసింహారావుగారు, ఆంధ్రుడిగా ఆంధ్రరాజకీయానికి పగ్గాలు పట్టి 1971-73 లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టి, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఫలితంగా పదవిని వదులుకోవలసివచ్చింది. రాజకీయంలో అతిసహజమైన విచ్చినంలో భాగంగా, కాంగ్రేసు విడిపోయినప్పుడు, 1969లో అప్పటి ప్రధానిమంత్రి యిందిరాగాంధీ నాయకత్వానికి విధేయతని ప్రకటించడం, అత్యవసర పరిస్థితి పరిపాలనలో 1975-77 మధ్య కాలంలో అపర రాజకీయ చాణక్యుడి పాత్ర కూడ వుందనే చెప్పాలి.
భారతదేశానికి తొలి తెలుగుబిడ్డ ప్రధాని
జాతీయ రాజకీయాల్లో ప్రతిభాపాండిత్యాలని ప్రదర్శించిన పాములపర్తివారు 1972 లో సవ్యసాచిలా, గౄహ, రక్షణ, విదేశీవ్యవహార శాఖల్లో 1980-84 లో రాణించిన తీరు అద్భుతం. తల్లీకొడుకులు, యిందిరాగాంధి, రాజీవ్ గాంధి ల నాయకత్వంలో సరిసములులేని రాజకీయదురంధరుడు, మన నరసింహుడు. రాజకీయ చరిత్రలో, అనూహ్యఘటన, రాజీవుని హత్య పిదప ఉధ్భవించిన నాయకత్వసంక్షోభంలో, 1991 ఎన్నికలు జరగడం, ఏకోణంలోంచి ప్రశ్నించలేని, సమాధానపరచుకోవలసిన అవసరం లేకుండ, రాకుండ, మన పివినరసింహారావుగారు, కాంగ్రేసు పార్టీకి నాయకత్వం వహించడమే కాడు, భారతీయ రాజకీయ చరిత్ర, అందులో, దక్షిణభారత రాజకీయ చరిత్రలో, మొట్టమొదటిగా, పదహారణాల తెలుగుబిడ్డ దేశపుగద్దెని ఆరోహించాడు. అప్పట్లో అత్యధిక స్థానాలు పొందిన పక్షంగా, మైనారీటీ దశలో వున్నాకూడ, పూర్తి పదవీకాలం దేశప్రధానిగా, ప్రతిభావంతంగా, ప్రపంచపునడతకు దీటైన స్థాయిలో దేశంలో సరళీకరణవిధానాలు, ఆర్ధికవిధానంలో మార్పులను ప్రవేశపెట్టడం, వాటిని న భూతో న భవిష్యతి అన్నట్లే అమలుపరచడం పట్ల, భారతదేశపు ఆర్ధికస్థాయి ఎప్పటికీ సుస్థిరతనించి దిగజారదనిపించే స్థాయికి నిలబెట్టిన నిపుణత, మన నరసింహుడెదే. ఆ విషయంలో ఆయన ఉగ్రనరసింహుడే. ఆయన అలవరచుకున్న మితభాషితనం అమితప్రతిభాపాటవాలకి దారితీసింది. రాజకీయమౌని గా పేరుపొందాడు.
తలమానికమైన స్థానం - ప్రపంచస్థాయిలో చిరస్మరణీయం
ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల నుంచి కనివిని ఎరుగని తీరులో, అత్యధికమైన ఓట్ల మెజారిటీ, 5 లక్షలు సంపాదించిన ఘనత మన నరసింహుడిదే అని గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా లిఖించిన ఘనత మన తెలుగుబిడ్డదే అనడం గర్వకారణం కాక మరేమిటి. ప్రధానమంత్రిగా కొనసాగిన ఆ అయిదేళ్ళు, మరో రాజకీయదురంధరుడు, మహారాష్ట్రనాయకుడు, షరద్ పవార్ ని అంధ్రకేసరి ఢీకొన్న శైలి, అదికూడ రక్షణశాఖలో వున్నవాని రాజకీయానికి ప్రతిసవాలుని విసిరిన విశేషప్రతిభాశాలి మన నరసింహారావు.
సాహితీపాండిత్యంలోనూ కవిశ్రీనాధుడే మన నరసింహుడు
బహుబాషాకోవిదుడు, మౄదుసంభాషి, అయినా, మితభాషి, చతురుడు అయిన నరసింహారావుగారు కలం పట్టేడంటే, అపరమధురకవి, గద్యపోతనే అని చెప్పాలి. రాజకీయాల్లో క్షణం తీరికలేని పనితనంతో పాటు, పివి నిరంతర రచయిత. ఆయన మేధస్సులో, రాజకీయసాహిత్యాన్ని సౄష్టించుకుంటూనే, నిజసారస్వతాన్ని కూడ సౄష్టిస్తూ, అద్భుత రచనలను అందించాడు. తన రచనలను స్వయంగా, వౄద్ధాప్యం వరకూ, సాంకేతికంగానే, చేయడం మరో విశేషం. కంప్యూటర్ ని వాడడమే కాదు, ప్రావీణ్యుడే. జ్ణానపీఠం అనగానే తెలుగులో మొదటగా గుర్తువచ్చే అప్రతిభాశాలియైన ఏకైక తెలుగుకవి విశ్వనాధ సత్యనారాయణగారి వేయిపడగలు సుప్రసిద్ధ నవలకు మరింత వన్నెలను రంగరించి, దాని విలువలను పరిపోషించి, హిందీభాష, దేశపురాజభాషలో, సహస్రఫణి గా అనువదించడం, ఈ ప్రతిభాపూర్వకమైన అనువాదం, కాదు, అనుసౄజనం, రచనకు కేంద్రసాహిత్య అకాడమీ వారి సత్కారానికి గురయింది అంటేనే, దాని విలువను చెప్పవచ్చు. వేరే విశ్లేషణలు, వివరణలు అనవసరం. అలాగే, అబల జీవితం అన్న ప్రముఖ మరాఠీరచనకు ఆంధ్రానుసౄజనం కావించారు.
పివి ఆత్మకధ - లోపలిమనిషి (ఇన్ సైడర్)
నరసింహారావు గారు, తన విస్తార రాజకీయ,సాహిత్య, భాషాపాండిత్యాలని క్రోడీకరించి, రచించిన ఆత్మానుభూతి, భావ ప్రతిబింబాల సమాహారంగా, ఆంగ్లంలో 'ఇన్ సైడఋ రచనను అనేకభాషలలోకి ప్రచురణ జరగడం, తెలుగులో లోపలిమనిషి గా చాలా ప్రఖ్యాతమవడం ఆయన ప్రతిభాపాండిత్యాలకి ప్రత్యేక, ప్రత్యక్ష నిదర్శన తార్కాణాలు. తన సాహిత్యంలోను, తన రాజకీయపుటనుభావాలను సుస్పష్టంగా పేర్కొనడం కూడ మరో విశేషం.
అవసానదశ
పాములపర్తి నరసింహారావుగారు 23 డిసంబర్ 2004 లో డిల్లీలో పరమపదించారు. ఆ సందర్భంగా ఆయనకు జరిగిన పరాభవం, వచ్చిన విమర్శలు, మనిషి జీవించినంతకాలం ఎదురవ్వని సమస్యలు, మరణించాక అవతరిస్తాయి అన్నది మన నరసింహుడి విషయంలో జరగడం విచారం, దారుణం, అమానుషం. ఏ ప్రతిభావంతునికీ జరగకూడదని అందరం నేర్చుకున్న గుణపాఠం. మన తెలుగుబిడ్డ దేశానికి నాయకుడిగా చేసిన ఆయన ప్రతిభాపాండిత్యాలని మాత్రం మరువలేని, మరువరాని, సంగతని మనం మరువరాదు. ఆయన ఆత్మకు శాంతిని సమకూర్చడంలో ప్రతి ఆంధ్రుడూ తనవంతు నివాళిని సమర్పించడం మన కర్తవ్యం, విధి.
మన మహానుభావుడు, పి.వి.నరసింహారావుగారి 88వ జయంతి సందర్భంగా, తెలుగురధం శతసహస్ర ప్రణామాల్ని సమర్పిస్తోంది. మళ్ళీ తిరిగి హస్తినాపురి అధికార పీఠంపై మన తెలుగుతేజం ఎప్పుడు ఆసీనమవడం జరుగుతుందే అని సకల తెలుగుప్రజ ఎదురుచూస్తోంది అన్నదాంట్లో ఎటువంటీ సందేహం లేదు.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
No comments:
Post a Comment