Tuesday, October 20, 2009

నిదురించిన పాట - వాడని సిరా - శేషేంద్ర



నిదురించిన పాట - వాడని సిరా - శేషేంద్ర శేషజ్యోత్స్న "ఏ రస్తా ప్రజాకోట్ల అడుగులతో పునీతం అయిందో అదే నా రస్తా" అని సంచలనం సౄష్టించాడు. కవిత్వం రాయడం, కవిత్వం కవిత్వంగా రాయడం తగ్గిపోయిన నేటికాలంలో రసపిపాసితుల రసనలకు పథ్యంగ్తా కవిత్వం రాయగన్న, కవిత్వం కవిత్వంగా రాసిన కవిరాయడు. ఈయన్ని అచ్చమైన కవి అని వర్ణించాడు, ప్రముఖ రచయిత, విమర్శకుడు, ఆర్.యస్. సుదర్శనం. ఒక్క పువ్వు రంగును చూస్తూ నేను శతాబ్దాలు బ్రతగ్గలను అన్నాడు - పువ్వులో ఈయన ఏం చూసి, ఏఏ భావనలను పొందగలడో చెప్పడం ఎవ్వరి తరమూ కాదు. కవిత్వతత్వానికే కవిగా ప్రాధాన్యత యిస్తాడు. కేవలం ఒకానొక ప్రయోజనాన్ని దౄష్టిలో పెట్టుకొని కవిత్వ తత్త్వాన్నే విస్మరిస్తున్న నేటి ధోరణుల్ని తీవ్రంగా విమర్శించాడు ఈ సుకవి. ఈ సుకవి ఎవరో కాదు, ఆయనే శ్రీ గుంటురు శేషేంద్రశర్మగారు. శ్రీశర్మగారు 1927 అక్టోబర్ 20 న నెల్లూరు జిల్లా నాగరాజుపాడు గ్రామంలో జన్మించారు. సుబ్రహ్మణ్యశర్మ, అమ్మాయమ్మ దంపతులకు వరప్రసాదం అయిన శర్మగారు గుంటూరు ఆంధ్ర క్రిష్టియన్ కాలేజి నుంచి భౌతిక రసాయన శాస్త్రాలతో బి.ఎ. పట్టం పుచ్చుకొని, మదరాసు లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. యింటివద్ద తండ్రి జాగ్రత్త పెట్టిన సంప్రదాయ విజ్ణానం ఆపోశనం పట్టారు. ప్రతిభా వ్యుత్పత్తులకు ప్రపంచ పర్యటనానుభవం తోడయింది. ప్రియపత్ని, ప్రసిద్ధ ఇండో-యాంగ్లియన్ కవయిత్రి, రాజకుమారి ఇందిరాదేవి ధన్ రాజ్ గిర్ సహచరిగా, సహధర్మిణిగా సమకూడినది. ఇటు తెలుగున కైకలల్లుతూ, అటు ఇంగ్లీషు చేస్తూండడం వ్రతసమానంగా కవిత్వాన్ని రచించారు. హైదరాబాద్ పురపాలకశాఖలో కమీషనర్ గా ఉద్యోగం చేశారు. కవి, విమర్శకులు, పండితులు అయిన శేషేంద్ర యూరోప్, పశ్చిమ జర్మనీ పర్యటనలు చేశారు. మేఘదూతానికి, రామాయణానికి సంబంధం అనే అంశం పైన గోటింజెన్ విశ్వవిద్యాలయం ఇండాలజీ శాఖలో పేపరు చదివినారు. కవిసేన సాహిత్యోద్యమ స్థాపకులుగా కవిత్వంలో 'స్లోగనిజం' పోయి సిసలైన కవిత్వం ఉండాలంటారు. శేషకవనశైలీవిన్యాసం మా నీతికి శేషించినది నీది; నీ చేతికి శేషించినది మాది, అని ప్రతాపరుద్రీయంలో వెంకటరాయశాస్త్రిగారు అన్నారు. అలాగే, శేషేంద్రశర్మగారు గురించి చెప్పాలంటే, అశేషం ఎప్పుడూ వుండదు, నిత్యం సశేషం. సామ్రాజ్య శిధిలావశేషాలలా కవిరాజులు, కవిసామ్రాట్టులూ యింకా నిలిచివున్నారు అని ఒక రచయిత చెప్పినట్లు, అలా ప్రతిభావంతంగా నిలచిపోయిన కవివర్యులలో, గుంటూరు శేషేంద్రశర్మగారు ప్రమధగణప్రతినిధులు. 'సౌరాబ్' అనే స్వతంత్రానువాదకావ్యంతో ఆరంభమయిన కవితా వ్యాసంగం, 'నాదేశము, నాప్రజలూ అనే ఆధునిక ఇతిహాస పరికల్పనగా శిఖరస్థాయి నందుకుంది. శేషేంద్రశర్మ 'పారిపోయినా కవిత్వాన్ని చేరబిలిచిన రసవాది. శ్రీశ్రీ, తిలక్ ల స్థాయిని ఎన్నవలసిన కవి. చందోబద్ధకవితాధారగా పేరుపొందినవి - ౠతుఘోష, పక్షులు కవితాఖండికలు. ముక్తచ్చందమై వెల్లివిరిసినవి, శేషజ్యోత్స్న, మండేసూర్యుడు కౄతులు. సంస్కౄతాంధ్ర సాహిత్య మధనం ఫలితంగా, రామాయణ రహస్యాలని 'షోడశీ రూపంలో సాహితీవినువీధుల్లో ప్రఖ్యాతమైంది. నైషధీయ చరితకు సరసవ్యాఖ్యానాన్ని 'స్వర్ణహంసాని పున:సౄష్టి చేశారు. ప్రబంధకవుల పరామర్శప్రబంధంగా 'సాహిత్య కౌముదీ ని రచించారు. అపూర్వ విమర్శ సాహిత్యాన్ని ప్రసాదించిన శర్మగారి యితర కౄతుల్లో, హాస్య వ్యంగ్య రచన, చంపూ వినోదిని, బోదిలేర్ ఫ్రెంచి కవితకు అనువాదంగా 'పడవలు కెరటాలూ సాహితీసంద్రంలో తేలియాడింది. శేషన్ కవితాప్రతిభకు నీరాజనాలు నేడు అభ్యుదయ కవిత్వం కింద చెలామణీ అవుతున్న సిద్ధాంతప్రాయమైన వాదాలేవీ వల్లించకుండా, వాస్తవమైన అభినివేశంతో ఉర్రూతలూగే కవితాఖండాలు శేషేంద్ర గారి కవితాపుటల్లో కనిపించాయని అమరేంద్ర పలవరించారు. ఈయన కవిత్వంలో రసాన్నికట్టి బంగారం చెయ్యడంకోసం తడవులాట కనిపిస్తుందని శ్రీశ్రీ శ్రీవాచకాన్ని చెప్పారు. ప్రాచీన సాహిత్యంపై గౌరవం, నవకవులపై సానుభూతి, పుష్కలమైన ఆస్తికత, సంశయము, బీదలపై సానుభూతి, వారు బాగుపడవలననే ఆతురత, ఇంకా బాగుపడలేదేమనే అక్కసూ, కర్మవాదంపై విశ్వాసమూ, ఇన్ని భావాలమధ్యనలిగిన, నలుగుతూ ఉన్న ఆత్మపెట్టే ఘోష - ౠతుఘోషా అని సమగ్రరూపంలో శర్మగారి కవనవ్యక్తిత్వాన్ని, సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులుగారు వివరించారు. విజ్ణానంతో ముడివేసిన సాహిత్యం కవిత్వమనే ఆనంద స్వరూపిణి ఏ ఒక్క రూపంలో మాత్రమే ఎందుకుంటుంది? పద్యంలో ఉంటుందా అని వెదకడం అజ్ణానం - అన్నిప్రక్రియలూ ఉండవలసిందే; దేనికి కాలం తీరితే అదే చస్తుంది. కాని దేని అకాలమరణానికీ ఎవరూ కంకణం కట్టుకోవద్దని మాత్రమే దీని తాత్పర్యం.సాహిత్యాన్ని వైజ్ణానిక సౌరభంగా ఉండనిద్దాం, అంతే, అని సాహితీస్వరూపాన్ని, వైజ్ణానికసౌరభంతో ముడివేశారు, నరుడు నక్షత్రాలు అన్న వ్యాససంపుటిలో శర్మగారు విపులవ్యాఖ్యానం చేశారు. కవితల్లో స్వగతాలు శర్మగారు చెప్పదలచిన భావాల్ని సూటిగా, వాడిగా, వేడిగా, అలతి అలతి పదాలతో పేర్చడంలో నేర్పరి. మచ్చుకు కొన్ని తునకలు, మండేసూర్యుడు ఖండకావ్యంనుంచి కవితాముత్యపుతునకల్ని ఉదాహరించాలంటే - నేను చెమటబిందువుని, నా వాక్యం ఒక పిల్లనగ్రోవి, గాయం కార్చే కాంతిలో జీవితం తిరగేస్తున్నాను, బాధల తుఫానుని ఒక్క నవ్వుతో తుడిచివేశాను, నేను లోకాన్ని చూడలేని బాధని, రాత్రి నేనుకనే కలలు - దినాలమీద కట్టే వంతెనలు, నేను అధరాలమీద మౌనం విధించుకున్న పర్వతశ్రేణిని, ఇది మానవతా లహరి - దారి కోల్పోయిన ఎడారి, నాగరికత విప్పివేసి నర్తిస్తోంది నా దేశం, మన అధరాలకు అడ్డువచ్చే నీ ముత్యాలదండలా - ఎందుకీ స్నేహితులు మన మధ్య - ఈ రోజుల్లో వాళ్ళొక మిధ్య, నా దేశం వెన్నెముక, ప్రవహించే కాలంలో పరుగెత్తే రంగుల చేప జీవితం - కన్నీళ్ళ వలల్లో పడదు - కలల గాలానికి తగలదు, బాధల్లో మునుగుతాను - సంతోషాల్లో ఉదయిస్తాను - నేను మానవ సూర్యుడ్ని, జైళ్ళు కటకటాలకే ఖర్చవుతోంది దేశంలో ఇనుమంతా - రైళ్ళ పట్టాలకు మిగలడం లేదు రవంత, రైతు నాగలి మోస్తున్నాడు క్రీస్తు శిలువ మోసినట్లు, ఈ దేశపు గర్భగుడిలో దేవుడు జీర్ణమైపోయాడు - ఆకలివేస్తోంది మరో దేవుడి కోసం, యిలా ఎన్నో ప్రయోజనాత్మక కవితా ప్రయోగాలు. శర్మగారి కావ్యం శేషజ్యోత్స్న లో - జనతను బంధించేదెవరు - సముద్రాలకూ ఝంఝఆమరుత్తులకూ సంకెళ్ళు వేసే దెవరు ?, భాషలు ఆరవేసిన వలువల్లా ఎగిరిపోతున్నాయి - దేశాల సరిహద్దులు ఈ ఝంఝామారుతాల ధాటికి గజగజ వణికిపోతున్నాయి, విధి ముళ్ళదండ మెడలో వేసినా ఎదనీండా మధువు నింపుకుని ఎదురొస్తావు చిరునవ్వుతో, రాళ్ళని రొట్టెలుగా మార్చాలంటావు - ఈ లోకం కల విలువ - నీవు మోసే శిలువ, అంగూరు చితకందే ఆసవం రాదనీ - చితికిన బ్రతుకులోతు ఆవిష్కరించావు, కొందరికే తెలుగు జీవిత శక్రచాపం వెనకున్న నగ్నత - కాని తప్పదెవరికీ ఆ రంగుల వలలో నిమగ్నత, ఏది ఎందుకు తారసిల్లుతుందో ఎవరూ చెప్పలేనిది బ్రతుకు - కారణాలకు అదౄశ్య దూరతీరాల్లో వెతుకు, గుండె గాయాలు చిరునవ్వులతో కప్పుకో - పాత స్వప్నాల హరాన్ని దులిపి మెడలో ధరించుకో - కార్చే కన్నీళ్ళు కనురెప్పల్లోనే దాచుకో, ఇది రంగుల నెల పరిమళాల నెల పువ్వులనెల నవ్వుల నెల - చూడు, జీవితం ఎక్కుపెట్టిన దనుస్సులా వుంది, చుక్కల గుంపుల్లో ఉన్నా జాబిల్లి - గగనంలో ఒంటరి బాటసారి నీవు రాకుంటే, లాంటి శ్రుతఖండికలు ఎన్నో వున్నాయి. ఆపాతమధురం - ఆలోచనామౄతం చాలామంది రచన ఆపాతమధురమే కాని ఆలోచనామౄతం కాలేకపోతున్నది. శేషేంద్రశర్వ కవిత్వానికి ఆ ఇబ్బందులు ఏమీ లేవు. ఒక వైపు ప్రకౄతి సౌందర్యం, రసలోలుపత, మరొకవైపు అజ్ణాతమైన అతీతమైన తత్త్వసంస్పర్శ కోసం తహతహల సమ్మేళణం శర్మగారి కవిత్వాన్ని ఆస్వాదయోగ్యం చెయ్యడమే కాదు, పదేపదే ఆకర్షించేలా చేస్తుంది. శబ్దాలూ అర్ధాలూ వట్టి మాటలూ కవిత్వం కావు, కవిత్వానికి కవిసౄష్టి కావాలి అంటారు శర్మగారే. బ్రతుకే ఒక దరహాసం, మనసే ఒక మధుమాసం. ఒకక్షణం మధుర క్షణము, ఒక క్షణం చేదు క్షణము, బ్రతుకొక అతుకుల బొంత, శేషేంద్రకు నీవే అంతా - అన్న శర్మగారి కవితాభాషణమే, ఆయన కవితకు సహజత్వం, సార్ధకత్వం, ప్రతిభతో కూడిన ప్రమాణత సంతరించుకున్నాయి అని చెప్పడంలో అత్యుక్తి అని భావించాలి. 'నా కవిత్వం నాటి నుంచీ నేటివరకూ గమనించిన వాళ్ళకు ఒక అంతర్లహరి అన్నిటిలో అనుస్యూతంగా ప్రవహిస్తూ ఉండడం ద్యోతకమవుతుంది. అదే శర్మగారి కవిత్వంలో స్పష్టమైన రూపం ధరించింది. అదే ఈ కవి జీవనాడీ అని గుంటూరి శేషేంద్ర శర్మగారి మాటల్లోనే చెప్పుకోవడం ఔచిత్యమే. చివరిదశ వరకు కేంద్రసాహిత్య అకాడమీ విశిష్ట సభ్యుడిగా కొనసాగిన శర్మగారికి 1994లో తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రదానం చేయడం ఆయన ప్రతిభకు సంకేతం. శర్మగారి రచనలకు విశ్వప్రఖ్యాతత్వం కలగడానికి ఆయన సతీమణి యిందిరాదేవి శర్మగారి రచనలను ఆంగ్లంలోకి అనువదించడంవల్ల వచ్చినా, తన రచనలకు వచ్చిన పేరు తెలుగుజాతికి వచ్చినట్లుగానే భావించడం ఆయన హౄదయవైశాల్యానికి ప్రతిబింబం. శేషేంద్ర శర్మ గారు రచించిన ఘనకావ్యం 'నా దేశం - నా ప్రజలూ 2004 లో నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అవ్వడం, రవీంద్రునికి వచ్చిన పురస్కారం, శర్మగారికి వచ్చినంత ఆనందం వేయడం కూడ సహజం. శేషేంద్రశర్మగారి ఆత్మ సాహితీవనంలోనే విహరిస్తూ, సాహితీపిపాసుల్ని తనవంతు మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే వుంటారని, ఆయన ఆత్మకు ఆ పరాత్పరుడు శాంతిని ప్రసాదిస్తారని ఆయణ్ణి అందరం సామూహికంగా ప్రార్ధిద్దాం. ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి: మహాకవి ష్రీ గుంటూరు షేషేంద్ర షర్మగారి జయంతి సందర్భంగా (అక్టోబర్ 20) తెలుగు కవితా ప్రేమికులు నిరంతరం సాహితీప్రతిభను సర్వదిషలా వ్యాప్తి చేస్తారని ఆషిస్తూ ఈ వ్యాసాన్ని తెలుగురథం సమర్పిస్తోంది. కొంపెల్ల - తెలుగురథం.

No comments: