Sunday, September 21, 2008

ప్రపంచ శాంతి దినోత్సవం - శాంతి కై విశ్వవ్యాప్తి కృషి

ప్రపంచ శాంతి దినోత్సవం - సెప్టెంబర్ 21
శాంతి ప్రస్తావనలు
'హర్మ్యమందు (మిద్దిల్లు) శోకమున నడలుకంటే, శాంతిదాయక కాననస్థలమెమేలూ - అంటారు కవికోకిల దువ్వూరి రామిరెడ్డిగారు. కవికోకిలవి కమనీయ వాక్కులేకాక సత్యవాక్కులుకూడా.
శాంతమిద మాశ్రమపదం - కణ్వాశ్రమంలో అడుగిడుతూంటేనే శాంతి వాతావరణం గోచరించిందట దుష్యంతునికి.
భక్తప్రహ్లాదుడే మున్ను వసుధపైన నారసింహాకౄతిని శాంతిని కోరినాడు అని ఆకలిమంట అన్న రచనలో వేదాంతకవి ప్రస్తుతించాడు.
ఏ భాషలో భాషించినా శాంతి ఛందోవ్యాకరణం ఒక్కటే సుమా. పోరు మంచికాదు ధరణిలో అణువైనా అన్నది కూడ సత్యం.
దాంతునకైన, వేదాంతునకైనా శాంతము లేక సౌఖ్యమూ లేదు అన్నాడు స్వరబ్రహ్మ త్యాగరాజు.
ప్రపంచధోరణుల్లో శాంతి సందేహాలంకారమైతే, కామక్రోధసహిత రాగాహంకారాలు స్వభావోక్తిపరమయ్యాయి.
శాంతి-సమరం పోట్లాడుకునే కవలలు
ద్రవ్యానికి లొంగ్ఫనిది, సాధనతోనే సంప్రాప్తించేది, ప్రియాతిప్రియమైన అంగడిసరకు, అత్యంత విలువైనది, భారతీయ సనాతన సాంప్రదాయ వాంగ్మయంలో మోక్షద్వారానికి 'శమం' ప్రధమద్వారపాలకీయం చేస్తుంది. శమం వినా శాంతి ప్రస్తావన లేదు, రాదు. ప్రశాంతి మాటలు వేరేల? శాంతిలోపం శతౄత్వానికి దారితీస్తోంది. శతౄత్వం సమరానికి నాంది, ప్రస్తావనలే పర్వాలు. ఆషామాషి శతౄత్వాలకైతే పరవాలేదుకాని, శాత్రవుడు కంటకుడు, తనంతటవాడై సమజోడైతే, కంటికి నిదురరాదు, రతికేళి రుచించదు, శతౄవు కొరకు రగిల్చిన అగ్నికణాలు యితరుల్ని కణాలుగా కాల్చినా నీరు కార్చలేవు. సరిసములైన శతౄవుల వర్ణన అతీతమే మరి. గగనం గగనాకారం, సాగరం సాగరోపమ: అన్న సూక్తి వర్తిస్తుంది. మనోవికారాలే తప్ప రాజ్యాలు సామ్రాజ్యాధిపతులు నిత్యం పోరాడాల్సిన శతౄవులు కానేకారు. వర్గ, జాతి, రాజ్య, రాజకీయ వైరుధ్యపు పోరాట పరిష్కార ప్రయత్నాల్లో యుద్ధం, అశాంతి, అకారణంగా అనివార్యమవుతున్నాయి. సాయుధబలం కన్నా నైతికబలం విజయానికి సహాయకారి అన్నది కూడ నిజమే. ముందు నుయ్యి, వెనుకగొయ్యి మాదిరి యుద్ధం వినా అవశ్యమరణం, యుద్ధసహిత జీవన సంశయాస్పదం అని చెప్పాలి. ఎంత శాంతి యజ్ౙ యగాదులాచరించినా, శాంతికపోతాల్ని గగనసీమల్లోకి వదలినా, సత్యాగ్రహాలు, నిగ్రహం కోల్పోయాక, ప్రయోజనరహిత ప్రజ్ౙాన ప్రక్రియలుగా అవతరిస్తాయి.
వ్యక్తి నుంచి ప్రపంచం వరకూ ...
ప్రపంచశాంతి కన్నా, వ్యక్తి మారనిది ఏ శాంతీ నిలవదు. తన అశాంతిలో ప్రపంచశాంతిని కాలదన్నుకుంటాడు. అందుకే, రెండు యుద్ధాల మధ్య వ్యవధి శాంతి అన్న కవివాక్కు ప్రభావాన్ని రేకెత్తే భావమనే చెప్పాలి. అందుకే శాంతి యివ్వవలసింది కానీ, పుచ్చుకోవలసినది కాదు అని అంటాడు బోయి బీమన్న కవి, విశ్వశాంతి అన్న రచనలో. ఆకలిదప్పులు తీరాలి, కామవాంఛలు తీరాలి, తోటిమానవునితోపాటు తనకు న్యాయం జరుగుతోందనే ఆత్మతౄప్తి ఏర్పడాలి, నలుగురితోపాటు తనకూ సుఖశాంతులున్నాయనే పరితౄప్తితో దు:ఖోపశమనం కలగాలి, అంతదాకా ఈ భూగోళంమీద శాంతి సిద్ధించుతుందనుకోవటం పిచ్చివాడికలవరింపు - అంటాడు ప్రముఖ రచన చంఘీజ్ ఖాన్ రచనలో తెన్నేటిసూరి.
మానవీయతకు వెన్నెముక మానవీయతకు వెన్నెముక, సాధనకు శ్వాసవంటిది శాంతి. కామక్రోధరాహిత్యాన్ని వికసింపజేసి సాధించేది ప్రశాంతి. శాంతిసాధన, ఆత్మవివేచనాత్మక కళారాధన, ఆద్యంతాలు లేని నిష్కళంకమూర్తి. సర్వకాల శక్త్యానుభవాల్లో ఆత్మానుభూతి అనివార్యం. ధన, విద్య, గుణ, బలాల్లో కూడ శాంతి కరువైపోతోంది. ప్రేమత్యాగాలు పెంపొందించుకుంటేనే శాంతికవాటాలు తెరుచుకుంటూ వస్తుంది. శతౄత్వాన్ని సత్యంగా ఎదుర్కోవాలి. శాంతి పర్వాన్ని సమరాధ్యాయానికి జోడించాల్సిన సమయం ఆసన్నమైంది. నిరంకుశపు దుష్కరాల్ని బాహాటంగా ప్రకటించాలి. ప్రస్తుతం దారుణాతిదారుణంగా రెచ్చిపోతున్న అమెరికాసామ్రాజ్యపు అమానుషపు చర్యల్ని నిజంగా నిరసిస్తూ సామ్రాజ్యాన్ని సమూల బహిష్కరణ కావించాలి. శిశుభాషలో కటిఫ్ చేసేసి, జట్టుకి పచ్చి కొట్టేయాలి. ప్రతీ భారతీయ పౌరుడు అందుకొన్న అమెరికా వీసాలను ఆగ్రహావేశాలతో విసరివేయాలి. ఆ తరుణం ఆసన్నమవుతుందా? ఆత్మాభిమానాన్ని ఆవగింజంతైనా పదిలపరచుకొని, త్వరితగతిని స్వర్ణాంధ్రభారతానికి తిరుగు ప్రయాణం కావించాలి. అధ్యాయాన్ని ప్రారంభించి, ముగింపుకు శుభారంభం చేయాలి. నవీన ప్రపంచీకరణ, సరళీకౄత నాయకత్వపు కుహనాపథాలకు దొంగ సలాములు మానాలి. ప్రస్తుతం వీస్తున్న అణు ఒప్పొందం పై వివాదపు గాలి, అమెరికా వెలగబెట్టిన రహస్యపు ఒప్పందపు పత్రాలు ఒక ఉదాహరణ అనే చెప్పాలి. భారతదేశం యిటువంటి పరువుతక్కువ ధోరణులకు భరతవాక్యం పలకాలి. వాణిజ్యపు విపణివీధులకు వావివరుసల్ని ప్రకటించాలి. వేదోపనిషత్తుల ప్రవచనస్వరాలను స్వరాలాపనం చేస్తూ శాంతిసూక్తుల్ని శ్రావ్యపఠనం కావించాలి. ప్రపంచం యావత్తూ ప్రశాంతిమయంగా మారాలని, ప్రసన్న మనస్కులై చిత్తశుద్ధితో చిదానందంగా యావజ్జగత్ప్రజానీకం ప్రశాంతమూర్తులై ప్రభవిల్లాలని ప్రార్ధనా తరంగాలని ప్రవహింపజేయాలి.
నాకు శాంతి కావాలి
'నాకు శాంతి కావాలీ అని ప్రతీ పౌరుడూ ఏదో దశలో భావించడం జరుగుతుంది. నాకు - అహంకారపూరితమైనది. కావాలి - కాముకతకు ప్రతిబింబం కవాటాల మధ్య రెంటికీ నడుమ శాంతి కపోతం రెపరెపలాడుతుంది. యుద్ధంలో వెనుకంజ వేయడం బుద్ధిహీనత. అనివార్యయుద్ధం అంటూవుండదు. యుద్ధం వచ్చింది అంటూవుండదు. యుద్ధం వచ్చింది అంటే మానవమేధస్సు విఫలమైంది అని చెప్పాలి. ఈ భావననే ప్రముఖ ఆంగ్ల రచయిత టి. యస్. యిలియట్ - హోల్డర్స్ హాక్స్లీ - అన్న రచనలో : 'శాంతి, ప్రశాంతి, మిగిలింది అశాంతీ, అంటాడు.
నేను సైతం ప్రపంచశాంతికై ...
దేశాలు యుద్ధాల్లో పుట్టాయి. సామ్రాజ్యాలు శాంతిలో ఆవిర్భవించాయి. యుద్ధం రాజకీయాల కొనసాగింపు, రాజకీయం యుద్ధానికి కొనసాగింపు. యుద్ధాల ద్వారా యుద్ధాలను ఆపలేని వాస్తవం. ఈ పరిస్థితుల్లో ప్రపంచ పరిధికి అర్ధం మారుతున్నా, విశ్వం - వినాశక విషయానికి వేరే అర్ధరూపకత, వేరే భావసౌందర్యత భాసిస్తోంది. అందరూ యోధులే జీవితసమరంలో. కొందరు అగ్రసరులు, కొందరులు అనుసరులు. ఈ రంగ, రణరంగ, రణగొణ ధ్వనులమధ్య శాంతికై తపన, ప్రపంచశాంతికై శాంతి కాముకుల పవిత్ర యత్నంలో, నేను సైతం ...ప్రపంచశాంతికి ... అన్నట్లు సంకల్పదీక్షాకంకణ బద్ధుడను అని ప్రతీవ్యక్తి భావించి, ఆచరణకు నోచుకోవాలి.
ఏది ఏమైనా, శ్రీశ్రీ ప్రహేళికలో గడికి సహాయవర్ణాన్ని చెప్పినట్లు - ఓరీతులువా! పద్ధతులు మార్చు - అన్న వివాదపువిన్యాసాలమధ్య నిలిచేది నేటి నినాదం.
సత్యం - ధర్మం - ప్రేమ - శాంతి, ఒకభాగం ఆచరణ, యింకొక భాగానికి దారితీస్తుంది.
అంతర్జాతీయ/ప్రపంచ శాంతి దినోత్సవం - 21 సెప్టెంబర్
అంతర్జాతీయ, ప్రపంచస్థాయిలో వివిధ దేశాలమధ్య సహౄధ్బావ వాతావరణం, అహింస, శాంతి, సౌజన్యతాది భావాల సాధనకోసం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయస్థాయిలో, ప్రపంచశాతిదినోత్సవాన్ని నిర్వహించడం రివాజుగా మారింది. అంతర్జాతీయ సాధారణ సమితి చొరవ మేరకు 1981 నుంచి సెప్టెంబర్ నెలలో మూడవ మంగళవారం రోజున జరుపుకోవడం ప్రారంభించారు. జిరిమీజెల్లీ, పీస్ వండే సంయుక్త ప్రచారం మూలాన, 2002 నుంచి సెప్టెంబర్ 21 న జరుపుకుంటున్నారు. ఆ రోజు జరుపుకునే సంబరాల్లో శాంతి ఆచరణ, యుద్ధవిరమణ కొరకై తగు చర్యలు ప్రారంభమవుతాయి. అయితే, 1995 లో అరవైకి పైగా దేశాల్లోని ప్రజలు విరాళంగా ఇచ్చిన నాణేలతో ఒక పెద్ద గంటను తయారుచేసి ఐక్యరాజ్యసమితి పరిధిలోని జపాన్ కార్యాలయంలో వుంచేందుకు బహూకరించారు. న్యూయార్క్ లోని ఈ కేంద్రకార్యాలయపు ప్రాంగణంలోని వెష్ట్ కోర్ట్ గార్డెన్ లోని గార్డెన్లో ప్రతీ ఏట శాంతి దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ఈ గంట ఆవరణలో శాంతి ఉత్సవాల్ని నిర్వహించడం జరుగుతోంది. ఏడాదికి వందలవేలకోట్లు తూటాలు తయారవడం జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతీ మనిషిని రెండేసి పర్యాయాలు కాల్చడానికి సరిపడే సామగ్రిని సౄష్టిస్తున్నారని కూడ విశ్లేషకుల వాదనలు. ఏదేశం ఎంతెంత మందుగుండు సామగ్రిని ఎగుమతి చేసుకోవడంలో నిర్ధారణకు వచ్చేందుకు స్వఛ్చందసంస్థలచే సమాచారపరిశోధన కూడ చేయించడం జరిగింది.
ప్రపంచ శాంతి పురస్కారాలు
ప్రపంచవ్యాప్తంగా శాంతిసాధనలో అవిరళకౄషిని సలిపి, ఫలితాలతోపాటు గుర్తింపులను పొందిన ప్రముఖులకు పురస్కారాలను అందజేయడం ప్రారంభమైంది.
నోబెల్ శాంతి పురస్కారం
1901 లో ప్రారంభమైన నోబెల్ శాంతి పురస్కారాన్ని జీన్ హెన్రీడ్ డురాంట్ (స్విడ్జర్లాండ్), ఫ్రెడరిక్ పాసీ (ఫ్రాన్స్)లకు దక్కగా, 2006 లో బంగ్లాదేశ్ లో సూక్ష్మ పరపతి, ఆర్ధికరంగంలో విశేషకౄషిని సలిపిన బంగ్లాదేశ్ గ్రామీణబాంక్ అధినేత - మహమ్మద్ యూనస్ కు దక్కడం విశ్వవ్యాప్తంగా చెలరేగిపోతున్న బీదజనావళికి అంకితంగా భావించవచ్చు. 1979 లో నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రముఖ సేవకురాలు మదర్ తెరిస్సా ను వరించడం మనదేశానికి గర్వకారణం.
లెనిన్ శాంతి పురస్కారం
1950 లో ప్రారంభమైన లెనిన్ శాంతి పురస్కారాన్ని ప్రధమంగా ఫ్రెడరిక్ జోలియట్ క్యూరీకి అందిస్తే, 1990 లో ప్రకటించిన లెనిన్ పురస్కారం నెల్సన్ మండేలాకు లభించడం ఒక సంగతైతే, దక్షిణాఫ్రికా లో అనుభవించిన జైలుశిక్ష మూలాన 2002 లోనే అందించారు.
2008 ఉత్సవాలు - యోగసాధన ద్వారా శాంతి సాధన
ప్రపంచ/అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఈసారి, అంటే 2008 సంవత్సరం, ప్రతీ మానవ కుటుంబం శాంతి వర్గానికి ప్రతినిథి కావాలని, ఈ సందేశం ద్వారా శాంతిసాధనం కావించాలని తీవ్రప్రయత్నాలు ముమ్మరంగా జరుపుకునే పండగ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాం. ప్రపంచ మానవాళి, వివాదం, బీదతనం, ఆకలి, మానవ హక్కుల రక్షణ, సాధన యిత్యాదీంశాలపై కౄషి చేసి, వాటిని త్వరలో నిర్మూలించే దిశదశల్లో కౄషి చేయాలి అన్నది ఐక్యరాజ్యసమితి సందేశం అందించింది. ప్రపంచ శాంతి విషయాన్ని దత్తత తీసుకుని అరవై ఏళ్ళు పూర్తికావడం మరో విశేషం. అయితే, అంతర్జాతీయ స్థాయిలో శాంతిసాధనలో జరిగిన కౄషి, ఫలితాలను సాధించిన వైనాల సంగతి, అమలుదారుల విజ్ౙతకే వదలాలి మరి. ఏది ఏమైనా, మానవహక్కుల సాధనకై, విశ్వవ్యాప్తిగా తీవ్రమైన కౄషి జరగవలసింది అని మాత్రం ఘంటాపథంగా చెప్పవచ్చు.
ఆదిమధ్యాంతసహితం శాంతి
స్వేఛ్చలోనే ఏదో శాంతి, బాధలున్నా సరే, బానిసత్వంలోనే ఏదో అశాంతి బాధ లేకపోయినా సరే - అని చాలా చమత్కార భావగర్భితంగా, మ్యూజింగ్స్ లో విప్లవకవి చలం అన్నారు. అంతేకాదు, వుత్త సరదాలేని సుఖంలో బతకడమే చాతనైతే ఎన్నడో శాంతిలో స్థిరపడిపోయి వుండును మానవజీవితం అని కూడ అంటాడు చలం. డబ్బుతో శాంతిని కొనుక్కోలేం కదా అని ఏదో తెలియని విషయం చెప్పినట్లు చెబుతారు కొందరు.
శాంతినికేతన్ లో వుండే శాంతి చిత్తశాంతి - శాంతి ఉద్యమాల్లోని శాంతి రాజకీయశాంతి - అని నీలితెరలు రచనలో సూర్యారావు చిత్తం-రాజకీయం మధ్య శాంతిని యిరికించారు.
పట్టణాల్లో ప్రశాంతత విషయం ఎలావున్నా, గ్రామీణ ప్రశాంతత మురిగినీటి నిశ్చలత్వం లాంటిది అని, బంకోలా - సుబ్రహ్మణ్యశర్మ చెణుకులు విసిరారు.
ఏది ఏమైనా, ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థితిగతుల్ని మాత్రం ప్రతికూల, అనుకూల స్పందనలతో తులనాత్మకమైన బేరీజులు వేసుకోవాలి.
లేదు లేదు ప్రశాంతి భువిలో, లేదులేదు ప్రశాంతి దివిలో, అధినొందుచు దాసుడొక్కండడలునన్నాళ్ళూ - అని వ్రేల్చుడీ లో కాశీవిశ్వనాధ్ గారు దుర్భిణీ వేసి చూసినా ఆయనకు శాంతి అలభ్యం, అగోచరం.
శాంతి క్రాంతి వలన వస్తుంది. నవయుగ సంక్రాంతి వలన వస్తుంది. (వియత్ నాం - బైరాగి).
శాంతి మంత్రం
వేదోపనిషత్తుసారమైన శ్రీశాంతిమంత్రం కూడ మనకు రక్షణ కల్పిస్తోంది.
ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై తేజ స్వినావధితమస్తు మావిద్విషావహై.
ఓం శాంతి: శాంతి: శాంతి:
ఈ సందర్భంగా మన ప్రపంచం, ధరణి, విశ్వం, జగతి ప్రశాంతినిలయంగా సత్వర, సత్య, నిత్యంగా విరాజిల్లాలని ఆ ధరణీమాతకు ప్రార్ధిస్తూ ప్రపంచ శాంతి దినోత్సవం అర్ధవంతంగా జరుపుకోవాలని, విశ్వమానవాళిని ప్రార్ధించడం సముచితం.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments: